ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/మనస్తత్త్వ పరిశోధక సంఘము

వికీసోర్స్ నుండి

32. మనస్తత్త్వ పరిశోధక సంఘము

మాతండ్రి చనిపోయిన మొదటి దినములలో దు:ఖాతిరేకమున నాకు మతి తొలఁగిపోవునటు లుండుచువచ్చెను. మొన్న మొన్నటి వఱకును ఆరోగ్యానందము లనుభవించి మనుచుండెడి జనకుఁ డింత వేగమె మటుమాయ మగుట నా కాశ్చర్య విషాదములు గొలిపెను. మృత్యువుతో మన మనోవృత్తు లన్నియు నశించునా, లేక పిమ్మటకూడ నవి వేఱు పరిస్థితులలోఁ గార్యకలాపము సాగించునా యని నేను దలపోయువాఁడను. నేనా దినములలో నొకప్పుడు రాజమంద్రిలో "ఇండియన్ మెస్సెంజరు" పత్రిక చదువుచుండఁగా దానిలో "లండను మనస్తత్త్వ పరిశోధక సంఘము" వారి యొక్క నూతన గ్రంథ విమర్శనము కానఁబడెను. అది నే నతి కుతూహలమునఁ జదివియుఁ దనివి నొందక, ఏతత్గ్రంథకర్తయగు రిచర్డుహాడ్జిసను గారికి తమపుస్తకప్రతి నాకుఁ బంపుఁడని అమెరికాకు వ్రాసితిని. ఆయన నాకుఁ బంపిన పుస్తకము ప్రేమపూర్వకమగు లేఖయును, 1899 సంవత్సరము జనవరి 30 వ తేదీని నా కందినవి. ఆసాయంకాలమునుండియే నే నాగ్రంథపఠన మారంభించితిని. రాత్రులందును, పగలు పాఠశాలలో తీఱిక సమయమందును, నే నా పుస్తకమును జదువుచుండువాఁడను. అందలి "జి. పి. సందేశములు" అనుభాగము అత్యద్భుతముగ నుండెను. ఈవార్తలే యధార్థ మైనచో, మనస్సునకు మరణానంతరదశ కల దనుట స్పష్టము. హాడ్జిసనుగారికి నేను బుస్తకపువెల నంపుచు, పైపరు దొరసానిగారిని మాతండ్రిని గూర్చి ప్రశ్నలడుగుటకై యాయన జాబులు నే నంపవచ్చునా యని వ్రాసితిని. ఇపుడు చేరిన పుస్తకము చదివినకొలఁది నా కాశ్చర్య ప్రమోదము లతిశయించెను. పగ లనక రాత్రి యనక నే నా పుస్తకసారమును గ్రోలితిని. జీవాత్మ మరణావస్థకు లోనుగాకుండుట కింత యమోఘ నిదర్శనము గానవచ్చుటయే న న్నాశ్చర్యమగ్నుని జేసెను.

హాడ్జిసనుగారి యోజనచొప్పున నేను సమాజకార్యదర్శికి లండనునగరము వ్రాసి, అందు సహాయసభ్యుఁడ నైతిని. అప్పటినుండియు నాకు సమాజ ప్రచురణములు క్రమముగ వచ్చుచుండెను. హాడ్జిసను గారి పుస్తక విమర్శనము లనేకములు చదివితిని.

మేము బెజవాడలో నెలకొల్పిన "సంఘసంస్కరణసభ"కు నేను సభ్యునిగ నుండి, రామదాసుగారు పట్టణమున లేకుండుకాలమునం దా సమాజకార్యదర్శి నైతిని. ఆ సమాజమువా రిపుడు హిందూ బాలికా పాఠశాల నొకటి నెలకొల్ప 4 వ ఫిబ్రవరిని తీర్మానము చేసిరి. బెజవాడలో క్రైస్తవ బాలికాపాఠశాల లనేకము లుండెను. క్రైస్తవ విద్యాశాలలో బోధకుఁడనగు నేను వారిసంస్థలకుఁ బోటీగా నుండు విద్యాలయమును స్థాపించు సంఘమున నుంటినేని, మిత్రులు వెంకటరత్నమునాయుఁడుగారివలెనే క్రైస్తవమత సంఘమువారి యనుమానములకు గుఱియై యుద్యోగము గోలుపోవలసివచ్చు నని, నేను సంఘసంస్కరణ సమాజ సభ్యత్వమును విరమించు కొంటిని.

ఆసమయమున మా బెజవాడ పాఠశలలోని యుపాధ్యాయులలో కక్ష లేర్పడెను. ప్రథానోపాధ్యాయుని చర్య లెవ్విధమునను తృప్తికరముగఁ గానఁబడలేదు. కావున సహాయోపాధ్యాయులలో పలువురకు వారియం దిష్టము లేదు. క్రైస్తవ బోధకుఁడగు సాంబమూర్తిగారు బహిరంగముగ నాయనదెస నిరసన చూపుచుండువాఁడు. ఎందును తటస్థభావమున మెలఁగ నా కభ్యాస మయ్యును, సౌజన్య ములేని వారు నడుపు విద్యాలయమునఁ బనిచేయ నాకుఁ గష్టముగ దోఁచెను. ప్రధానోపాధ్యాయునికి నాతోఁగూడ నానాఁట వైమనస్య మేర్పడెను. చిక్కులలోనికి వచ్చి నా సాయ మపేక్షించినపుడు మాత్రము నే నాయనకు హితబోధనము చేయుచుండువాఁడను. ఆయనకు సాంబమూర్తికిని సామరస్యము కుదురుటకై మిగుల ప్రయత్నించితిని.

నే నపుడు చదివెడి పుస్తక మహిమమున, నాదృష్టి యెపుడును ఆధ్యాత్మిక విషయములకును, ముఖ్యముగ మా నాయనను గుఱించిన తలంపులకును బరుగు లెత్తుచుండెడిది. 12 వ ఫిబ్రవరిని మా జనకుని మాసిక సమయమున నేను దు:ఖపరవశుఁడ నైతిని. ఆనాఁటి దినచర్యయం దిట్లు గలదు:

"తండ్రీ నీ వెచటి కేగితివి ? ఇపు డెచట నున్నావు ? భూలోకమున నుండునపుడు నీకు వలయు సౌకర్యము లొనఁగూర్ప లేకుంటిని. ఇప్పటివలె గాఢానురాగమున నిన్నుఁ బ్రేమింపనైతిని. నిన్నుఁ గలసికొని, నీయాలింగనము గైకొన నేను వాంఛించు చున్నాఁడను."

పాఠశాలలో బోధించుటకు ముందుగ గణితపుస్తకమందలి ముఖ్యమగు లెక్కల నింటఁ జేయకుండు దురభ్యాసమువలని నష్టము నా కంతకంతకుఁ స్ఫుటముగ గానఁబడెను. ఒకగణితమె కాదు, ఏపాఠము నైనను ముందు బాగుగఁ జదివియే బోధకుఁడు తరగతిలోఁ బ్రవేశించుట కర్తవ్య మని నా కనుభవ గోచర మయ్యెను. చదువను సెరనుబడి కొంతకాలమునుండి నేను శరీరవ్యాయామము గట్టిపెట్టుట చేత, అనారోగ్యము పాలయితి నని తెలిసికొంటిని. దీని కేమిగాని, యెన్నిటికైన మందు కానవచ్చుచున్నది కాని, విషయ సుఖలాలస కౌషధము గానరాకున్నదే ! నా దేహమన స్తత్త్వములందు, స్థూలసూక్ష్మములు, మంచిచెడుగులును ఎంత విచిత్రముగ మిశ్రితములై యున్నవి !

"గృహనిర్వాహకత్వము" రెండవకూర్పు పుస్తకములు 5 వ మార్చిని నా కందెను. ఆపుస్తకము మాతండ్రిగారికిఁ గృతి యిచ్చి, కొంత మనశ్శాంతి నొందితిని. నాకోరికమీఁద నామిత్రులు కామశాస్త్రులుగారు కృతిపద్యములు రచియించి యిచ్చిరి. ఆ పుస్తకపు ప్రతులు పలువురు కొని చదివిరి. పుస్తకములు అమ్ముడు వోయిన కొలఁది, చేత సొమ్ము చేరి, నాకు ప్రోత్సాహము కలిగెను.

సుఖదు:ఖము లొకటి నొకటి వెంబడించుచుండును. 11 వ మార్చి, తేదీని చెన్నా ప్రగడ సూరయ్యగారు చనిపోయిరను దు:ఖ వార్త వింటిని. ఆయన సత్పురుషుఁడు. కొన్ని సంవత్సరములనుండి పరీక్షలో నపజయ మందుచుండు మిత్రులు కనకరాజు గంగరాజుగార్లు బి. యల్. పరీక్షలో నీమాఱు గెలుపొంది రని విని మిగుల సంతోషమందితిని.

12 వ మార్చిని బెజవాడ రెయిలుస్టేషనుకుఁ బోయి, ప్రయాణము చేయుచుండు వీరేశలింగముగారిని జూచి వారికి భోజన సదుపాయము చేసితిని. ఈ యుదారపురుషునికిఁ జిరాయు వొసఁగు మని దేవదేవుని వేఁడుకొంటిని. మిక్కిలి శ్రమపడి యెట్టకేల కీరోజున, "జీవాత్మ పరమాత్మలను" గూర్చిన నా విమర్శన వ్యాసమును రాత్రి 8 గంటలకు సిద్ధము చేసితిని.

33. చెల్లెలి వివాహము

నేనిదివఱకు వ్రాసిన "జీవాత్మ పరమాత్మల" విమర్శనము సరిచూడుఁడని వెంకటరత్నమునాయఁడుగారికి బందరు పంపితిని. ఆయన తది 20 మార్చిని నాకు మరల నంపివేసెను. వారిసూచనల ననుసరించి నే నా వ్యాసమున వలసినకొలఁది మార్పులు చేసి, శుద్ధప్రతి వ్రాసి, 3 వ మార్చిని కలకత్తాకుఁ బంపివేసి, మనస్సునఁ గొంతయుపశమనము గాంచితిని.

బాధపిమ్మట బాధనాకు గలుగుచువచ్చెను. ఇదివఱకు నేనారంభించిన 'హిందూసుందరీమణుల చరిత్రములు' పూర్తియగుచుండెను. న్యాయశాస్త్రపుఁజదువు లొకవిధముగ సాగుచుండెను. నన్నిపుడు వేధించునది కార్యభారము కాదు. నా కప్పిచ్చిన రాజారావు తనసొమ్మీయు మని తొందరచేయసాగెను. అప్పులనుగూర్చి తలంచుటయే నాకు బాధాకరముగ నుండెను. ఎటులో కష్టపడి, ధనసంపాదనము చేసి యప్పులు తీర్చుట పురుషధర్మమని నాకు నచ్చెను. సోదరుల తోడ్పాటున నీఋణశత్రువును సులభముగ నిర్జింపవచ్చునని యెంచితిని. 28 వ తేదీని ఆంధ్రసారస్వత విషయములను గుఱించి వీరభద్రరావుగారితో మాటాడుచు, వీరేశలింగముగారి జీవితచరిత్ర నేను వ్రాసెద నంటిని. "దరిద్రాణాం మనోరథా:"!

5 వ ఏప్రిలున మా పాఠశాలలో ఎడ్డీ యను యువ క్రైస్తవమతప్రచారకుఁడు ఉపన్యాసమిచ్చెను. అతనికి విపరీత క్రైస్తవమతాభి నివేశము గలదు. జ్ఞానవిచక్షణకంటె పట్టుదలయే యాతనియం దధికముగఁ గానిపించెను! ఈ మహనీయుఁడే నాయుఁడుగారు బందరునుండి కదలిపోవుటకు ముఖ్యకారణ మని నాకుఁ దెలి సెను. ఆతని వైఖరియు