ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/ప్రహసన విమర్శనము

వికీసోర్స్ నుండి

యని చూప రనుకొనిరి. మా తలిదండ్రులు సాయంకాలమునకు రాజమంద్రి వెడలిపోయిరి. నేను, సోదరులు, మిత్రులును ఆదినమున ధవళేశ్వరములో నిలిచి, ఆనకట్ట మున్నగు దృశ్యములు చూచి వచ్చితిమి. మఱునాఁటి ప్రొద్దున పెండ్లివా రందఱిని రాజమంద్రియందలి మా యింటికి గృహప్రవేశమునకుఁ గొనివచ్చితిమి.

18 వ జూను సాయంకాలమున పురమందిరమున ప్రత్యేక ప్రార్థనసమాజసభ యొకటి జరిగెను. "సత్యసంవర్థనీ"పత్రిక యిఁక ముందు నా యాజమాన్యమున బెజవాడలో ముద్రణమై, రాజమంద్రిలో ప్రచురింపఁబడునట్టుగ తీర్మానమయ్యెను !

అంత మేము బెజవాడ వెడలిపోవలసిన తరుణము వచ్చెను. నాభార్య మాతో రాలేకపోయెను. అందువలన, నాకును చిన్న తమ్ముఁడు సూర్యనారాయణకును బెజవాడలో భోజనసౌకర్య మొనఁగూర్చుటకై, మా చిన్నప్ప మాతో వచ్చెను. 20 వ తేదీని మేము బెజవాడ చేరి, వీరభద్రరావుగారిని గలసికొంటిమి. తన చిన్నకుమారుఁ డిటీవల చనిపోవుటచేత, ఆయన దు:ఖతోయములఁ దోఁగియుండిరి.

27. ప్రహసన విమర్శనము

మరల బెజవాడపాఠశాలలోఁ జేరి నా కార్యక్రమమును జరుపుకొను చుంటిని. ప్రార్థనసమాజసభలు నితరసంస్థలును యథాప్రకారముగనేసాగుచుండెను. జూన్ 26 వ తేదీని జరిగిన ప్రార్థనసభలో నేను భాగవతమునుండి కొన్ని పద్యములు చదివి, వాని సారమునుగూర్చి ప్రసంగించితిని. ప్రార్థనసమయమున తమ్ముఁడు సూర్యనారాయణను సద్దు చేయవలదని వారించితిని. ఆరోజునసాయంకాలమునందు ప్రాఁత వలసిన ముఖ్యలక్షణములు, దీనికి లేకపోలేదు. ముందలి సంపుటముల యందు పాఠకులకు రుచి కలిగించుటకోయన, ఈ గ్రంథమున మతికెక్కిన పంతులుగారి ప్రహసనములు ముద్రితమయ్యెను. గ్రంథకర్తకు స్థిరకీర్తినాపాదించిన వారి హాస్యరసయుక్తసంభాషణా ప్రహసనము లిందుఁ గలవు. 'శకునములు' 'మూఢభార్య - మంచిమగఁడు' - 'ఆచారము', 'పెళ్లి వెళ్లినతరువాత పెద్దపెళ్లి', 'బాలభార్య - వృద్ధబర్తృ సంవాదము', 'హిందూమతసభ,' మున్నగు నీచిన్న చిన్న ప్రహసనముల చవిగాంచనివా రెవరు గలరు? ప్రకృతాంధ్రవచనమునకువలెనే, ప్రహసనరచనమునకును వీరేశలింగకవియే సృష్టికర్త ! ఇందలి హాస్యసంభాషణముల కీయన యిచ్చిన "హాస్యసంజీవని" యను పేరే తెలుఁగునప్రహసనమునకుఁ బర్యాయపద మయ్యెను. బాలవృద్ధులకును పండిత పామరులకును, - ఎల్లరికి నీరచనలు 'కరకర మని' రుచికరముగ నున్న యవి!

"ఈ ప్రహసనము లన్నియు గత 25 సంవత్సరములలో వ్రాయఁబడినవి. ఇవి బాలురు చదివి వినోదింతురు. పెద్దవారు గ్రహించి మెచ్చుకొందురు. సంఘసంస్కరణవిషయములనుగూర్చి యిందు చర్చలు గలవు. ఈ సంస్కర్తకు సంఘముతోడి సంరంభ మారంభమయినపుడు, మనలోఁ బలువురు చిన్న వారలుగ నుండిరి; కొందఱు జననమే కాలేదు. సంస్కారవిముఖమగు సంఘముతో నీవీరుఁ డొంటరిగ సమరము సాగించిన వీరి పూర్వకాలపుటపార పరిశ్రమమును, సభలు చర్చలు ప్రసంగములును ప్రబలినయీప్రశాంతసమయమున మనము సమగ్రముగ గ్రహింపక నేరక పోవచ్చును. ఆకాలమున ప్రసంగములును బహిరంగసభలును నిషిద్ధములు ! దుర్నీతి, వ్యభిచారము, మూఢవిశ్వాసములును గౌరవాస్పదమైన యాకాలమున నీశూరుఁడు దౌష్ట్యమును ఖండించి వైచెను. మతాచార్యులయాంక్షల వీరు లెక్క సేయలేదు. కలమే వీరి ఖడ్గము ! తమపలుకు క్రియారూపము దాల్చుపట్ల నీశూరుఁడు గొంక లేదు. సందియమనుమాట నీతఁ డెఱుంగకయె, సమరము సాగించెను. ఇట్టివాఁడేకదా, నిజమైన శూరుఁడు !

"ప్రకృతమున సంస్కారవేత్తలకు దుస్సాధ్యమగు కార్యముల నీధీరుఁ డానాఁడు ఒక్కరుఁడె సాధించెను. ఇట్టి క్రియాశూరుఁ డయ్యును వీరేశలింగముపంతులు హాస్యరసార్ద్రమగు మనస్తత్త్వముగలవాఁడు. ఇదిగాక పామరజనులతో మెలంగవలసినవాఁడు గావున, ప్రహసన మాయన కరముల కుచితపరికర మయ్యెను. శైలిసొంపులతోను, హాస్యంపుఁదళుకులతోను శోభిల్లెడి యీ ప్రహసనావళియందు, "దుష్టాంగమును ఖండించి శేషాంగస్ఫూర్తికి రక్షచేయు చికిత్సకునివలె" నీ రచయిత, సాంఘికానర్థముల నుఱుమాడెను ! ప్రభుత్వోద్యోగి యొకఁడు లంచము పుచ్చుకొనినను, పెద్దమనుష్యుఁ డొకఁడు వేశ్య నాదరించినను, ఆసంగతి యా వారపు "వివేక వర్ధని" నెక్కిరింపవలసినదే ! వ్యక్తులమనసులు నొచ్చిన నొవ్వనిండు, వ్యాజ్యెముల కెడమిచ్చిన నెడమీయనిండు, వీరేశలింగముపంతులు, సంఘమువారి చిన్న బాధలు లెక్కగొనక, తన విద్యుక్తకార్యములను మోమోటములేక నెఱవేర్పవలసినదియే !

"తమిళపత్రికలు సంఘసంస్కరణమున కంతగ సుముఖములు గావని కొందఱితలంపు. దీనిలో సత్యము లేకపోలేదు. ఏదేశమునఁగాని భాషకు భావమునకును గొంత యానుగుణ్య మేర్పడకతప్పదు. ప్రకృతాంధ్రసారస్వతము సంఘసంస్కారప్రచారమునకు సహాయకారియె యని చెప్పవచ్చును. తెలుఁగుపత్రికలు పుస్తకములును సామాన్యముగ సంఘసంస్కరణానుకూలములె. ఆంధ్రసారస్వతమునకును, ఆంధ్రజనుల లో సంఘసంస్కరణానుమోదమునకును నిట్టి సమ్మేళన మొనఁగూర్చినప్రతిష్ఠ, ఆంధ్రకవిశేఖరుఁడగు వీరేశలింగము పంతులకే ముఖ్యముగఁ జెందవలయును.

"ఆంధ్రజనులు, తమ కిష్ట మున్నను లేకున్నను, వీరేశలింగముపంతుల తలంపులే తలంచుచున్నారు. వారిపలుకులే పలుకుచున్నారు. కొలఁది కాలములో వారికార్యములే యాచరించెద రని మాయాశయము. ఇది భగవదుద్దేశము. లూధరు మహాసంస్కర్తను వెక్కిరించిన సమకాలికి లందఱు సమాధులలోని కెక్కినను, వారిసంతతివారే లూధరునికి స్మారకచిహ్నముగ మహాసౌధనిర్మాణము చేసిరి. వీరేశలింగ వ్యక్తియొక్క యూహలు పలుకులు పదములును శక్తిమంతము లైనను, ఆయనక్రియలే మనకు ముఖ్యములు మనము ధన్యులము కాఁగోరితిమేని, యా మహాశయుని బోధనలు విని, పలుకులు మననముచేసి, కార్యముల ననుకరింపవలయును"

28. "హిందూసుందరీమణులు"

1898 వ సంవత్సరము మార్చి 22 వ తేదీ శనివారము నేను 4, 5 తరగతుల విద్యార్థులకు పరీక్షలు చేసితిని. ఒకపిల్ల వాఁడు ప్రశ్నకాకితముల కుత్తరువులు వ్రాయుచున్న వానివలె నటించి, పరీక్షా సమయమున నేదో పుస్తకపుఁ బుటలు తిరుగవేయుచుండెను. నే నట్టె చూడఁగ, అది "కళాశాస్త్రము"! నే నా పుస్తకమును దీసికొని, ఈ సంగతిని విచారించి విద్యార్ధినిఁ దగినట్టుగ శిక్షింపుఁ డని యచట నిలుచుండిన ప్రథమోపాధ్యాయునిఁ గోరితిని. ఆ పిల్ల వానినిగుఱించి మిగుల విషాదమందితిని. విద్యార్థులకు నీతిబోధనము చేయుట కొక సమాజ ముండుట యావశ్యకమని తలంచితిని.