ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/నూతనోద్యోగము

వికీసోర్స్ నుండి

51. నూతనోద్యోగము

1902 వ సంవత్సరము జనవరి 28 వ తేదీని నాకు బెజవాడ పాఠశాలాభవనమున విద్యార్థులు నుపాధ్యాయులును గలసి వీడ్కో లొసంగిరి. అపుడు వారు సమర్పించిన విజ్ఞాపనపత్రము నందు, ఈ పాఠశాలలో నీ యెనిమిది సంవత్సరములనుండియు నందఱి మెప్పు నొందునట్టుగ నా విధ్యుక్తములు నెరవేర్చితి ననియును, విద్యార్థుల యవినీతి నడంచుటయందు నే నమితశ్రద్ధ వహింతి ననియు, బోధనమూలమునను సాహితీసంఘముల చర్చలలోఁ బాల్గొనుచును విద్యార్థుల మనోవికాసమునకు నే నధికప్రోత్సాహము గలిగించితి ననియు, విద్యార్థులతోఁ గలసి మెలసి యాటలాడుచు వారికి దేహారోగ్య భాగ్యము గలిగించితి ననియును వారు చెప్పిరి. నా కాసమయమున నొక వెండిగడియారముకూడ బహుమాన మీయఁబడెను.

ఇంతకాలమునుండియు బోధకునిగ నుండిన యీపాఠశాలను, ఈ నగరమును, విడిచిపోవ నా కమితసంతాపకరముగ నుండెను. ఆరాత్రి యధిక భావోద్రేకమున నాకంటికిఁ గూర్కు రానేలేదు ! ఇటీవల సంభవించిన నాకనిష్ఠసోదరుని మృతి, దొరతనమువారి యుద్యోగవిషయమై నే పడినయలజడి, నూతనోద్యోగమునందు నాకుఁ గలుగనున్న కష్ట సుఖములు, - వీనియన్నిటినిగుఱించియుఁ దల పోయుచు, నే నారాత్రి జాగరము చేసితిని ! మఱునాఁడు ప్రొద్దుననే లేచి భార్యసమేతముగ నేను రెయిలులోఁ గూర్చుంటిని. మాకు వీడ్కో లొసంగుటకు నుపాధ్యాయులు, వియార్థులు ననేకులు రెయిలుదగ్గఱకు వచ్చిరి. వారియొద్ద సెలవుగైకొని మే మంత రెయిలులో బయలుదేఱితిమి. మధ్యను ఏలూరులో నొకరోజు నిలిచి, మందు పుచ్చుకొనుటకై సతి నచట నుంచి, నేను రాజమంద్రి వెడలిపోయితిని.

నేను రాజమంద్రి చేరునప్పటికి నాకొక యుత్తర మచటికి వచ్చియుండెను ! నా పూర్వమిత్రుఁడును పర్లాకిమిడి కళాశాలలో నుపాధ్యాయుఁడును నగు శ్రీ జంధ్యాల సుందరరానయ్యగా రది వ్రాసిరి. నాకు పర్లాకిమిడియుద్యోగ మిచ్చిన టెయిలరుదొర మరణావస్థలో నుండె ననియు, ఆతఁడు చనిపోయినచో కళాశాల దుస్థితికి రావచ్చు ననియును, నామిత్రుఁడు తెలిపెను ! నే నెచటికి, బోఁదలచినను, దురదృష్టదేవత ముందడుగు వేయుచుండునట్లు కానఁబడెను.

నే నిపు డిచ్చినతంతి నందుకొని, తనయుత్తరము నాకుఁ జేరు వఱకు నిచటనే నిలిచియుండుఁ డనియు, తాను బయలుదేఱుచున్నాననియును, సుందరరామయ్యగారు రాజమంద్రికి మాఱుతంతినిచ్చిరి. కావున నింకను నాసందిగ్ధావస్థ తొలఁగనేలేదు ! ఆయన వ్రాసిన యుత్తరము నా కాలస్యముగఁ జేరెను. అందులో, టెయిలరుదొర చనిపోయె ననియు, నేను బాగుగ నాలోచించి మఱిరావలె ననియును మాత్రమే యుండెను ! ఇదివఱకు దొరతనమువారిపని పోయి, యిపుడు పర్లాకిమిడియుద్యోగఁపు సంగతి యిట్లు కాఁగా, ఎప్పటి బెజవాడయుద్యోగమే నాకు తుదకు గతి యగునట్లు తోఁచెను! కాని, వదలివేసిన పనికొఱ కాశించుట యగౌరవ మని మాకుఁ గానఁబడెను. దైవముమీఁద భారము వేసి, ముందుచూపు చూచి, పర్లాకిమిడికిఁ జనుటకే నేను నిర్థారణచేసికొంటిని. పర్లాకిమిడి మన్య ప్రదేశమనుట యసత్య మని యాప్రాంతములందు పనిచేసి వచ్చిన మిత్రుఁడు నరసింహరాయఁడుగారు నొక్కి చెప్పిరి. కావున నేను మాతమ్ముఁడు వెంకటరామయ్యతోఁ గూడి క్రొత్తప్రదేశమునకు వెంటనే బయలు దేఱితిని.

రాత్రి నౌపడా రెయిలుస్టేషనులో మేము సుందరరామయ్యగారిని గలసికొని మాట్లాడితిమి. వెంటనే యుపద్రవ మేమియుఁ గలుగకపోయినను, కళాశాలా పరిస్థితులు వెనుకటివలె నుండవేమో యని ప్రజలు భయపడుచుండి రని యాయన చెప్పిరి.

అంత 2 వ ఫిబ్రవరి యాదివారమునాడు మేము పర్లాకిమిడి చేరితిమి. మిత్రుఁడు పైడిగంటము కృష్ణారావుగారియింట మేము విడిసితిమి. స్నేహితులు, నితరులును పెక్కండ్రు మమ్ముఁ జూడవచ్చిరి. మే మొంటరిగ వచ్చుటచేత, కళాశాలా భోజనవసతిగృహము మేడగది నా విడిది యయ్యెను. 3 వ ఫిబ్రవరి సోమవారమున నేను కళాశాలకుఁ బోయి, నా క్రొత్తయుద్యోగమునఁ జేరితిని.