ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/నిత్యవిధులు(2)

వికీసోర్స్ నుండి

7 వ ఆగష్టు మధ్యాహ్నమున తపాలజవాను నాచేత నొక యుత్తరమును నాలుగు పుస్తకములును బడవైచెను. "జీవాత్మ - పరమాత్మల" మీఁది నావిమర్శనమునకే యీనాలుగుపుస్తకములును బహుమతులని యాకమ్మయం దుండెను. ఇవి మార్టినోమహాశయుఁడు రచించిన "నీతిసిద్ధాంతములు" అను పుస్తకసంపుటములు రెండును, "మత విమర్శనము" అను పుస్తకములు రెండును. ఈ యమూల్యమగు పుస్తకము లందుకొని, నేను హర్షాంబుధి నోలలాడితిని.

హిందూదేశమునం దా సంవత్సరమున నీ బహుమతులకు పోటీచేసిన వారిలో నెల్ల, నా మిత్రులును బందరుపుర వాస్తవ్యులును నగు శ్రీ వేమూరి రామకృష్ణారావుగారికిని నాకును ఈ మొదటితరగతి బహుమానము లీయఁబడె ననియు, వేఱుప్రదేశములనుండు మఱి యిద్దఱికి రెండవతరగతి బహుమానములుగ మఱి కొన్ని పుస్తకము లీయఁబడిన వనియు, నాకుఁ బిమ్మట తెలిసెను.

"జీవాత్మ - పరమాత్మల" విమర్శనమున, ఈశ్వర విశ్వాసమునకు స్వభావజనితజ్ఞానమే ప్రధానమని గ్రంథకర్త చెప్పినవాక్యములు కొన్ని నేను విమర్శించి, ఈవిషయమున ననుభవముకూడ ముఖ్యమని నేను జెప్పితిని.

35. నిత్యవిధులు(2)

15 వ ఆగష్టున "సంఘసంస్కరణసమాజము" వారి యాజమాన్యమున బెజవాడలో నొక బహిరంగసభ జరిగెను. డిస్ట్రిక్టు మునసబు టి. కృష్ణస్వామినాయఁడుగారు అగ్రాసనాధిపతులు, నా పూర్వ మిత్రులగు కొరిటేపాటి నరసింహాచార్యులుగారు సంస్కరణ పక్షానుకూలముగఁ బ్రసంగించి రాజమంద్రిపండితులు చేసిన యాక్షేపణలను ఖండించి వైచిరి. నేను గొంచెము మాటాడితిని. సంస్కరణమునకు సుముఖుఁడగు నగ్రాసనాధిపతి, మెల్లఁగను క్రమక్రమముగను సంఘ సంస్కరణము దేశమున నల్లుకొనవలె నని చెప్పిరి.

24 వ తేదీ దినచర్యలో నే నిట్లు లిఖించితిని : -

"స్వార్థపరుని సంకుచిత స్వభావము, వాని ప్రతి పనియందును, పలుకునందును ప్రతిబింబిత మగుచుండును ! * * * నా కిపుడు కావలసినది, భాగ్యము కాదు, ఆరోగ్యము కాదు, తుదకు మనశ్శాంతి యైననుగాదు. ఇంద్రియ నిగ్రహ మొకటియే కావలయును ! దైవమా ! నాకి ది యేల ప్రసాదింపవు?"

14 వ సెప్టెంబరు దినచర్య యిటు లుండెను : - "నేఁడు భార్య, యిరువదిరూపాయిల కొక పట్టుచీర కొనుక్కొనెను. నేను గట్టిగ చీవాట్లు పెట్టఁగ విలపించెను. తుదకుఁ గావలసిన సొమ్ము కొంత నేనీయఁగా సుముఖియై సంతోషించెను. ధనమహిమ మిట్టిది గదా!"

ఇప్పుడు పఠనాలయమున జరుగుచుండెడి మా ప్రార్థనసమాజసభలకు పెక్కండ్రు విద్యార్థులు వచ్చుచుండువారు. ప్రతివారము నేదో విషయమునుగూర్చి నేను ఉపన్యాస మిచ్చుచుంటిని. ఆదివారప్రార్థన సభలేకాక బుధవార సంభాషణ సమావేశములుకూడ నేర్పఱిచితిమి. 20 వ సెప్టెంబరు బుధవారమున మొదటి ప్రసంగసభలో, "విగ్రహారాధనము" ను గుఱించి చర్చ రెండుగంటలవఱకును జరిగెను. విద్యార్థులలో పలువురు చర్చలో పాల్గొనిరి. కొందఱిమాటలలో, తెలివికంటె టక్కఱితనమే ప్రబలియుండినను మొత్తముమీఁద చర్చ సంతోషదాయకముగ నుండెను. మేము నివసించెడి యింటియజమానియగు గొల్లపూడి శ్రీనివాసరావుగారు కొంతకాలమునుండి నంజువ్యాధిచేఁ బీడింపఁబడి 24 వ సెప్టెంబరున మరణించిరి. ఆయనసతి రూపవతియు గుణవతియు నగు సుదతి. సంతానము లేదు. శవమును శ్మశానవాటికకుఁ గొనిపోవుట కెవరును రాలేదు. అంత రాజారావు వీరభద్రరావు మున్నగు స్నేహితులతోఁ గలసి నేను శవవహనమున సాయము చేసితిని.

27 వ తేదీని రామమోహనరాయల వర్ధంతిని జరిపితిమి. రాయలజీవితమును గుఱించి రాజగోపాలరావు తెలుఁగున వ్యాసము చదివి, తాను రచించిన పద్యపుస్తకములను బంచిపెట్టెను.

దసరా సెలవులకు మేము ఉభయులమును ఏలూరు వెళ్లితిమి. 20 వ అక్టోబరున నచటి పాఠశాలోపాధ్యాయుల తోఁటవిందునకు న న్నాహ్వానించిరి. కామేశ్వరరావుతోఁ గలసి నేను వెళ్లితిని. పురము వెలుపలి జామతోఁటలో కాఫీ మున్నగు ఫలాహారములు గొని, యాటలాడి వినోదించితిమి. మఱునాఁడు నాతోడియల్లుఁడు వెంకటరత్నమును, తరువాతిదినము వల్లూరి సన్న్యాసిరాజుగారును, మిత్రుల కుపాహారము లొసంగిరి. నేస్తులందఱమును గలసికొని ముచ్చట లాడు కొంటిమి. వెంకటరత్నముతోఁ గలసి షికారు పోవునపుడు, తన సంసార సమాచారముల నాతఁడు నాకుఁజెప్పెను. ప్రథమమునఁ గుటుంబ కలహములమూలమున భార్యకుఁ దనకును బొత్తు గలియకుండినను, ఇపుడు సామరస్య మేర్పడెనని యతనివలన విని సంతసించితిని. మే మంత బెజవాడ వెడలిపోయితిమి.

అక్టోబరు 23 - 24 తేదీలందు చట్టనిర్మాణసభలకు ప్రతినిధుల నెన్ను కొనుసభలు బెజవాడలో జరిగెను. మొదటిరోజున పురపాలక సంఘములపక్షమున గంజాము వెంకటరత్నముగారును, రెండవనాఁడు స్థానికసంఘములపక్షమున జంబులింగ మొదల్యారుగారును శాసననిర్మాణ సభాసభ్యు లయిరి. నే నా సభలకుఁ బోయి, "మద్రాసుస్టాండర్డు" పత్రిక ప్రతినిధిగా వార్తల నంపితిని. నా కాదినపత్రిక యుచితముగ వచ్చుచుండెడిది. రెండవనాఁడు యతిరాజులపిళ్లగారి చాయాపట ప్రదర్శనము జరిగెను. అంత 4 గంటలకు పిళ్ల గారి తోఁటవిందు జరిగెను.

నరసాపురోన్నత పాఠశాలకు ప్రథమోపాధ్యాయుఁడు కావలెనని యాదినములలో పత్రికలలోఁ బ్రకటన లుండెను. నే నీపనికి దరఖాస్తుచేసి సాయము చేయుఁడని స్నేహితులను గోరితిని.

మూఁడవ నవంబరున నేను రాజమంద్రి వెళ్లి, తల్లిని తమ్ములను గలసికొంటిని. మా తండ్రిగారి సాంవత్సరికమునకు మా పినతల్లి తప్ప మఱియెవరును రాలేదు. 6 వ తేదీని కర్మలు పూర్తిచేసికొని, నేను బెజవాడ వెడలిపోయితిని. 10 వ తేదీని న్యాయవాదిపరీక్షకు నేను దరఖాస్తు నంపితిని గాని, పరీక్షలో జయమందెదననెడి యాశగాని, జయమందినపిదప న్యాయవాది నయ్యెడికోరిక గాని, నాకు లేదు !

వేలివెన్ను వ్యాజ్యెమునకై నాకుఁ బిలుపు వచ్చుటచేత, 15 వ నవంబరున రెయిలులో నేను తాడేపల్లిగూడెము వెళ్లితిని. నాతోఁ గూడ వీరభద్రరావుగారు వచ్చి రేలంగి వెళ్లిపోయిరి. నేను తణుకు చేరితిని. అచట న్యావాదుల యభిమానమున వాది ప్రతివాదులము రాజీపడితిమి. కొంతసొమ్ము మేము వాది కిచ్చుట కంగీకరించితిమి. నే నంతట రాజమంద్రిమార్గమున బెజవాడ వెడలిపోయితిని. నేను పట్టణమున లేనిదినములలో పురప్రముఖులలో వొకరగు సింగరాజు లింగయ్యపంతులుగారు చనిపోయిరి. డిసెంబరు రెండవవారమున నాయఁడుగారు బెజవాడ వచ్చి, యీప్రాంతములందు ప్రాథమిక పరీక్షలు జరిపిరి. వారితో నేను తెనాలి నూజవీడు రేపల్లెగ్రామములు పోయి, యీ పరీక్షలో పాల్గొంటిని. నాయఁడుగారు 27 వ తేదీని మద్రాసు వెళ్లిపోయినపిమ్మట నాకుఁ గొంత విరామము గలిగి, న్యాయశాస్త్రపరీక్షకుఁ జదివితిని.

దాసు శ్రీరాములుగారి యేకైక పుత్రిక మరణించె నని 22 వ తేదీని విని మిగుల విచార మందితిమి. ఈమె విదుషీమణి.

న్యాయశాస్త్రపరీక్ష చదువులు నాప్రాణములు నమలివేయఁ జొచ్చెను ! నా కెపుడైన మనశ్శాంతి కుదురునా యని నే నాశ్చర్యపడితిని. 31 వ తేదీని "హిందూన్యాయశాస్త్రము" ను బూర్తిచేసి, తల తడిని చూచుకొంటిని. ఆసాయంకాలము ఆనకట్టుమీఁదనుండి కృష్ణానదిని దాఁటి, ఆవలియొడ్డునందలి దృశ్యములు మిత్రులతోఁ జూచివచ్చితిని. నూతనవత్సరకార్యముల నాలోచించుకొంటిని. ఇట్లు 1899 వ సంవత్సరము గడచిపోయెను.

36. "సతీయుతసంఘసంస్కారి"

ఈశీర్షికతో చిన్న యాంగ్ల వ్యాసము వ్రాసి, "సంఘసంస్కారిణీ" పత్రికకు నే నంపితిని. అది 1899 వ సంవత్సరము డిశంబరు 10 వ తేదీని ఆపత్రికయందు "బెజ" అను సంజ్ఞాక్షరములతోఁ బ్రకటింపఁబడెను. ఈ క్రింద నుల్లేఖింపఁబడిన యా వ్యాససారమును బట్టి, అందలి విషయములు కొంతవఱకు స్వకీయములెయని చదువరులు గ్రహింపఁగలరు : -

"ప్రేమాధిదేవతయగు మన్మథుడు, అంధుఁ డని యవనులకును, అనంగుఁ డని యార్యులకును విశ్వాసము. వివాహాధిదేవతస్థితి