ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/నిత్యవిధులు

వికీసోర్స్ నుండి

నియమింపఁబడిరి. ఆయన బ్రాహ్మమతవిశ్వాసియు, స్నేహపాత్రుఁడును. పాఠశాలలోఁ గొన్ని క్రొత్తయేర్పాటులు చేసితిమి. విద్యార్థుల యుపయోగార్థమై పఠనాలయము నెలకొల్పితిమి. నే నీయేఁడు ద్వితీయోపాధ్యాయుఁడ నైతినిగాన, దేవసహాయముగారి స్థానమున పాఠశాలలో వ్యాయామాధికారినైతిని.

మా పాఠశాలాప్రవేశపరీక్షాఫలితము లంత తెలిసెను. అనంతరామయ్య యొకఁడు మాత్రమే జయమందెను. మేము దీనికి నిరుత్సాహ మందక, పరిస్థితులు ముందు బాగుపడు నుపాయము లాలోచించితిమి. పాఠశాలలో పాఠనిర్ణయపట్టికలు సిద్ధము చేయు పని నే నిపుడు నిర్వహింపవలసివచ్చెను. ఈపని నే నెంత సద్భావముతోను నిష్పాక్షికబుద్ధితోను నెరవేర్పఁబూనినను, నామూలమున తమపని యందు చిక్కు లధికమయ్యె నని సణుగుకొనుచు, బోధకులు కొందఱు నాకు దుర్గుణము లారోపింప వెనుదీయకుండిరి !

ఫిబ్రవరి 14 వ తేదీని మమ్ముఁ జూచిపోవుటకు, మా చిన్న చెల్లెలు కామేశ్వరమ్మతోఁ గలసి మాయమ్మ బెజవాడ వచ్చెను. మృత్యుంజయరావు చిన్నకూఁతురు రామాబాయి చనిపోయె నని వారివలన విని మే మెంతయు విచారపడితిమి.

12. నిత్యవిధులు

నేను యల్. టి. పరీక్షకు మార్చినెలలో మద్రాసు వచ్చి కొన్ని రోజు లుంటిని. అచట నాతమ్ముఁడు వెంకటరామయ్యతోను, మిత్రులు వెంకటరత్నము, నారాయణస్వామినాయఁడు, కనకరాజు, గంగరాజు గార్లతోను నేను బ్రొద్దుపుచ్చితిని. నా తమ్ముఁడు పట్టపరీ క్షలో నాంగ్లమున తప్పి, ఆపరీక్ష కిచట చదుటకై చెన్నపురి క్రైస్తవకళాశాలలోఁ జేర నుద్దేశించెను. కలకత్తా భారనగరమున తాను నెలకొల్పి నడిపెడి "వితంతు శరణాలయమున"కు చందాలు పోగుచేయుటకై మద్రాసు వచ్చియుండిన శశిపాద బెనర్జీగారిని 5 వ మార్చి ని మిత్రులతో నేను సందర్శించి. నాకుఁ దోఁచిన కొంచెము చందా వారి కిచ్చితిని.

యల్. టి. పరీక్ష రెండవభాగమున నీరెండవసారికూడ నే నపజయముఁ గాంచుటచేత, ఆ లోపమును గొంత పూరించుటకై నేను యం. యె. పరీక్ష కింటఁ జదువ నుద్దేశించితిని. డాక్టరు సత్యనాధముగారిని జూచి, తత్త్వశాస్త్రమున యం. యే. పరీక్షకుఁ జదువ వలసిన పుస్తకములను గుఱించి వారి యాలోచనలు గైకొంటిని. కొన్ని పుస్తకములు కొని బెజవాడ తెచ్చుకొంటిని. చెన్నపురి కళాశాలలోఁ దనకు సౌకర్యము గలుగని కారణమున, వెంకటరామయ్య నాతో బెజవాడకు వచ్చి మాతల్లిని చెల్లెలిని దీసికొని రాజమంద్రి వెడలిపోయెను. బెజవాడలో మాతో నుండలేక, తమ్ముఁడు సూర్యనారాయణ వారిని వెంబడించెను !

పాఠశాలలో తోడిబోధకులగు రామమూర్తిగారు నాకీ కాలమున నిత్యసహవాసులైరి. విద్యాశాలలోను, బయటను మే మిరువురమును గలసి మాటాడుకొనుచు కాలము గడుపు చుందుము. ఆయన బోధనము ననుసరించి నే నిపుడు కార్లయిలు విరచితమగు "సార్టరు రిసార్టసు" అను గ్రంథరాజమును జదువ మొదలిడితిని. నేను యం. యే. పరీక్షకును, ఆయన బి. యే. పరీక్షలోని రెండవభాగమునకును మిగుల దీక్షతోఁ జదువ నారంభించితిమి. విద్యాపరిశ్రమమునకు ప్రాత:కాలమే మంచిసమయ మని యెంచి, మేము వేకువనే లేచి, యింటఁ బుస్తకములు ముందు వేసికొని కూర్చుండువారము. కాని, కడుపులో నాహారము లేక దేహమున నిస్సత్తువుగ నుండు సమయమునఁ జదువుట మంచిది కా దని తెలిసినవారము గాన, మే మిరువురమును నానురొట్టెను, కోకోను స్వీకరింప నారంభించితిమి. కోకోనీరు త్వరగఁ జేసికొనుటకు మరప్రొయ్యి మున్నగు పరికరములు సిద్ధము చేసికొంటిమి. కాని, యీ యుపాహార వస్తువులు సమకూర్చుకొను నాటోపమునందే విలువగల ప్రాత:కాలము వ్యయమగుచు వచ్చెను ! ఇదివఱకు పరగడుపునఁ బనిచేయుట కష్టముగఁ దోఁచెడి మాకిపుడు, నిండుకడుపుతోఁ బరిశ్రమించుట కష్టతరమయ్యెను ! అంతట, ఫలాహారములతో నారంభమైన ప్రొద్దుటి చదువు సాగియు సాగకమునుపే, సకాలమున పాఠశాలఁ జేరుటకై మేము భోజనసన్నాహము చేయవలసివచ్చెడిది ! చదువు వంటఁబట్టుట సందేహాస్పదమైనను, అజీర్ణరోగము, ఫలాహారాభ్యాసమును మాత్రము వెంటఁబడుట స్పష్టమని మే మంత భయపడి, యుపాహారములను త్యజించి యదేచ్ఛగ నుంటిమి !

పాఠశాలలో నంత నర్థసంవత్సర పరీక్ష లారంభమయ్యెను. పరీక్షాపత్రము లన్నియు నేనే చేతియంత్రమున నచ్చొత్తితిని. దీనివలనఁ దమపని సులువయ్యెనని సంతసించుటకు మాఱుగఁ గొందఱు బోధకులు, తమ పరీక్షాపత్రములు వేళకు నా కందీయక, నన్నుఁ జిక్కులుపెట్టి, మీఁదుమిక్కిలి నిందింప సాగిరి ! ఎట్టకేలకు పరీక్షలు పూర్తికాఁగా, వేసవికి పాఠశాల కట్టివేసిరి. 3 వ మేయి తేదీని, ఏప్రిలు "జనానాపత్రిక" నందుకొని, మేము రాజమంద్రి వెడలిపోయితిమి.

మే 10 వ తేదిని మిత్రుఁడు రంగనాయకులు నాయఁడుగారి యత్తగారు చనిపోఁగా, ఆమెశవమును కోటిలింగక్షేత్రమునకుఁ గొని పోయిరి. అదివఱకె యచట నాయఁడుగారి భార్యసమాధి వెలసియుం డెను. దానిచెంతనె వృద్ధురాలియస్తికలు చేర్పఁబడెను. నాయఁడుగా రాసమయమున ప్రార్థన సలిపిరి.

అప్పు పంచుకొని, నావంతు తీర్చివేయుమని తలిదండ్రులు పెద్దతమ్ముఁడును నా కిపుడు బోధించిరి. ఎటులో నన్ను ఋణవిముక్తునిగఁ జేసినచో నొక వేయిరూపాయి లిచ్చెద నని నేను వారలకుఁ జెప్పితిని. ఇది యుక్త మని మా మామగారును అభిప్రాయమందిరి.

నే నా రోజులలో సత్యనాధము కృపాబాయి గారిచే విరచితమగు "కమల" చదివి వినోదించితిని. మల్లాది వెంకటరత్నముగారి కోరిక ననుసరించి మాతమ్ముఁ డిదివఱకె యీపుస్తకమును తెనుఁగు చేయఁగా, దానిని సవరించి యిపుడు చెన్నపురికిఁ బంపితిని.

ఆసెలవుదినములలో, పాపము, మృత్యుంజయరావునకు వ్యాధి ప్రబలమయ్యెను. అతనిఁ జూచి మిత్రులు విషాదమందిరి. మా తల్లికీ వేసంగిలో మూర్ఛ యంకురించెను. ఆమె బాధకై మేము విచారించుచుండువారము. యం. యే. పరీక్షకై నే నీ సెలవులలో రాజమంద్రికళాశాలా గ్రంథాలయమందలి యుద్గ్రంథములు కొన్ని చదివి యందలి ముఖ్యాంశములను నాపుస్తకములలో వ్రాసికొంటిని.

25 వ మెయి తేదీని తండ్రి, పెదతమ్ముఁడు నేనును మా భూముల విక్రయమునకై రేలంగి పయనమై వేలివెన్ను చేరితిమి. అచట మాతమ్మునిమామ నరసయ్యగారు మాకుఁ గానఁబడి, తమ కూఁతుని శుభకార్యమునకు వలసిన ప్రయత్నములు జరిగిన వనియు, ఆలస్య మైనచోఁ దనకెంతో ధననష్ట మగు ననియు మొఱవెట్టెను. వధూవరుల కింత లేఁబ్రాయమున శుభకార్యము తలపెట్టగూడ దని నేను జెప్పివేసి, ఆయనపుర్ణాగ్రహమున కాహుతియైతిని ! మా మూఁడవ పెత్తండ్రి పద్మరాజుగారిని జూచుటకై మే మంత రాత్రికి పెనుగొండ వెడలిపోయి మఱునాఁడు రేలంగి వచ్చితిమి. ఆదినములలో రేలంగిగ్రామస్థులు కొందఱు రెండుకక్షలక్రింద నేర్పడి, ఒకరితో నొకరు ఘోరయుద్ధము జరుపుచుండిరి. ఈద్వంద్వయుద్ధ సందర్భమున, నిరపరాధులగు మాబోటివారును చిక్కులలోనికి రావచ్చునని నేను భీతిల్లితిని. భూములయమ్మకమునకై మాతండ్రి యంతట చుట్టుప్రక్కల గ్రామములు తిరిగెను. అపుడు మేము రేలంగి మండపాక కేతలి వడ్డూరు గ్రామములలోఁగల మాభూము లమ్మివేసితిమి. మా పెద తండ్రికుమారుఁడు మా యుభయ కుటుంబములకు నిపుడు జరుగు వ్యాజ్యెములకు వివాదములకును ముఖ్యకారణ మని వింటిమి. అతఁడు తన తప్పునొప్పుకొనినను, నేను జెప్పిన సామమార్గమునకు సులభముగ నొడంబడలేదు. ఎటులో మే మంత సమాధానపడితిమి.

ఇంకముందునుండి కుటుంబవ్యయములకుఁ గొంత సొమ్ము నెలనెలయును సరిగా రాజమంద్రి పంపుచు, కొంత సొంత కర్చులకు వ్యయపఱచుకొని, మిగిలినదానితో నప్పులు తీర్చివేసెద నని నేను నిర్ధారణచేసికొంటిని. మేము రాజమంద్రి వచ్చునప్పటికి, మాతల్లియుఁ దమ్ముడును జబ్బుగ నుండిరి. గర్భసంబంధమగు వ్యాధికి లోనయిన నాభార్య, ఇంటఁ దాను బడుకష్టములనుగుఱించి మొఱపెట్టెను. స్కాటు మెట్కాపు దొరలను సందర్శించి, పాపయ్య మృత్యుంజయరావుగార్లు మున్నగు స్నేహితుల వీడుకొలంది, నేను పత్నీ సమేతముగ జూను 19 వ తేదీని బెజవాడ బయలుదేఱితిని. తల్లిని గూర్చియు తమ్ములనుగూర్చియు నా కెంతో విచారము గలిగెను. వారలకుమాత్రము నాచిక్కు లెఱుకపడవుగదా ! మే మంత స్టీమరు ఈపేజి వ్రాయబడియున్నది ఈపేజి వ్రాయబడియున్నది. మీఁద గోదావరి దాటి, కొవ్వూరునొద్ద రెయిలెక్కి, బెజవాడ చేరితిమి. అనంతముగారిని, స్టేషనునొద్ద మేము చూచితిమి.

జూను 20 వ తేదీని పుస్తకములు సరదికొని, మిత్రులను సందర్శించి వచ్చితిని. విద్యార్థు లనేకులు నన్నుఁ జూడవచ్చిరి. బెజవాడ మకాముచేసియుండు మన్నవ బుచ్చయ్యపంతులుగా రిపుడు నాకుఁ గానఁబడిరి. నే నిచటనె యింక రెండు సంవత్సరము లుందు నని క్లార్కుదొరకు వ్రాయనా యని అనంతముగారితో నేననఁగా, అది తమకు సమ్మతమె యైనను, దొరకు వ్రాయుట సమంజసము గాదనియు, సమయము చూచి తామె యీసంగతి వారికిఁ దెలియఁజేతు మనియు వారు చెప్పిరి.

ఈ జులై నెలనుండియు, "జనానాపత్రిక" నాయొక్కని యాధిపత్యముననె ప్రచురింపఁబడుచుండెను. గతసంవత్సరమున నాకోరిక చొప్పున వెంకటరత్నముగారు తోడిపత్రికాధిపతులుగ నుండి సాయము చేసిరి. తమ కిఁకఁ దీఱదని వారు చెప్పివయఁగా, పత్రికా నిర్వహణభారము నేను వహింపవలసివచ్చెను. అంతటినుండి "జనానాపత్రిక"ను గూర్చిన పనులన్నియు నామీఁదనె పడెను. పాఠశాలలో విద్యాబోధనమును, ఇంటఁ బరీక్షాగ్రంథపఠనము, పత్రికానిర్వహణమును జేయవలసివచ్చి, తీఱిక లేక నేను తల్లడిల్లితిని. పనులు బాగుగ నెరవేర్పకుండెననియు, పాఠములు సక్రమముగఁ జదువుచుండలే దనియును నేను భార్యను సదా తప్పుపట్టుచు, నావాక్కున నిట్లు మార్దవము లేకుండఁజేసిన విధిని దూరుచు, లోనఁ బరితపించుచు, దినములు గడుపుచుండువాఁడను !

13. సహవాసులు

ఆ సంవత్సరము జూన్ 29 వ తేదీని మద్రాసునుండి రాజమంద్రి వచ్చెడి వీరేశలింగముగారిని వారిభార్యను గలసికొనుటకై, రామమూర్తిగారు నేనును రెయిలుస్టేషనుకుఁ బోయితిమి. మేము నలువురము నంత బుచ్చయ్యపంతులుగారి వసతిగృహమున కేగి యచట విందారగించితిమి. రాజ్యలక్ష్మమ్మగారి నొకదినము బెజవాడలో నిలుపఁగోరిన గురువమ్మగారు, వీరేశలింగముగారి ప్రతికూల వికటవచనములకు నిరుత్సాహులై యూరకుండిరి !

ఆరోజులలో రామమూర్తి నాకు గుండెకాయయే ! అనవరతమును చదువుసాములు సరససల్లాపములు నా కాతనితోడనే ! పలు విషయములం దిరువురము నేకాభిప్రాయలము. జులై 5 వ తేదీని పాఠశాలలో "విద్యార్థిసాహితీసమాజ" సభలో మే మిరువురమును ప్రసంగించితిమి. నా వాక్యము లేమియు సారస్యముగ లేవని నేను మొఱవెట్టఁగా, అట్లు కాదనియు, నా పలుకులింపుగను సొంపుగను నుండెననియు పలికి, మిత్రుఁడు నాకుత్సాహము గలిగించెను. మే మిరువురము తఱచుగ నుపన్యాసము లొసంగ నుద్యమించితిమి.

జూలై 25 వ తేదీని రామమూర్తిగారి పుత్రునికి జబ్బుచేసి, కొన్ని గంటలలోనే వానికి మృత్యువు సంభవించెను. మా కెంతో మనస్తాపము కలిగెను. ఈపిల్లవాని యన్నప్రాశనశుభకార్యము కొలఁది కాలముక్రిందటనే యతివైభవముగ జరిగెను ! మనుష్యజీవిత మింత యస్థిరమగుటకు మే మాశ్చర్య మందితిమి.

ఆగష్టునెలనుండి "జనానాపత్రిక"లో ప్రకటించుటకై "గృహనిర్వాహకత్వ"మను పుస్తకమును వ్రాయఁదొడంగితిని. కీలీదొరసాని