ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/తమ్మునివ్యాధి

వికీసోర్స్ నుండి

బట్ట లుదక లేదని కోపించి, వానిని మోదుచుండెను ! నే నడ్డుపడి, వానికి బుద్ధిచెప్పెద నని పలికి, చాకలిని విడిపించితిని.

నే నిపుడు పర్లాకిమిడి యుద్యోగమునకై గట్టిప్రయత్నము చేసితిని, అనంతముగారు తాము దయతో సిఫారసు చేయుటయేకాక, మద్రాసు నందలి తమతోడియల్లునికి నన్ను గుఱించి వ్రాసి, నాకుఁ దోడు పడుఁ డని వారిని గోరిరి. క్లార్కు పాలుదొరలను, నాగోజీరావు పంతులుగారిని, నా కీ యుద్యోగవిషయమై సాయము చేయుఁడని నేను వేఁడితిని.

48. తమ్మునివ్యాధి

నే నీమాఱు బెజవాడ యొంటరిగ వచ్చుటచేత, గోపాలమను విద్యార్థి యువకుఁడు నా కీదినములలో వంట చేసిపెట్టు చుండువాఁడు. ఆతనిది నెల్లూరువంట. వంటకము లన్నియు జిహ్వకు మందులవలెఁ దగులుచుండెను ! ఎటులో చేదు మ్రింగునట్లు నే నన్నము దినుచు, దినములు పుచ్చుచుంటిని.

విద్యార్థులు, తమ "ప్రసంగసమాజ" వార్షి కోత్సవ సమయమున నన్నొక యుపన్యాస మీయు మని కోరిరి. "బోధకుల విధులు" అను నొక యాంగ్లవ్యాసము వ్రాసి, 3 వ అక్టోబరున సమాజసభలోఁ జదివితిని. విద్యార్థులు నుపాధ్యాయులు నది మెచ్చుకొనిరి. "సంఘసంస్కారిణీ" పత్రికలో నది ప్రకటిత మయ్యెను.

రెండవ నవంబరున రాజమంద్రినుండి వచ్చిన యుత్తరములో, తమ్ముఁడు సూర్యనారాయణకు ఎక్కువగ జ్వరము వచ్చె ననియు, నన్ను తక్షణమే రమ్మనియు నుండెను. ఆ సాయంకాలమునకు రాజ మంద్రి చేరితిని. సూర్యనారాయణకు జ్వరము కొంత తగ్గె నని చెప్పిరి గాని, యింకను తీవ్రముగనే యుండెను. నారాక వలన వాని కెంతో ధైర్యము కలిగెను. తనకు గుంటూరుచెప్పులజోడు తెచ్చి పెట్టుమని వాఁడు ప్రాధేయపడెను. ఒక క్రొత్తపంచెయు గొడుగును నే నీయఁగా, వాఁ డెంతో సంతోషించెను. "అయ్యో నాదారిద్ర్య మెంత దు:ఖభాజనము ! తండ్రికి జీవితకాలమున సౌకర్యము లొనఁ గూర్పనైతిని. ఇపుడు నా తోఁ బుట్టినవానికోరికలు చెల్లింప నేరకున్నాను !" అని నేను లోలోన వగచితిని. త్వరలో నేను మరల వచ్చెద నని తమ్ముని సమాధానపఱిచి, 4 వ నవంబరున నేను బెజవాడ వెడలిపోయితిని. తమ ప్రియశిష్యుఁడు సూర్యనారాయణ జబ్బు పడె నని విని, నా యుపాధ్యాయమిత్రు లందఱు బెజవాడలో ఖిన్నులైరి.

బెజవాడలో 18, 19 నవంబరున చట్టనిర్మాణసభల కెన్నికలు జరిగెను. పురపాలకసంఘముల తరపున కృత్తివెంటి పేర్రాజు పంతులుగారును, స్థానిక సంఘములపక్షమున జంబులింగమొదలియారు గారును నియమింపఁబడిరి. నాతోడి బోధకుఁడు కల్యాణరామయ్యరుగారు మెయిలుపత్రికకును, నేను స్టాండర్డుపత్రికకును ప్రతినిథుల మై సభలలోనికి వెళ్లి, సమాచారములు వ్రాసి పత్రికల కంపితిమి.

నేను జేసిన కృషిఫలితముగ, పర్లాకిమిడి కళాశాలాధికారి యగు టెయిలరు దొరనుండి నాకొక జాబు వచ్చెను. తమ విద్యాశాలలోని క్రిందియుపాధ్యాయులకు క్రమముగ పైయుద్యోగము లిచ్చెద మనియు, అందువలన నాకు డెబ్బదిరూపాయల పనిమాత్ర మీయఁగలమనియు వారు వ్రాసిరి. ఇచటనే 85 రూపాయిలు జీతము గలనాకు 70 రూపాయిలపని యిచ్చెద మనుట నిరుత్సాహకర మయ్యును, నాసంగతి యాకళాశాలాధికారి తలపెట్టినందుకే నేను సంతోషించితిని ! కొలఁదినెలలలో నా కిచటనే 90 రూపాయిల జీత మిచ్చెదరు గాన, నాకుఁ దగినవేతన మొసఁగినచో, పర్లాకిమిడి వచ్చెదనని నేను మఱునాఁడే యాయుద్యోగీయునికి ప్రత్యుత్తరము వ్రాసితిని.

నే నిదివఱకే భీష్మునిగుఱించి యాంగ్లవ్యాస మొకటి వ్రాసి ప్రచురించితిని. ఇపుడు కార్లయిలుని "శూరుల" వంటిపుస్తకము నాంగ్లమున రచియింపఁబూని, "ప్రహ్లాదుఁడు - దేవుని ప్రియభక్తుఁడు", "అర్జునుఁడు - సాధకుఁడు" అను శీర్షికలతో నేను గొన్ని వ్యాసములను వ్రాయనెంచితిని.

23 వ నవంబరు దినచర్యలో నిట్లు గలదు : - "గతరాత్రి భార్యయు నేనును పర్లాకిమిడి యుద్యోగము నాకుఁ గావచ్చునని యెంచి, భావవిషయములను గుఱించి తలపోసితిమి. 'ఎపిక్టిటసు'చదివి, యందలి రమ్యములగు కథపట్టు లామెకు బోధపఱిచితిని. * * నేఁడు మరల గృహకల్లోలము ! అనుతాపలేశ మెఱుంగని గర్విణియగు సతితో సంసార మెట్లు పొసంగును ?"

8 వ డుసెంబరున బంగాళావాస్తవ్యులు విపినచంద్రపాలు గారు మద్రాసునుండి వచ్చి నా కతిథులయిరి. వారికిఁ గావలసిన సౌకర్యములు నే నొనఁగూర్ప లేకుంటిని. "కాఫీ" మేము చేయలేక పోయితిమి. కాఫీ చేయ నేరని కుటుంబపు జీవితము వ్యర్థమని వారు చెప్పివేసిరి ! ఆసాయంకాలము వా రొక యుపన్యాస మిచ్చి, మఱునాఁడు వెడలిపోయిరి.

19 వ డిసెంబరునాఁటికి పాఠశాలపనియు, ప్రాథమికపరీక్ష పనియుఁ బూర్తియయ్యెను. తమ్ముఁడు సూర్యనారాయణ జ్వరము తిరుగఁబెట్టెనని యా రోజుననే నాకు జాబు వచ్చినను, వెంటనే బయలుదేఱలేకపోయితిని. బెజవాడలో వ్రాఁతపని పూర్తిపఱుచుకొని, 21 వ తేదీని ఏలూరు వెళ్లితిని. పర్లాకిమిడినుండి మద్రాసు తిరిగిపోవుచుండు పాలుపీటరుపిళ్ల గారిని నేను రెయిలుస్టేషనులోఁ గలసికొంటిని. పర్లాకిమిడి పనికి ఇద్దఱు యం. యే. లును, పెక్కు మంది యితరులును దరఖాస్తు పెట్టిరనియును, నా కది లభింపవచ్చు ననియును వారు చెప్పిరి. మా పెదతండ్రి కుమారుఁడు పట్టాభిరామయ్య చనిపోయెనను దు:ఖవార్త 22 వ తేదీ సాయంకాలమున నేలూరులో నాకుఁ దెలిసెను. మఱునాఁడు ప్రొద్దుననే యుభయులమును రాజమంద్రి బయలుదేఱితిమి.

49. సూర్యనారాయణుని నిర్యాణము

1901 డిసెంబరు 23 వ తేది సాయంకాలమునకు రాజమంద్రిలో దిగి మే మింటికిఁ బోవునప్పటికి, సూర్యనారాయణకు మిక్కిలి జబ్బుగా నుండెను. గత రాత్రియే వానికి సంధిగుణము ప్రవేశించె నని చెప్పి వెంకటరామయ్య విలపించెను. రోగి నన్నుఁ జూచి మిగుల సంతోషపడెను. నే నేమి క్రొత్తవస్తువులు తెచ్చితినో చూపుమని వాఁడు నన్నడిగెను. 'నాకు బందరుచెప్పులు తెచ్చి పెట్టితివా?" యని వాఁ డడుగునపుడు, లే దని చెప్పుటకు నేను మిగుల నొచ్చుకొంటిని. వైద్యుఁడు కోటయ్యనాయఁడుగారిని దీసికొనివచ్చి చూపించితిమి. రెండు శ్వాసకోశములును బంధించె ననియు, సన్ని పోతము ప్రబలె ననియును, ఆయన చెప్పివేసిరి. మేము క్రమముగ మందు లిచ్చుచు రాత్రి జాగరము చేసితిమి. మఱునాఁటికి వానివ్యాధి ముదిరెను. శ్లేష్మప్రకోపమువలన రోగి యొత్తిగిలలేకుండెను ! ఊపిరి పీల్చుట కష్టమయ్యెను. అంత దేశీయవైద్యు నొక