ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/చెన్నపురి యుద్యోగము

వికీసోర్స్ నుండి

20. చెన్నపురి యుద్యోగము

నేను సైదాపేట బోధనాభ్యసనకళాశాల విడువఁగనే, నూతనముగ వెలసిన రాజమంద్రిబోధనాభ్యసనకళాశాలలో నా కుద్యోగ మిప్పింపవలెనని మాగురువర్యులును, ఏతత్కళాశాలాధ్యక్షులును నగు మెట్కాపుదొరగారు సిద్ధపడిరి. కాని, నేను యల్. టి. పరీక్ష రెండవ భాగములోఁ దప్పిపోవుటచేత, ఆపని నాకుఁ గాక, నామిత్రుఁడు మృత్యుంజయరావున కీయఁబడెను. పిమ్మట నేను తమ దర్శనము చేయునపుడెల్ల, నేను యల్. టి. పరీక్ష పూర్తిపఱిచితినా యని దొరగారు నన్నడుగుచేనేవచ్చిరి. కాని, అది యేమిచిత్రమో కాని, 1897 వ సంవత్సరమువఱకును నే నాపరీక్ష నీయలేకపోయితిని. అందు చేత, మెట్కాపుదొరకు నాయం దెంత ప్రేమాభిమానము లుండినను, రాజమంద్రికళాశాలలో నాకుఁ బ్రవేశము కలుగలేదు ! 97 వ సంవత్సరారంభమునం దా దొరగారు తమ యుద్యోగమును జాలించుకొని ఇంగ్లండు వెడలిపోయిరి. నేనా మార్చినెలలోనే యల్. టి. లోఁ గృతార్థుఁడనైతిని !

అంత రాజమంద్రికళాశాలకు మిడిల్ మాస్టుదొర అధ్యక్షుఁడుగ నియమింపఁబడెను. వారి కళాశాలలోఁ దర్కశాస్త్రము బోధించుట కొక యుపాధ్యాయుఁడు కావలసినట్టు నాకుఁ దెలిసి, మద్రాసునుండి రాజమంద్రి ప్రయాణముఁ జేయుచు, బెజవాడరెయిలు స్టేషనులో దిగి యుండిన యాదొరగారిని జులై 5 వ తేదీని నేను సందర్శించి, నాసంగతి చెప్పుకొంటిని. నన్నాయన స్వయముగ నెఱుఁగడు కావున, నేను దరఖాస్తు చేసికొనినచో, తా నాలోచింతునని యాయన చెప్పెను. నేను దరఖాస్తుపెట్టి 9 వ జూలై తేదీని రాజమంద్రి బయలుదేఱి పోయితిని. అచట నాతలిదండ్రులు సోదరులును సేమముగనే యుండిరి. నా దరఖాస్తు చెన్నపురి కనుపఁబడెనని నాకుఁ దెలిసెను. తన కళాశాలకు, అనుభవశాలియును సంస్కృతజ్ఞానము గలవాఁడును నగు బోధకుఁడు గావలెనని దొర కోరెనఁట. అందువలన నాకు లాభము గలుఁగ దని నేను గ్రహించితిని. ఈవిషయమై నాపూర్వ గురువులగు స్కాటుదొరగారికి మద్రాసు తంతి నంపి, నన్నుగుఱించి డైరక్టరుగారికి సిఫారసు చేయుఁ డని నేను గోరితిని.

మే మిదివఱకు బెజవాడలో బసచేసియుండిన గోవిందరాజుల వారి యిల్లు జూలై 27 వ తేదీని మేము వదలి పోవలసివచ్చెను. వారి పెరటిలో మేము పెట్టిన చెట్లపాదులకు తుమ్మమండలు కొన్ని తెప్పించి నేను పాతించినందుకై, ఇంటియజమానుఁడగు సుబ్బారాయఁడుగారికి నామీఁద గోపము వచ్చెను.

ఆపేటలోనే కొంచెము దూరమున వేఱుగా నుండు నొక బంగాళాను నెల కెనిమిది రూపాయిల యద్దెమీఁద పుచ్చుకొని మే మచటికిఁ బోయితిమి. ఈక్రొత్తయింటి చుట్టును విశాలమగు పెరడు గలదు. కాని, చుట్టుపట్టుల దగ్గఱగ నిం డ్లేమియు లేకపోవుటవలన, నొంటరిగ మే మచట నుండుటకు మొదట కష్టముగ నుండెను. మాపాఠశాలలో చిత్రలేఖనా బోధకుఁడును నా స్నేహితుఁడునగు రామస్వామి శాస్త్రులుగారు వారి తల్లియును వచ్చి, జులై నెలాఖరున మా యింట నొక భాగమున దిగుటచేత, మాకు ధైర్యముగ నుండెను.

ఒకరాత్రి సంభాషణసందర్భమున, "చెన్నపురి ఆర్యపాఠశాల"లో ప్రథమోపాధ్యాయపదవి ఖాళీ యయ్యె ననియు, వారి కాంధ్రోపాధ్యాయుఁడు గావలెననియును శాస్త్రిగారు చెప్పిరి. ఆమఱునాఁటినుండియు నే నాపని నిమిత్తమై కృషి చేసితిని. ఆపాఠశాలాధికారి, "హిందూపత్రికా" ముఖ్యవిలేఖకులగు జి. సుబ్రహ్మణ్యయ్యరుగారు. వీరే కొన్ని సంవత్సరములక్రిందట నాకును మిత్రుఁడు మృత్యుంజయరావునకును తమపాఠశాలలో పేరునకు బోధకోద్యోగము లిచ్చినవారు. వీరికి నన్ను గూర్చి సిఫారసు చేయుఁడని రాజమంద్రి యందలి న్యాపతి సుబ్బారావుపంతులు, వీరేశలింగముపంతులుగార్లకును, మద్రాసునందలి బుచ్చయ్యపంతులుగారికిని నేను జాబులు వ్రాసితిని. వా రందఱును నన్ను గుఱించి అయ్యరుగారికి గట్టి సిఫారసులు చేసిరి.

అంత 11 వ ఆగష్టు తేదీని సుబ్రహ్మణ్యయ్యరుగారి యొద్దనుండి నాకొక లేఖ వచ్చెను. నాకు నెల కేఁబదిరూపాయిలు జీతమీయఁ గలమని వారు వ్రాసి, నే నెంత ర్వరలో తమపాఠశాలలోఁ జేరఁగలనో వ్రాయుఁడని యడిగిరి. ఆమఱునాఁడే నే నిట్లు అయ్యరుగారికి తంతి నంపితిని : - "వందనములతో నుద్యోగస్వీకారము చేయు చున్నాను. అఱువదిరూపాయి లియ్యఁగోరెదను. ఒక నెలలో చేరఁ గలను. నాపని తృప్తికరముగ నున్నచో, కొన్ని సంవత్సరములవఱకును మీపాఠశాలలో నుద్యోగము నాకు స్థిరమని చెప్పఁగోరెదను."

ఈ తంతి నంపి, మఱు నిమేషమునుండియె వారి జవాబున కెదురు చూచుచుంటిని ! కాని, మఱునాఁటి సాయంకాలము వఱకు నాకుఁ బ్రత్యుత్తరము రానేలేదు. అంత రాత్రి తొమ్మిది గంటలకు జవాను నాకొక తంతి తెచ్చియిచ్చెను. దానిలో నిటు లుండెను. "వందనములు. రాఁబోవుజనవరిలో నేఁబదియైదును, మఱుసటివత్సరము అఱువదియును ఇచ్చెదను. సెప్టెంబరు మొదటితేదీని మీరు చేరవలెను." ఈతంతి నందుకొని రాజమంద్రిలోనుండు తలి దండ్రుల యాలోచన నడుగుటకై నే నారాత్రియె రెయిలులో బయలుదేఱితిని. మాయింటి కదివఱకు వచ్చియుండిన నాపెద్దమేన మామయు, నాభార్యపెదమేనమామయును నాతో రాజమంద్రి కపుడె బయలుదేఱిరి.

నేను రాజమంద్రి చేరు నప్పటికి మాతల్లి వేలివెన్ను వెళ్లి యుండెను. ఇంట తండ్రియు, తమ్ములు నుండిరి. చిన్న చెల్లెలు జబ్బుగ నుండెను. రాజమంద్రిలో మావారల స్థితిగతులు దైన్యముగ నుండెను. నా చెన్నపురి ప్రయాణమునకు మా మామగారామోదించిరి. కాని, మాతండ్రి యేమియు ననకుండెను. ఆయనకు జ్యౌతిషమునం దభిమానమును, కొంత పరిచయమును గలవు. గోచారమును బట్టి నాకు త్వరలో "స్థానభ్రష్టత్వము, ధనక్షయమును" గలుగునని మాత్ర మాయన చెప్పెను ! ఈ యుద్యోగమునుతప్పక స్వీకరించి, యం. యే. పరీక్షకుఁ జదువు మని వీరేశలింగముగా రనిరి. నే నంతట బెజవాడ వెడలిపోయి, 17 వ సెప్టెంబరు చెన్నపురిలోని పనిలోఁ జేర గలనని అయ్యరుగారికి తంతి నంపితిని.

నే నిపుడు బెజవాడయుద్యోగముసంగతి యేమిచేయవలెనో తోఁపకుండెను ! నాపనికి రాజీనామా నీయవలె ననియె నేను మొదట నెంచితిని. కాని, యది మంచిది కాదనియు, కొంతకాలము సెలవు పుచ్చుకొని, క్రొత్తపనిలోఁ బ్రవేశించిచూచుట యుక్తమనియు, ప్రధానోపాధ్యాయులు దాసుగారు నాకు సలహానిచ్చిరి. సెప్టెంబరు 15 వ తేదీనాఁటికి మాపాఠశాలకు పరీక్షాధికారి తనిఖీ యగును గావున, అప్పటినుండి నా కిచ్చట సెలవు దొరకవచ్చు ననికూడ వారు చెప్పిరి. వారిసలహా చక్కఁగ నుండెను. నే నంతట పాఠశాలాధికారి టానరు దొరను జూడఁబోయితిని. నా కీళ్ల వాత మెటులుండె నని యాయన చేసిన కుశలప్రశ్నమె నాకు మంచిసందిచ్చెను ! ఏతద్రోగోపశమనమునకె నే నిపుడు మద్రాసు వెళ్లఁదలంచి, అచట పొట్టజరుగుట కొక చిన్న పనిలోఁ బ్రవేశింప నిశ్చయించితిని కాన నా కాఱునెలలు సెలవీయుఁ డనియు, నేను తిరిగి వచ్చు వఱకును మాతమ్ముఁడు నాస్థానమం దీపాఠశాలలో బోధకుఁడుగ నుండు ననియును నేను జెప్పితిని. మాతమ్ముని యుద్యోగముమాట యెటులుండినను, నాకు మాత్రము సెలవు దొరకు నని దొర చెప్పెను.

నారాక నిశ్చయమని అయ్యరుగారికి నే నంతట చెన్నపురి వ్రాసివేసితిని. తలిదండ్రుల కీ సంగతి తెలియఁబఱిచితిని. చెన్న పురిలో నాకు బాగుగ జరుగుచున్నచో, నే నచటనే నిలిచిపోవచ్చును గావున, నాసామాను నాతోఁ గొనిపోవ నిశ్చయించుకొని, అనవసర మగు పుస్తకములు వస్తువులును అమ్మివేసితిని. తలిదండ్రులను జూచుటకు మరల 11 వ సెప్టెంబరున నేను రాజమంద్రి వెళ్లితిని. మాతల్లి యపుడె దేహస్వాస్థ్యము నొందుచుండెను. రెండవ మఱఁదలికి జబ్బుగ నుండెను. మా తాటియాకుల యింటిలో తేమ యుఱియుచుండెను ! ఆకుటీరమున దరిద్రదేవత తాండవమాడు చుండెను ! నాకు వెఱ్ఱి దు:ఖము గలిగెను. జననీజనకుల దురవస్థ నే నెట్లు తొలఁగింపఁగలనా యని తలపోసితిని.

అంత వీరేశలింగముపంతులుగారు సాంబశివరావు మున్నగు స్నేహితులను జూచి, నేను బెజవాడ బయలు దేఱితిని. నాకు వీడ్కోలొసంగుటకు పెద్దతమ్ముఁడు రేపల్లెనుండి బెజవాడ వచ్చియుండెను. మాపాఠశాలతనిఖీ 14 వ సెప్టెంబరుతో ముగిసెను. సెప్టెంబరు "జనానాపత్రిక" యాదినముననే చందాదారుల కంపివైచి, పాఠశాలకుఁ బోయి, అచట నుపాధ్యాయులయొద్దను, విద్యార్థులయొద్దను వీడ్కో లొందితిని. నాలుగుసంవత్సరములు గలసి మెలసి యుండిన మిత్రుల నొకసారి వీడుట కష్టముగఁ దోఁచెను. తోడియుపాధ్యాయులగు అయ్యన్న గారు నన్నుఁ గౌఁగలించుకొని విలపించిరి ! నేను మాత్రము చిఱునవ్వు నవ్వి, త్వరలోనే మరలివచ్చెద నని వారి నూరడించితిని. అంత, సామానులు సరిదికొని, స్టేషనునకు వచ్చి, విద్యార్థులు బోధకులును వీడుకొలుపఁగా, మేము రెయిలులోఁ గూర్చుంటిమి.

21. ఆశాభంగము

మేము బెజవాడనుండి బయలుదేఱునాఁడే, చెన్నపురినుండి నాకొక 'యాకాశరామన్న' జాబు వచ్చెను. 'చెన్నపురి ఆర్యపాఠశాల'లో జీతములు సరిగా నీయ రనియు, మంచిపాఠశాల వదలి యిట్టి దిక్కులేని విద్యాలయమున కేగినచో సుఖమున నుండు ప్రాణమును దు:ఖములపాలు చేసికొందు ననియు నందుండెను ! ఐనను, మించినపనికి నే నిపు డేమి చేయఁగలను ?

ఆకాలమందు బెజవాడనుండి సరిగా, చెన్నపురికి రెయిలు పడ లేదు. మేము చిన్నబండి మీఁద గుంతకల్లుదారిని బోయితిమి. దారిలోని చెట్లు చేమలు, కొండలు కనుమలును జూచి, మా కనులు సేదదేఱెను. మఱునాఁటిరాత్రి గుంటకల్లులో బొంబాయిమెయి లెక్కితిమి. తిలకు మహాశయునికి 18 నెలలు కఠినశిక్ష వేసిరని రెయిలులో విని విచారించితిని. 17 వ సెప్టెంబరు ప్రొద్దున్నకుఁ జెన్నపురిచేరి, పరశువాక మేగి, మన్నవ బుచ్చయ్యపంతులుగారి యింట, బసచేసితిమి. పంతులుగారు నేనును గలసి తిరువళిక్కేణి