ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/క్రొత్త హరికథలు

వికీసోర్స్ నుండి

అని నా కభయహస్త మిచ్చినటు లాయన సెలవిచ్చిరి ! ఈశ్వరసేవకుల మని చెప్పుకొనువారివైఖరి యిట్టిది. ఈ పాఠశాలలో లెక్కలే నన్ని లోపములు కష్టములు నున్నవి ! దీని కీయన యజమాని. ఇట్లయ్యును, పాఠశాలలోఁగల చిన్నలోపములను గుఱించియైన నడుగుట కీమహనీయునికిఁ దోఁచదు, తీఱదు ! దైవమా యేమని చెప్పను !"

41. క్రొత్త హరికథలు

ఇదివఱకు నేను "హిందూసుందరీమణు" లను పేరుతో సీత సావిత్రి మున్నగు నేడుగురు సుదతుల కథలు వ్రాసితిని. ఇంకను ప్రాచీనకాలసుందరు లనేకులు కలరు. కొలఁదిదినములక్రిందట నేను రాజమంద్రిలో నుండునపుడు వెంకటరత్నముపంతులుగారు అరుంధతి మున్నగు స్త్రీలనుగుఱించి నాకుఁ జెప్పిరి. నామిత్రు కామశాస్త్రిగారిటీవల "కాదంబరీసారసంగ్రహము"ను రచియించి, అందలి మహాశ్వేతనుగుఱించి సూచించిరి. కావున నేను "జనానాపత్రిక" లో "హిందూసుందరీమణుల" రెండవభాగమును వ్రాయ నారంభించితిని.

ఆకాలమున బెజవాడలో కొంచెముసేపు రెయిళ్లు ఆఁగుచు వచ్చుటచేత, తమకుఁ గొంచెము అన్నము పంపు మని స్నేహితులు తఱచుగ నాకు వ్రాయుచు వచ్చిరి. 3 వ జూలయిని వీరేశలింగముగారు వచ్చుచుంటినని వ్రాసిరి. కాని, యానాఁడు బండి యాలస్యముగ వచ్చుటచేత నేను పాఠశాలకు వెళ్లి పోయితిని. స్నేహితులు వారిని గలసికొనిరి. మఱునాఁడు ప్రణతార్తిహర అయ్యరుగారు మద్రాసు నుండి రాజమంద్రి వైపునకుఁ బోవుచు, ఐదుగురికి అన్నము పంపుఁడని నాకు వ్రాయఁగా, ఒక బ్రాహ్మణవిద్యార్థిచే నన్నము పంపితిని. కాని యతఁ డాలస్యముగ వెళ్లుటచేత, వారు నిరాహారులై వెడలి పోయిరి ! 8 వ జూలయితేదీని వీరేశలింగముగారు వచ్చి మాయింట విడిసిరి. ఆరోజు ఆదివార మగుటచేత, పఠనాలయములో "ప్రవర్తనము" అను విషయమునుగుఱించి వారు ఉపన్యసించిరి.

12 వ జూలయిని కామశాస్త్రిగారు జబ్బుగా నుండుటచే వారినిఁ జూడఁబోయితిని. "మహిమ్న" స్తోత్రములోని శ్లోకము లాయన చదివి యర్థము చెప్పిరి. బ్రాహ్మమతమందలి యేకేశ్వర ప్రార్థనము నివి పోలియుండెను.

20 వ జూలయి తేదీని "విద్యార్థుల సాహితీసంఘ" సభకు నే నగ్రాసనాధిపతి నైతిని. నాటకవృత్తి గైకొనిన యువకుల దుర్నీతులనుగుఱించి ప్రస్తావవశమున నేను మాటాడితిని. ఈ ప్రాంతములు చూచిపోవుట కేతెంచిన ధన్వాడ అనంతముగా రా సభకు వచ్చి, నా యభిప్రాయములలో సత్యము గల దని నొక్కి చెప్పిరి. పిమ్మట నేను జాలసేపు వారితోఁ బ్రసంగించితిని. ఆరాత్రియే వారు మద్రాసు వెడలిపోయిరి.

1 వ జూలయి నేను బుట్టినరోజు. నాఁటి దినచర్యయం దిటు లుండెను : - "ఈరోజుతో నావయస్సు ముప్పదిసంవత్సరములు. ఇంతకాలము నా కాయురారోగ్యముల నొసంగినందుకు, దైవమా, నీకు వందనములు ! మనుజులు చెప్పు గొప్పసంగతులయొక్కయు చేయు ఘనకార్యములయుమాట యటుంచి, జీవించుటయే యొక విశేషముగదా ! మనుష్యుఁడు తృణప్రాయుఁడు గాఁడు. నే ననుభవమునఁ గాంచిన మహావిషయముల కెల్ల దేవునికిఁ గృతజ్ఞుఁడను. నామనస్సు కొన్ని సుసంకల్పములకును, పెక్కు చెడుతలంపులకును దావలము. నాకు జీవితము తెంపులేని సముద్రమువలెఁ గానవచ్చుచు న్నది ! దేవుఁడు న న్నాశీర్వదించి, నా కెక్కువ పవిత్రత యొసంగి, నేను సార్థకజీవితమును గడపునట్లనుగ్రహించునుగాక!"

ఈసంవత్సరము జూలయినుండియు "జనానాపత్రిక"ను వీరభద్రరావుగారి విద్యాసాగరముద్రాలయమునుండి తీసివైచి, మద్రాసు బ్రాహ్మ సమాజమువారి కార్యాలయమున నచ్చొత్తించుచువచ్చితిని. దీనికిఁ గారణము, రావుగారి ముద్రాలయము సరిగా పని చేయకపోవుటయే. ఆయన వ్యవహారపుఁజిక్కులలోఁ బడి, ముద్రాలయమును సరిగా నడుపనేరకుండెను.

జనానాపత్రికనుగూర్చిన పనులన్నియు సొంతముగ నేను జేయుచుండువాఁడను. నాభార్యయు, కొందఱు విద్యార్థులును పత్రికను చందాదారులకుఁ బంపు విషయమున సాయము చేయుచు వచ్చిరి. చాలినంతసొమ్ము పత్రికకు లేకుండుటచేత నిట్టిపనులు కొక పరిచారకును నియమింపలేకుంటిని.

ఆగష్టునెలలో మూఁడుదినములు సెలవగుటచేత, సకుటుంబముగ నేను ఏలూరు పోయితిని. కొన్నిరోజుల వఱకును నాభార్య మాత్రము తిరిగి రా లేదు. అందువలన బెజవాడలోని నేనే వంట చేసికొనుచుండు వాఁడను. ఇంట రెండవభాగమున నొంటరిగ నుండు వీరభద్రరావుగారికిని స్వహస్తపాకమే ! ఆనెల 23 వ తేదీని నేను మధ్యాహ్నమున బడికిఁ బోవుచు, దారిలో బందరు కాలువలోఁ బడిపోయిన స్త్రీ నొకతెను గట్టున కీడ్చుచుండు కొందఱిని జూచితిని. ఆత్మహత్య చేయవల దని వారించి యా మెను మాయింటికిఁ గొనివచ్చి భోజన మిడితిని. గృహకల్లోలములవలన తాను ప్రాణహత్యకుఁ గడంగితినని యాస్త్రీ చెప్పెను. ఆస్త్రీ చీర నీటఁ దడియుటచేత నాభార్యకోక యొకటి యామెకుఁ గట్టనిచ్చితిని. నీటిగండము తప్పిన యాదీనకు శరణ మొసంగినందుకు నన్ను మిత్రు లభినందించిరి. అంత నింటి తలుపు తాళము వేసికొని, మిత్రుఁడు ముద్రాలయమునకును, నేను బాఠశాలకును వెడలిపోయితిమి.

ఆ సాయంకాలమున నేలూరు రెయిలు దిగివచ్చిన నాభార్య చూచుసరికి, మాయింటివాక్లిట పరస్త్రీయొకతె మసలుచుండుటయు, ఆమె తనచీరయే సింగారించుకొని యుండుటయును, ఆ గృహిణికి వెఱ్ఱి యనుమానములు గలిపించెనఁట ! కొంతసేపటికి నేను రావుగారు నిలుసేరి, ఆస్త్రీ బంధువులకు వర్తమాన మంపితిమి. ఆ యువతి పుట్టినిల్లు రాజమంద్రి యనియు, ప్రవర్తనము మంచిది కాదనియు, భర్తతోఁ బోరాడి యానాఁడు పాఱిపోయివచ్చె ననియును వారు మాకుఁ జెప్పి, ఆమె నెట్లో భర్తృగృహముఁ జేర్చిరి.

7 వ సెప్టెంబరున ఆదిపూడి సోమనాధరావుగారు బెజవాడ వచ్చి మాయింట నొకవారము నిలిచియుండిరి. ఆపురమందు కొన్ని హరికథలును, ప్రసంగములును వారు గావించిరి. సోమనాధరావుగారి యుపన్యాసములు జనరంజకములుగ నుండెను. ప్రేక్షకులు వచ్చినను రాకున్నను నియమితసమయమునకె సరిగాఁ దమప్రసంగమును ప్రారంభించి, ఒకగంట మాటాడి యాయన కూర్చుందురు ! ఈ కట్టుఁబాటువలన సభ్యులు సమయమునకే వచ్చి యాసక్తితో వినుచుండువారు. ఆయన హరికథలు, క్రొత్తపద్ధతి ననుసరించి, సంస్కారమునకు సుముఖములుగనుండి, ప్రేక్షకుల కమిత ప్రమోదమును గొలుపుచుండెడివి.

ఆరోజులలో నాకు గుండెదగ్గఱ మండుచుండెడిది. మిత్రులు డాక్టరు వెంకటసుబ్బయ్యగారు నాహృదయము శ్వాసకోశములును బాగుగఁ బరీక్షించి, అం దేలోపము లేదనియు, కండర సంబంధమగు వాతమే బాధకుఁ గారణము కావచ్చు ననియును జెప్పిరి. నే నధికముగఁ బరిశ్రమము చేయుచు, నా వ్యాధిని గుఱించి పలుమాఱు తలపోయుచుండుటచేతనే నామంటలు హెచ్చుచుండవచ్చు నని కూడ వారి యభిప్రాయము !

42. "హిందూ సుందరీమణులు"(2)

1900 సం. సెప్టెంబరు మధ్యమున "హిందూ సుందరీమణుల చరిత్రముల" రెండవ భాగమును బూర్తిచేసితిని. దీనికిని మొదటిభాగమునకును గొంత భేదము లేకపోలేదు. కావున దీని పీఠికలో నే నిట్లు వ్రాసితిని : - "ఇందలి కథలలోఁ గొన్నింటిని గుఱించి యొకటిరెండు సంగతులు చెప్పవలసియున్నది. సత్యభామచరిత్ర నీ గ్రంథమున నేల చేర్చితి వని కొందఱు స్నేహితులు నన్నడిగిరి. సత్యభామ గయ్యాళి యనియు, ఆమెచరిత్ర మంతగా నీతిదాయకము గాదనియు వారల తలంపు. ఇది సరియైన యూహ కాదు. సీత, ద్రౌపది మొదలగు వనితల సుగుణములు శ్లాఘాపాత్రములే యైనను, వీరి చరిత్రములొకరీతినె ప్రాఁతవడిన గుణవర్ణనములతో నిండియుండి, నవీనుల కంతగా రుచింపకున్నవి. పతిభక్తియే వీరికిఁ గల గొప్పసుగుణము. ధైర్యసాహసాదు లంతగ వీరియందుఁ గానిపింపకున్నవి. ఇట్టిస్త్రీల చరిత్రములు చదివిచదివి, సత్యభామకథ చేతఁబట్టినవారి కింపగు భేదము గానఁబడును. నిర్మలప్రవర్తనమునం దితర ముదితలకు సత్య యావంతయుఁదీసిపోక, వారియందుఁ గానరాని ధైర్యాది నూతనసుగుణములు దాల్చి, హిందూవనితల యభ్యున్న తిని గాంక్షించెడివారల కానంద మొసంగుచున్నది ! మనదేశమందు