ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/కీళ్ల వాతము

వికీసోర్స్ నుండి

చేస్తాను. అత్తిలి వెంకటరత్నంగారిపేర వుత్తరం 15 రోజులకిందట వ్రాశినాను. జవాబు లేదు. నేను వెళ్లి అత్తిలి వగైరాలు కనుక్కుని వారం రోజులలో తిర్గి రాజమంద్రికి చేరి వుత్తరం వ్రాస్తున్నాను."

ఆ సంవత్సరము డిశెంబరులో జరిగెడి ప్రవేశ పరీక్షకు తమ్ముఁడు కృష్ణమూర్తి పోయియుండెను. శీతకాలపు సెలవులలో మే మిరువురమును రాజమంద్రి వెడలిపోయితిమి. అక్కడనుండి నాభార్య తన పుట్టినింటికి కట్టుంగ పోయెను. రక్తగ్రహణిచే నే నాదినములలో నధికముగ బాధపడితిని. అత్తిలి భూముల యమ్మకమునకై నన్ను రేలంగి రమ్మని చెప్పి ముందుగ మాతండ్రి రాజమంద్రినుండి బయలుదేఱెను. కొంచెము నీరసముగ నుండినను నేను రేలంగి ప్రయాణమైతిని. ఎంతో ప్రయాసపడి నే నచటికి డిశంబరు తుది దినములలోఁ జేరితిని. కాని అప్పటి కింకను వ్యవహారము తెమలకపోవుటచేత, భార్యను రాజమంద్రి కొనిపోవుటకై యచటినుండి నేను కట్టుంగ పయనమైతిని.

15. కీళ్ల వాతము

నేను రేలంగినుండి డిసెంబరు 31 వ తేదీని ప్రొద్దుననే బయలు దేఱి, కాలినడకను మధ్యాహ్నమునకు కట్టుంగ జేరితిని. నాఁడు కటిస్థలమున నొప్పిగ నుండినను, నే నది లెక్కసేయ లేదు. ఆగ్రామములో మాయత్తమామలు, వారి కుమారుడు, కొమార్తెలు నుండిరి. మాబావమఱఁదితో ముందలి సంగతు లాలోచించుచు, జనవరి 1, 2. తేదీలలో నేనచటనే యుంటిని. ఈసంవత్సర మైనను నేను యల్. టి. పరీక్షలో గెలుపొందనిచో, నా కిష్టములేని న్యాయవాదివృత్తిలోఁ బ్రవేశించుటకై, న్యాయశాస్త్ర పరీక్షకుఁ జదువ నాయుద్దేశమని చెప్పి వేసితిని. ఇది యాతఁ డామోదించెను. భార్యతోను, బావమఱదిఁతోను పడవమీఁద బయలుదేఱి, నేను 3 వ తేదీకి రాజమంద్రి వచ్చితిని. మాతండ్రి యదివఱకే వచ్చి యుండెను. స్నానము చేయునపుడు నా కుడి మోకాలిమీఁద కొంచెము వాఁపు కనుపించెను. అక్కడ కొంత నొప్పిగ కూడ నుండెను. ఇది లెక్కసేయకయే నా పనుల మీఁద నేను పట్టణమునఁ దిరుగాడితిని. మఱునాఁటి సాయంకాలమునకు నా కించుక జ్వరము సోఁకెను. నా మోకాలికీలు పొంగి, అడుగు తీసి యడుగు వేయ లేనిస్థితికి వచ్చితిని ! రాత్రి యెంతో బాధపడితిని.

మఱునాఁడు రంగనాయకులునాయఁడు గారు వచ్చి, యిది కీళ్ల వాతము కాదని చెప్పి, వాఁపుమీఁద రాయుటకు కర్పూరతైల మంపిరి. దానివలన లాభము లేకపోయెను. అత్తిలిలోని భూములదస్తావేజు వ్రాసి ఆవ్యవహారము పూర్తిపఱుచుటకు మా నాయనయు, పెద్ద తమ్ముఁడును, ఆ సాయంకాలమే పడవమీఁద వెడలిపోయిరి. నాకు శరీరములో నెటులుండినను, ఒకటిరెండురోజులలో నేను అత్తిలి తప్పక వచ్చి, అచట పనియైన పిమ్మట నే నింటికి తిరిగి రావచ్చునని వారు చెప్పిరి. అట్లే చేయుదు నంటిని.

మూలుగుచునే నే నానాఁడు "జనానాపత్రిక"కు వ్యాసములు వ్రాసితిని. రాత్రి యంతయును, మోకాలిపోటు చెప్పనలవి కాకుండెను. మఱునాఁడు నాయఁడుగా రిచ్చినమందు మ్రింగితిని కాని, నా కేమియు నుపశమనము గలుగ లేదు. ఆ రోజుకూడ పత్రికకు వ్రాయుచునేయుంటిని.

7 వ తేదీకి నావ్యాధి ముదిరిపోయెను. తమ్ముఁడు కృష్ణయ్యచే పత్రికకు వ్యాసములు వ్రాయించి, ఆ కాకితములు అచ్చునకై బెజవాడ కంపివేసితిని. నే నిపుడు నడచుట యటుంచి, సరిగా నిలుచుం డుటకైన శక్తిలేక యుంటిని ! ఈ దురవస్థలో నేను అత్తిలి రాఁజాల నని మాతండ్రికిని తమ్మునికిని దెలిపి, త్వరగా వారిని రాజమంద్రి తోడితెమ్మని తమ్ముఁడు కృష్ణయ్య నచటికిఁ బంపితిని. ఇంట నాకు మందుమాకులు తెచ్చి యిచ్చుటకుఁ బసివాఁడగు సూర్యనారయణ యొక్కడే కలఁడు. ఐన నాతనివి యినుపకాళ్లు ! పగలనక రాత్రి యనక యాతఁడు నామందులకొఱకై తిరుగాడఁ జొచ్చెను. రాత్రులు కాలిపోటు లెక్కువయై నేను తీవ్రవేదన నొందునపుడు, హాస్యపుఁబలుకులు పలుకుచు, మా చిన్న తమ్ముఁడు నాచెంతఁ గూర్చుండువాఁడు. లోకువయగు వానిని నే నపుడు తిట్టుచుఁ గొట్టుచును, రోగముమీఁది కసి చిన్న వానిమీఁద దీర్చుకొనుచుండువాఁడను ! తీవ్రవేదనకు నేను దాళలేనపుడు, అతఁడు నాకు 'పెర్రిడేవిసు'ని "పెయిన్ కిల్లరు" తెచ్చి పూయుచుండుటవలన, 'పెర్రిడేవిసు' అను నామమిడి, తమ్ముని నిరసనతోఁ బిలుచుచుండువాఁడను ! వేదనాభరమున నే నాడెడి దూషణోక్తులకు వాఁ డించుకయుఁ గినియక, నాపిచ్చిపలుకులను గాకితముమీఁద నెక్కించి చదివి నాకు నవ్వు తెప్పించుచు, అందు మూలమున నా కొకింత బాధాశమనము గల్పించుచుండువాఁడు !

తీవ్రవేదనకు లోనగు నాకుఁ బగలు రాత్రియు నొకటియే యయ్యెను ! ఎన్నిదినములకును తండ్రియుఁ దమ్ములును అత్తిలినుండి రాకుండిరి. ఎట్టకేలకు 11 వ జనవరి సాయంకాలమునకు సోదరులు వచ్చిరి. కొలఁదిదినములలో తాను న్యాయవాదిపరీక్షకుఁ బోవలసి యుండియు, నారోగోపశమనమునకై తమ్ముఁడు వెంకటరామయ్య యెంతో ప్రయత్నించెను. అంత వైద్యము మార్చివేసితిమి. డిస్ట్రిక్టు సర్జను డాక్టరు సార్కీసు దొర యొద్ద మాతమ్ముఁడు నాకు మందు తెచ్చి యిచ్చెను. అదియు నా కేమియుఁ బ్రయోజనకారి కాకుండెను. ఆరోజులలో ముఖ్యముగ రాత్రులందు నరకలోకమున నుండునట్లు నాకుఁ దోఁచుచుండెను. ఆబాధలో భగవంతుని ప్రసక్తియె నా మనస్సునకు గోచరించెడిదికాదు ! మీఁదుమిక్కిలి నే నాయనకు మఱపు వచ్చితి ననియె భావించుచుండు వాఁడను ! వివేకము తెచ్చుకొని కొంచె మాలోచించునపుడుమాత్రము, విసు వెఱుంగక అహర్నిశము నాకొఱకుఁ బరిశ్రమించు మాతాసతులమూర్తులందె దేవుని యవ్యాజ ప్రేమ కళ యొకింత నాకుఁ బొడగట్టుచుండెడిది !

మాతమ్ముఁ డంత నన్నుఁ బరీక్షించుటకై 24 వ జనవరిని డాక్టరు సార్కీసును మాయింటికిఁ గొనివచ్చెను. ఆయన నన్నేమియు నడుగక గోప్యాంగపరీక్ష చేసి, రుగ్ణత సుఖవ్యాధులచే సంక్రమింప లేదని నిర్థారణచేసికొని, మంచిమం దిచ్చెద నని నన్నోదార్చెను. నావేదనాప్రకోపమును, మాపర్ణకుటీరనివాస రహస్యమును గనిపెట్టిన యా సహృదయుఁడు మే మీయబూనిన పారితోషికమును గైకొనకయే వెడలిపోయెను. కొలఁదిదినములలో బెజవాడపాఠశాల తీసెదరు కావున, అచట నాకు బదులుగ బోధకుఁడుగ నుండి పనిచేయుటకై మాబావమఱఁది వెంకటరత్నమునకుఁ గబురంపితిని. అతఁడు 15 వ తేదీని వచ్చి పరీక్షాపత్రములు దిద్దుటయందు నాకుఁ దోడ్పడి, 17 వ తేదీని బెజవాడ వెడలిపోయెను. ఆనాఁడే వడ్లుపట్టుకొని మాతండ్రి రాజమంద్రికి వచ్చెను.

ఆమఱునాఁడు రాజమంద్రిలో మాయింటికిఁ జేరువనుండు డెబ్బది యెనుబది పూరిండ్లు తగులఁబడిపోయెను. మాకుటీరముకూడ పరశురామప్రీతి యగునని భీతిల్లితిమి. వేదనతో నుండియు ప్రాణము లందలి తీపిచే నేను గేకలు వేయఁగ, తమ్ముఁడు కృష్ణయ్యము నాభార్యయు నన్నొక బండిలోఁ గూర్చుండఁ బెట్టి, ఎద్దులేని యా బండిని తామె లాగి, మా తోడియల్లుని బసకు నన్నుఁ జేర్చిరి !

24 వ తేదీవఱకును నావ్యాధి మరలక, ముఖ్యముగ రాత్రులందు పెనుభూతమై నన్నుఁ బీడించుచుండెను ! కంటిమీద ఱెప్ప వేయక భార్య నామంచమునొద్ద కనిపెట్టుకొని పరిచర్యలు చేయుచుండెడిది. తల్లియు నాకొఱ కమితశ్రమ పడుచుండెను. వారల యవస్థ తలంచుకొనునపుడు, నావ్యసనము మఱింత దుర్భర మగుచువచ్చెను !

ఎట్టకేలకు జనవరి 24 వ తేదీని, గోడ పట్టుకొని కొన్ని యంగలు వేయఁగలిగితిని. ఆరాత్రి నాకు బాధ లేకుండెను. దీనికై నేను దైవమునకుఁ బ్రణతు లొనర్చితిని.

కొలఁదిదినములలో నేను బెజవాడకును, వెంకటరామయ్య పరీక్షకై మద్రాసునకును బోవలయును గాన, భూము లమ్ముపని మాతండ్రి కొప్పగించితి మని ఆయనపేరిట మే మిరువురమును పౌరాష్ట్రనామా వ్రాసి యిచ్చితిమి. అనంతముగారీ తరుణముననే బెజవాడ వదలి వేఱొక యుద్యోగమునకుఁ బోవుచుంటి మని వ్రాయుటచేత, మేము బెజవాడ పయనమునకు సిద్ధమైతిమి. ఇట్టిస్థితిలో సోదరులను, తలిదండ్రులను విడిచిపోవ నాకు విషాదకరముగ నుండెను.

ఎట్టకేలకు 26 వ జనవరి ప్రొద్దున భార్యాసమేతముగ నేను బెజవాడకు బయలుదేఱితిని. మద్రాసుపోవలసిన తమ్ముఁడు వెంకటరామయ్యయు రంగనాయకులు నాయఁడుగారి పెద్దకుమారుఁడు నారాయణస్వామియును మాతో వచ్చి, నా కెంతయు సాయము చేసిరి. గోదావరి యావలి యొడ్డున రెయిలుబండిలోఁ గూర్చుండి మధ్యాహ్నమునకు మేము బెజవాడ చేరితిమి.

16. తుదకు విజయము

గత మూఁడు సంవత్సరములనుండియు బెజవాడలోని క్రైస్తవ పాఠశాలకు ధన్వాడ అనంతముగారు ప్రథమోపాధ్యాయులుగ నుండిరి. ఆయన సజ్జనులు ననుభవశాలురును. వారియందు నా కమిత భక్తి గౌరవములును, నాయెడ వారి కపారవిశ్వాస వాత్సల్యములును గలవు. ఇపు డాయనను క్రైస్తవమతసంఘమువారు "బైబిలు ఆంధ్రానువాదము సరిచూచు సంఘము!" లో సభ్యునిగ నియమించుటచేత సకుటుంబముగ వారు బళ్లారినగరము వెడలిపోవ సిద్ధముగ నుండిరి. అట్టి యుత్తమమిత్రుని విడిచి నాకును, వారి సతీతిలకమగు సౌభాగ్యవతమ్మ గారిని విడిచి నాభార్యకును, ఈప్రదేశమున నివసించుట మొదట కడు దుర్భరముగఁ దోఁచెను. బోధకులు విద్యార్థులును కోరుటచేత, అందఱు ననంతహారి కొసంగవలసిన విజ్ఞాపనపత్రమును నేనె సిద్ధపఱిచితిని. పాఠశాలకుఁ గ్రొత్తయధికారియైన టానరుదొర విశాల హృదయునివలెఁ గానవచ్చెను. అంత ఫిబ్రవరి మొదటి తేదీని పాఠశాలాభవనమున జరిగిన బహిరంగసభలో అనంతముగారి విజ్ఞాపనాపత్రమును నేను జదివితిని. నూతన ప్రథమోపాధ్యాయుఁడు లాలా బాలముకుందదాసుగారు నా కంటె వయస్సునందును బోధకానుభవమందును జిన్నవారు.

బావమఱది వెంకటరత్నము ప్రథ్మశాస్త్రపరీక్షలోను, తమ్ముఁడు కృష్ణమూర్తియు అనంతముగారి ప్రథమ పుత్రుఁడు రామచంద్రరావును ప్రవేశపరీక్షలోను గెలుపొందిరని విని మిగుల సంతసించితిమి. వెంకటరత్నము పట్టపరీక్షకును, కృష్ణమూర్తి ప్రథమశాస్త్రపరీక్షకును జదువుటకై రాజమంద్రికళాశాలలోఁ జేరిరి.