ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/కష్టకాలము, శుభకార్యము

వికీసోర్స్ నుండి

9. కష్టకాలము, శుభకార్యము

అమలాపురోద్యోగపుఁజిక్కు లింతటితోఁ దొలఁగలేదు. నేను బెజవాడయందలి యుద్యోగమున నుండుటకే నిశ్చయించుకొంటిని కాని, అమలాపురోద్యోగము వదలితి నని వ్రాసివేయలేదు ! వదలుకొనుటకు ముందుగ, ఆపని నాకీయఁబడె నను కాకితమే యింతవఱకును నాచేతి కందలేదు! కావునా నా కీయుద్యోగ మక్కఱలేదని నే నెట్లు వ్రాసివేయఁగలను? ఎట్టకేలకు, 8 వ సెప్టెంబరున అమలాపురపుఁబని నా కిచ్చితి మని నాగోజీరావు పంతులుగారి నుండి హుకుము వచ్చెను. నా కిటు లొసఁగఁబడినట్టియు, దొరతనమువారి కొలువుతో సమానస్థిరత్వముగలిగినట్టియు, బోర్డుపని వలదని చెప్పివేసి, క్రైస్తవపాఠశాలను నమ్ముకొని యుండుట భద్రమా యని నే నంత సందేహ మందితిని. బెజవాడమీఁదుగఁ బ్రయాణము చేయు నాగోజీరావుపంతులుగారిని నేను రెయిలుస్టేషనులో 11 వ తేదీని గలసికొంటిని. వెంటనే బెజవాడ పని వదలి, అమలాపురము పొమ్మని వారు ఖచితముగఁ జెప్పివేసిరి! మరల నే నీ విషమద్వంద్వావస్థలోఁ జిక్కుకొనిపోయితిని !

ఇపుడు కొన్నిరోజులు సెల వగుటచేత 16 వ సెప్టెంబరున రాజమంద్రి వెళ్లి, సబ్‌కలెక్టరును జూచి మాటాడితిని. ఈవిషయమై తా నేమియుఁ జేయలే ననియును, నేను నాగోజీరావుగారినే సంప్రదించి చిక్కు విడదీసికొనవలె ననియును, ఆయన చెప్పివేసెను. అమలాపురమందలి యుద్యోగమును స్వీకరింపఁజాలనని నేనంత పంతులుగారికి వ్రాసివేసితిని.

రాజమంద్రిలో నాకనుల కెల్లెడలను కష్టదృశ్యములే కానవచ్చెను. పాపము, దొరతనమువారికళాశాలలో నూఱురూపాయిల వేతనముగల మంచిఉద్యోగము దొరకిన మృత్యుంజయరావున కేమియు సౌఖ్యము లేదు. కఠినవ్యాధి వానిదేహమును బీల్చి పిప్పి చేయుచుండెను ! తోడిబోధకు లాతనిదెస నసూయాగ్రస్తులై యుండిరి. మా కుటుంబములో చిక్కులు మిక్కట మయ్యెను. తండ్రియు తమ్ముఁడు నెంత ప్రయత్నించినను మాచెల్లెలి కింకను వివాహసంబంధము కుదురలేదు. మేము రాజమంద్రిలో నిలిచిన యానాలుగుదినములలోనె మాయింటియం దత్తకోడండ్ర సామరస్యము వెల్లడి యగుచుండెను! ఈ కష్టపరంపర వీక్షింపలేక, నాయక్షులు సంక్షోభించెను.

అంత మేము 23 వ సెప్టెంబరున బెజవాడకు వెడలిపోయితిమి. కొన్ని దినములకుఁ బిమ్మట ననంతముగారు నాతో మాటాడుచు, తా మిటీవల క్లార్కుదొరతో సంభాషించితి మనియు, నేను గోరినచో డిసెంబరులో అమలాపురము వెడలిపోవచ్చు నని యాయన పలికి రనియుఁ జెప్పిరి ! బెజవాడ వీడుటకుమాత్రము నాకు మన సొప్పకుండెను.

అక్టోబరు 13, 14 వ తేదీలలో సతీపతులుభయులము బంధు సందర్శనార్థమై ఏలూరు వెళ్లియుంటిమి. అచటఁ గ్రొత్తగఁ గాపురమునకు వచ్చిన నామఱఁదలు శ్యామలాంబకు, ఆమెభర్తయగు వెంకటరత్నముతోను, ఆతని తల్లితోను మనస్పర్థలు ప్రబలుట విని, వారి గృహకల్లోలము లొకింత శమియింపఁబూనితిమి, ఇంట నంతఁగఁ బొత్తులేని మేమంతట యాయువదంపతులకుఁ జెలిమిచేకూరు సుద్దులు చెప్పి, బెజవాడకు మరలివచ్చితిమి.

ఒకనెల జీతము ముందుగఁ దీసికొని, మాచెల్లెలి వివాహమునకై యుభయులమును అక్టోబరు 20 వ తేదీని రాజమంద్రి పోయి తిమి. తమ్ముఁడు కృష్ణమూర్తి సన్నిపాతజ్వరముచేఁ బీడితుఁడై యుండెను. నాలుగుదినములలో జరుగఁబోయెడి మాచెల్లెలి వివాహమునకు బంధువులను బిలుచుటకై మాతండ్రి రాజమంద్రినుండి వెడలిపోయెను. అర్తమూరు సంబంధము మే మంత నిశ్చయించి, పెండ్లికుమారుని తలిదండ్రులకుఁ దెలియఁబఱచితిమి. ఒక మూల పెండ్లిపనులు, వేఱొక మూల రోగికిఁ బరిచర్యలు !

వివాహదినమగు బుధవారము సమీపించినకొలఁది, మా యలమట మఱింత హెచ్చెను. బంధువుల పిలుపునకుఁ బోయిన మా తండ్రి పెండ్లి వెనుకటిరోజునకైన నిలు సేరలేదు ! తమ్మునివ్యాధి నిమ్మళింపలేదు. ఎట్టకేలకు మంగళవారమురాత్రికి మాజనకుఁడు బంధుసమేతముగ నింటికి వచ్చెను. పెండ్లివారుకూడ ధవళేశ్వరమునకు వచ్చియుండిరని తెలిసెను.

పెండ్లికొమార్తెకు జ్వరము వచ్చుటచే వివాహము మఱునాఁడు జరుగలేదు. ఎట్టకేలకు 25 వ అక్టోబరు, గురువారము ప్రాత:కాలమున ధవళేశ్వరమున జనార్దనస్వామి యాలయమున మాచెల్లెలు కనకమ్మను పులుగుర్త సీతాపతిరావున కిచ్చి వివాహము చేసితిమి. మాతమ్ముఁడు కృష్ణమూర్తి వ్యాధిగ్రస్తుఁ డగుటవలన వానిని విడిచి మా తలిదండ్రులు రాఁజాలక పోయిరి. కావున నేను భార్యయును కన్యాదానము జరిపితిమి. ఒక జాములోనే వివాహము పూర్తి కాఁగా మేము రాజమంద్రి వచ్చి చేరితిమి.

అంత మా తమ్ముని జ్వరము మఱింత హెచ్చెను. రంగనాయకులు నాయఁడు గారు మిగుల శ్రమపడి రోగి కౌషధము లిచ్చుచుండిరి. కొలఁది దినములలోనె పెండ్లికూఁతునికీ జ్వరము సోఁకెను. నేను మరల 29 వ అక్టోబరు సోమవారమే నా యుద్యోగమునఁ బ్రవేశింపవలెను గాన, మేము ఉభయులమును వెనుకటిరోజుననే బెజవాడకు వెడలిపోయితిమి.

10. బెజవాడ స్నేహితులు

పెండ్లిలోనే యారంభమైన మాచెల్లెలి యస్వస్థతయు సన్ని పాతజ్వరముగనె బరిణమించెను ! మిత్రుఁడు రంగనాయకులు నాయఁడుగారు నాయందలి యవ్యాజసోదరబావమున నా తమ్మునికిఁ జెల్లెలికిని మిగుల శ్రమపడి వ్యాధి నివారణముఁ జేసిరి. జ్వరవిముక్తులై తెఱపిని బడిన వారిరువురును మిగుల బలహీనదశ నుండిరి. శరీరమున సత్తువ పుట్టుటకై నాయఁడుగారు వారికి మంచిమందు లొసఁగిరి. ఎట్టకేలకు వా రిరువురును పూర్ణారోగ్యవంతులైరి.

బెజవాడ "స్వయంకృషి సమాజము" వారు తమ సమాజవర్థంతికి న న్నధ్యక్షునిగాఁ గోరఁగా, నా యుపన్యాసము సిద్ధపఱచితిని. 10 వ నవంబరునం దాయుత్సవము జరిగెను. అనుకొనిన యంశము లనేకములు ప్రస్తావింప నే మఱచిపోయినను, మొత్తముమీఁద నా యుపన్యాసము సమగ్రముగనే యుండెను. దానిసారము వార్తాపత్రికలకుఁ బంపితిని. నా యాధిపత్యమున జరుగు జనానాపత్రికకే కాక, యితర వార్తాపత్రికలకును దఱచుగ నేను వ్రాయుచుండువాఁడను. నే నిట్లు వ్రాయుచుండుటవలన, నయూహలకు సుస్థిరత్వమును, పదజాలమునకు సులభగమనమును, కాలక్రమమునఁ బట్టువడెను.

మత సంఘ సంస్కరణ విషయముల గుఱించి నేను దీఱికసమయములందు పాఠశాలలో బాహాటముగఁ బ్రసంగించుచుండువాఁడను