ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/"హిందూసుందరీమణులు"

వికీసోర్స్ నుండి

లో సంఘసంస్కరణానుమోదమునకును నిట్టి సమ్మేళన మొనఁగూర్చినప్రతిష్ఠ, ఆంధ్రకవిశేఖరుఁడగు వీరేశలింగము పంతులకే ముఖ్యముగఁ జెందవలయును.

"ఆంధ్రజనులు, తమ కిష్ట మున్నను లేకున్నను, వీరేశలింగముపంతుల తలంపులే తలంచుచున్నారు. వారిపలుకులే పలుకుచున్నారు. కొలఁది కాలములో వారికార్యములే యాచరించెద రని మాయాశయము. ఇది భగవదుద్దేశము. లూధరు మహాసంస్కర్తను వెక్కిరించిన సమకాలికి లందఱు సమాధులలోని కెక్కినను, వారిసంతతివారే లూధరునికి స్మారకచిహ్నముగ మహాసౌధనిర్మాణము చేసిరి. వీరేశలింగ వ్యక్తియొక్క యూహలు పలుకులు పదములును శక్తిమంతము లైనను, ఆయనక్రియలే మనకు ముఖ్యములు మనము ధన్యులము కాఁగోరితిమేని, యా మహాశయుని బోధనలు విని, పలుకులు మననముచేసి, కార్యముల ననుకరింపవలయును"

28. "హిందూసుందరీమణులు"

1898 వ సంవత్సరము మార్చి 22 వ తేదీ శనివారము నేను 4, 5 తరగతుల విద్యార్థులకు పరీక్షలు చేసితిని. ఒకపిల్ల వాఁడు ప్రశ్నకాకితముల కుత్తరువులు వ్రాయుచున్న వానివలె నటించి, పరీక్షా సమయమున నేదో పుస్తకపుఁ బుటలు తిరుగవేయుచుండెను. నే నట్టె చూడఁగ, అది "కళాశాస్త్రము"! నే నా పుస్తకమును దీసికొని, ఈ సంగతిని విచారించి విద్యార్ధినిఁ దగినట్టుగ శిక్షింపుఁ డని యచట నిలుచుండిన ప్రథమోపాధ్యాయునిఁ గోరితిని. ఆ పిల్ల వానినిగుఱించి మిగుల విషాదమందితిని. విద్యార్థులకు నీతిబోధనము చేయుట కొక సమాజ ముండుట యావశ్యకమని తలంచితిని. పదిదినములు గడచిపోయెను. ప్రథమోపాధ్యాయుని కీవిషయమునఁ జీమకుట్టదయ్యెను ! అంతట 28 వ తేదీని గూడిన యుపాధ్యాయసభలో నే నీసంగతిని బ్రస్తావించి, పాఠశాలాధ్యక్షుని వైఖరిని గర్హించితిని. అతఁడు కుపితుఁడై విద్యార్థి చేష్టను సమర్థింపఁబూని, తనకా కళాశాస్త్రపుస్తకమును నే నీయకుండుటయే, దీనినిగుఱించిన కాలహరణమునకుఁ గారణ మని సాకు చెప్పెను. నా కతితీవ్రమైన కోపము వచ్చెను. నాఁడు పిల్ల వానిని నేనే శిక్షించి యుందు ననియును, పైయధికారియగు తా నచట నుండుటవలన, తమమీఁది గౌరవభావము చేతనే నీ నీసంగతి తనవిచారణ కొప్పగించితి ననియును, నేను బలికితిని. తాను బ్రహ్మచారి యగుటచేత స్త్రీల గోప్యాంగవర్ణ నాదికము గల యిట్టిపుస్తకము నేను తన కీయలే దనియు, ఇపుడైన నీయఁజాల ననియు, విద్యార్థిశిక్షనుగుఱించి తా నింక నుపేక్ష చేసినచో, పాఠశాలాధికారి కీసంగతి విన్నవించుట నావిధి యనియును నేను గట్టిగఁ జెప్పివేసితిని !

నామాటలకు ప్రథమోపాధ్యాయుఁ డుగ్రుఁడయ్యెను. కాని, నాతీవ్రప్రసంగఫలితముగనే యాతఁ డీవిషయమునఁ దనవిధ్యుక్తము నెఱవేర్ప నంగీకరించెను. మఱునాఁడు విద్యార్థు లందఱియెదుటను, ఆ బాలకుని నిలువఁబెట్టి, ప్రథమోపాధ్యాయుఁడు శిక్షించెను. ఈదురభ్యాసమునకులోనగు విద్యార్థిశిక్ష ఉపాధ్యాయు లందఱికిని సమ్మతమె కాని, యిట్టిపనులు విద్యార్థులు బహిరంగముగ జరుపుటయందలి రహస్య మొకింత యారయుట యగత్య మనియె వారలమొఱ ! ఇచటి ప్రథమోపాధ్యాయుఁడు మున్నగు కొందఱు ఉపాధ్యాయుల శోచనీయమగు చర్యలెదీనికిఁ గారణ మని యందఱికిని దెలిసియుండెను. "అత్తపనుల కారడులు లేవు." పూతచారిత్రుఁడగు క్రీస్తుమహాశయుని మతప్రచారమే ముఖ్యోద్దేశముగఁగల యిట్టివిద్యాలయములలో, నీతి విషయమున మంచిపేరు లేని బోధకుల నియమించెడి యధికారుల నే మనవచ్చును !

నా కాలమున వ్రాఁతపనియం దెంతో యాసక్తి. ఒక్కొకప్పుడు రాత్రి రెండుజాములకే నాకు మెలఁకువవచ్చి పిమ్మట మరల నిద్దుర పట్టకుండెడిది. ఊరక మంచము నంటిపట్టుకొని యుండనొల్లక, నే నంతఁ గలము చేతఁబట్టి, దీపముదగ్గఱఁ గూర్చుండువాఁడను. 'జనానాపత్రిక'కు సంపాదకుఁడ నగుటచేత, ఆపత్రిక కేదో సదా వ్రాయుచుండువాఁడను. 'సత్యసంవర్థనీ', 'ఫెల్లోవర్కరు', 'మద్రాసుస్టాండర్డు' పత్రికలకును, ఆంగ్ల వ్యాసములు వ్రాయుచుండువాఁడను. కాని, వీనియన్నిటికంటె "సంఘసంస్కారిణీ" పత్రికకు వ్రాయుటయందు నాకు మిగుల మక్కువ. నాకుఁ బ్రియములగు సంస్కరణములను గూర్చి నా యిచ్చవచ్చినచొప్పున నింగ్లీషున వ్రాసి, యారచనముల నాపత్రికకుఁ బంపుచుండువాఁడను. ఆపత్రికకు వ్రాయఁ గేలఁగలము పూనఁగనే, ఉత్సాహోద్రేకములు నాకుఁ గలిగి, పొంకమగు పదజాలముతో నొప్పెడి వాక్యములదొంతరలు కాకితముమీఁద దొరలుచుండెడివి ! రానురాను మృదుహాస్యరసయుక్తమగు వ్యాసరచన మాంగ్లమున నా కభ్యాసమయ్యెను. వ్రాయుకొలఁది నాకలమునకుఁ దీవ్రగమనమును లభించెను.

ఒకొక్కప్పుడు, ఆంధ్రరచనముకూడ నా కుత్సాహకరముగ నుండెడిది. కాని, యింగ్లీషునవలెఁ దెలుఁగున వ్రాయునపుడు, సామాన్యముగ నేను స్వతంత్రముగ నాలోచింప నక్కఱలేదు. మాతృక లగు నాంగ్లపుస్తకములు, పత్రికలును నా కీసందర్భములం దాధారములు. వానినుండి భాషాంతరముచేయుటయే తెలుఁగున నా ముఖ్యకార్యము. ఇపు డీ జూలైనుండియు నేను "జనానాపత్రిక"ను పొడిగించిన హేతువున నెక్కువగఁ దెలుఁగున వ్రాయవలసివచ్చెను. వెంటనే పుస్తక రూపమునఁ గొన్ని ప్రతులు తీయుట కనువుగ నుండుగ్రంథ మేదైన నారంభించుట యుక్త మని నాకుఁ దోఁచెను. తాత్కాలికోపయోగమునకై పత్రికలకు వ్యాసములు వ్రాయుట వ్యర్థకాలక్షేపము. అట్టి వ్యాసములు చదువరుల కెపుడు నుపయుక్తమై రుచించునట్టివిగ నుండవు. కావున స్థిరరూపము తాల్చు పుస్తకరచనమునకే నే నిపుడు పూనితిని. ఈ యొకపనిమూలమున, పత్రికాప్రచురణ పుస్తకముద్రణములను రెండుకార్యములు నేను సాధింపవచ్చును.

"జనానాపత్రిక"లో నిదివఱకు స్నేహితులపుస్తకము లీరితిని ప్రచురింపఁబడినవియె. "గృహనిర్వాహకత్వము" అను పుస్తకము నివ్విధముననే నా పత్రికలోఁ బ్రచురించితిని. స్త్రీల కుద్దేశింపఁబడిన పత్రికలో భారతదేశమున నిదివఱకుఁ బ్రసిద్ధినొందిన పుణ్యాంగనలకథ లుండుట సమంజసముగదా. ఈమేయినెల సంచికలోనే "శకుంతల" కథను వ్రాసితిని. ఇపుడు జూలై నుండియు "సీత"చరిత్రమును వ్రాసి ప్రచురించితిని. పిమ్మట 'సావిత్రి' మున్నగు స్త్రీలకథలువ్రాసి, 99 వ సంవత్సరము ఏప్రిలు నెల నాఁటికి "హిందూ సుందరీమణుల చరిత్రముల" మొదటిభాగమును బూర్తిపఱిచితిని. పత్రికలో ముద్రింపఁబడిన యీకథలు, వెనువెంటనే పుస్తకరూపమునఁగూడ బ్రచురింపఁబడెను.

మిగులఁ బరిశ్రమ చేసియే నే నీ పుస్తకములు వ్రాసితిని. అదివఱకే భారత, రామాయణాదులు చదివియుండినను, ఇపు డీకథలకొఱకై ఆయా పుస్తకములు నే నీమాఱు సమగ్రముగఁ జదువవలసివచ్చెను. ఇంతియకాక, ఒక్కొకచరిత్రలోని కథకొఱకు మూఁడునాలుగు పుస్త ములు నేను దిరుగవేయవలసివచ్చెను. ఆ పుస్తకములనుండి రమ్యములగు పద్యములుకూడ నుల్లేఖించితిని. కథలో రసహీనములగు భాగములు వదలివేసి, వినోదకరములును నీతిదాయకములును నగుపట్టులకుఁ బ్రాముఖ్య మిచ్చుచుండువాఁడను. పురాణేతిహాసములలోని కథాక్రమమును సామాన్యముగ మార్పకుండువాఁడను. మిక్కిలి యరుదుగనే నా సొంత యభిప్రాయములను చరిత్రములలోఁ జొప్పించుచుండువాఁడను.

ఈకథలలో నెల్ల సీతాద్రౌపదులచరిత్రములు ఉత్కృష్టములు. ప్రాచీనకాలహిందూసుందరు లందఱిలోను సీతయే శీలపవిత్రతలయందుఁ బ్రథమగణ్య. రాముఁడు సుగుణాభిరాముఁడె యైనను, హృదయేశ్వరియగు సీతయెడఁ దుద కాయన చూపిననిరసనమునకును, అందుమూలమున నా పుణ్యవతి కాపాదిల్లిన శోకకష్టములకును వగవానివా రుండరు. ఈకథలన్నిట్టిలోను ద్రౌపదిచరిత్రము కడు దీర్ఘమైనది. ఆ సుగుణవతిచరిత్రమున నెన్ని యంశములో యిమిడియుండుటచేత, కథ విపులముగఁ దెలుప నవకాశము గలిగెను.

29. పితృనిర్యాణము

విజయదశమిపండుగలకు నే నొకసారి మా తల్లిదండ్రులను జూచుటకు 24 వ సెప్టెంబరున రాజమంద్రి వెళ్లితిని. అందఱు నచట సుఖముగ నుండిరి. మిత్రులను సందర్శించితిని. మందిరములో ప్రార్థన జరిపితిని. స్నేహితులగు పాపయ్యగారికి పోలవరము సంస్థానాధికారి యుద్యోగ మగుటకు మా యభినందనములు తెలుపుచు నొక తీర్మానము గావించితిమి. మఱునాఁడు అత్తగారు మున్నగు బంధువులను జూచివచ్చితిని. నాకు రాజమంద్రికళాశాలలో నుద్యోగము దొరకు