ఆంధ్రుల సాంఘిక చరిత్ర/P319

వికీసోర్స్ నుండి

రణము కుడుపు:-
తెనుగు దేశములో అతి ప్రాచీనమునుండియు వైదికవిధానమునకు భిన్నముగా ద్రావిడ దేవతల కొలుపు శక్తులుగా అంగీకృతములయిన దేవర్ల మ్రొక్కుబళ్లు స్థిరపడి పోయినవి. బ్రాహ్మణేతరులకు ఈ క్షుద్ర దేవతలపై గల భక్తి శివకేశవులపయిన లేదని చెప్పవచ్చు. నేటికిని చిన్నదేవర్లను, పెద్ద దేవరను ప్రతి తెనుగు పల్లెలో చేయుదురు. పెద్దదేవర పూజలో దున్నపోతును బలియిచ్చి 'పొలి' యన్నమును రక్తముతో కలిపి దేవరముందు 'బోనము' పెట్టి ఆన్ని ఊరి పొలిమేర చుట్టు (పొలియన్నము వేయుమేర-పొలిమేర) చల్లుచు మధ్య మధ్య మేకలను, కోళ్ళను కోసి భూతబలి యిత్తురు. భూతబలిని (పొలియన్నమును) చల్లువాన్ని 'భూతపిల్లిగాడు' అని యందురు. అది భూతబలిగాడు అను పదమే. వాడు నెత్తినుండి కాలిగోరువరకు కనుబొమ్మలతో సహా శరీరమంతటను ఒక్క వెంట్రుకకూడా వెదకినను కానరా నట్లుగా గొరిగించుకుని సంపూర్ణముగా నగ్నుడై పొలి, పొలి యని పొలికేకలు వేసి పొలియన్నమును చల్లి రాసినుండి యన్నమును కుండలో పెట్టుకొని కావలివారితో సహా ఊరి చుట్టు తిరిగి వచ్చును. పూర్వము యుద్ధమునకు పోవువారు శాకినీ ఢాకిన్యాది భూతాలకు పొలియిచ్చి పోవుచుండిరేమో. యుద్ధములో గెలిచినవారు శత్రువుల మాంసముతో, రక్తముతో ఉడికించిన యన్నమును కలిపి రణ పిశాచాలకు బలియిచ్చి వచ్చెడివారేమో. వెలమరాజు లట్లు చేసినట్లు వెలుగోటి వారి వంశావళిలో(ప.౬౦) ఇట్లు తెలిపినారు ".......కొండమల్రాజు మొదలగు రాజుల రణంబులో జంపి నూటొక్క రాజుల శిరంబులు ఖండించి, ఏబదియొక్క రాజులను కలుగానుగ లాడించి మరియు ముప్పది రాజుల బట్టి పూజించి రణబలిగా దెచ్చి, ఆ రణక్షోణి నర్పించి దిగంబరీ, కాళీ, మహాకాళీ, శాకినీ, ఢాకినీ, బాయళా, కాయినీ, భూతప్రేత పిశాచంబుల దలచి, రణదేవరా! మహారణరాజా! రణశూరా, రణవీర భేతాళ, భైరవ, వీరభద్ర, రణపోతురాజా, కలహకంటకీ, అని నిజబలంబులకు జయంబు కలిగెననుచు, కలహాధిదేవతల నారాధించి, తలంచి, పూజించి, మహాకాళికి వీరరాజుల నరబలిగా నరికించి, భట్టును తామును రణము గుడిపించి వారి రక్తంబుల తమ తండ్రికి తిలోదక పితృ తప్రణంబులు చేసిరి." దిగంబరీ దేవిని (పెద్ద దేవరను) కొలుచువాడు దిగంబరుడుగా నుండవలెనేమో! ఆర్యులీ దక్షిణమునకు రాకముందు ఈ దండకారణ్యవాసులు నగ్నులుగా తిరిగిన నాటి ఆచార శకలముగా ఇది కానవస్తున్నది. భూత