ఆంధ్రుల సాంఘిక చరిత్ర/P102

వికీసోర్స్ నుండి

అన్నము తినుట యాచారముగా నుండెను. "చల్లా యంబలి ద్రావితిన్ రుచుల దోసంబంచు నోనాడితిన్ తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా! నేను శ్రీనాథుడన్" అనియు, "ఓ ఫుల్లసరోజనేత్ర ఉడుకు బచ్చలిశాకము జొన్నముద్దయున్ మెల్లన నొక్కముద్ద దిగమ్రింగుము నీ పస కాననయ్యెడిన్" అని నిరసించిన దీ సీమనుగూర్చియే.
రెడ్డిరాజుల రాజ్యకాలములో జనులు ప్రభుత్వమునెడ చాలా సంప్రీతులై యుండినట్లున్నది. లేకున్న ఓఢ్ర కర్ణాట ముసల్మాన పద్మనాయకోజ్జృంభణ దండయాత్రలలో నెన్నడో తిరుగుబాటు చేసియుందురు. ఇందలి ప్రబల శత్రువులను అవలీలగా నోడిస్తూ వచ్చిరనిన రెడ్డిరాజులకు ప్రజావలంబన ముండిన దనుట స్పష్టము. ప్రజలపై అక్రమమగు పన్నులు వేసినవారు కారు. తుది కొండవీటిరాజగు రాచవేమన ప్రజాబాధాకరములగు క్రొత్తపన్నులు వేయుటచే ప్రజలు తిరుగుబాటు చేసినట్లు కొండవీటి దండకవిలె తెలుపుచున్నది. అతడు పురిటిపన్ను ఒకటి మోపగా ఎల్లప్పయను బలిజనాయకుడు దాని నిచ్చుకొనలేక వేముని చంపివేసెను.
రెడ్డరాజుల రాజ్యపతనము క్రీ.శ.౧౪౩౪ ప్రాంతములోనయ్యెను. చిరకాలమునుండి ప్రబల ప్రయత్నాలు చేయుచూ వచ్చిన ఓఢ్ర (ఒడ్డె) రాజులు తూర్పుతీరపు దేశమును, గుంటూరు సీమను ఆక్రమించుకొని పాలించిరి. వారికి ప్రజలపై ప్రీతిలేకుండెను. దేశమునుండి అన్నివిధముల ద్రవ్యమును లాగుకొనిపోవుటయే వారి ప్రధానాశయమైనట్లుండెను. కవుల ఆదరణము, కళాపోషణము వారిలో లవలేశమైన కానరాలేదు. అఖిలాంధ్ర పూజ్యుడును, కవి సార్వభౌముడును, సార్వభౌమ సమ్మాన్యుడును నగు శ్రీనాథునే వారు కష్టపెట్టిరి. రెడ్డిరాజులలోని పలువురిపాలన లందుండి ద్రవ్య మార్జించి దానిని దొరవలెనే దానముచేసి వారి యనంతరము సహస్రమాస జీవియైన శ్రీనాథుడు జీవనార్థమై కొంతభూమిని, ౭౦౦ బంగారు టంకాలకు గుత్తకు తీసికొని పంటలు పండక పన్నియ్యలేక అవమానము లంది యిట్లు విలపించెను.

సీ.కవిరాజు కంఠంబు కౌగిలించెనుగదా
     పురవీధి నెదురెండ పొగడదండ