అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/రాణీ సంయుక్త

వికీసోర్స్ నుండి

అబలాసచ్చరిత్రరత్న మాల.

రెండవ భాగము.

రాణీ సంయుక్త.

12 వ శతాబ్దమునందు రారోడ్‌వంశీయు డగుజయచంద్రుడు కనౌజ (కాన్యకుబ్జ) రాజ్యమును, చవ్హాణవంశోద్ధారకుడగు పృధివీరాజు డిల్లీరాజ్యమును పాలించుచుండురి. ఈయసామాన్యపరాక్రమవంతు లిరువురిలో సంయుక్త జయచంద్రునకు గూతురును పృధివీరాజునకు భార్యయు నయ్యెను. కాన నా రెండువంశములును నామెవలన బవిత్రము లయ్యె ననుటకు సందేహము లేదు.

జయచంద్రునకు సంయుక్త యొక్కతయే కూతు రగుట వలన జయచంద్రుడు సంయుక్త నెక్కువ గారాబముతో బెంచెను. సంయుక్త స్వభావమువల్లనే సద్గుణవతిగాన బెరిగినకొలదిని ననేకవిద్యల నేర్చి మిగుల నుతి కెక్కెను. ఆమె సద్గుణములును లావణ్యమును గనిన ప్రజ లందఱు దమజన్మము సార్థక మయ్యెనని తలచి సంతసించుచుండిరి. ఇట్లీమె కొన్నిదినములు బాల్యావస్థయందు గడపి యౌవనావస్థందాల్చెను.

ఇట్లు యుక్తవయస్కురా లగుబిడ్డకు దగినవ రు డెవడాయని జయచంద్రుడు చింతింపసాగెను. సంయుక్త రూపలావణ్యములకీర్తి సకలదిక్కులను వ్యాపిం నందున ననేకరాజపుత్రు లామెను దమ కిమ్మని కోరుచు వర్తమానము లంపిరి. డిల్లీపతియగు పృధివీరా జామె రూపగుణములను విని యామెను నెటులయిన జేపట్ట నిశ్చయించెను. సంయుక్తయు ననేకపర్యాయములు పృధివీరాజు పరాక్రమములను విని రూపము చూచి యున్నందువలన నాతని నే వరించెదనని మనంబున నిశ్చయించుకొనియెను జయచంద్రుడు తనకూతునకు దగినవరుడు దొరక వలయునని స్వయంవరము చేయనెంచెను. పుత్రికవివాహమునకు బూర్వము రాజసూయము చేయ నిశ్చయించి సకల దిక్కుల రాజులకును వర్తమానము లంపెను. జయచంద్రుడు పరాక్రమవంతు డగుట వలన నితరమాండలిక రాజు లంద ఱాయన పిలిచినదినమునకు వచ్చి కనోజనగరము నలంకరించిరి. పృధివీరాజు మాత్రము జయచంద్రునితో గల పూర్వవైరమువలన నాయుత్సవమునకు రాకుండెను. అందునకు జయచంద్రుడు మిగుల కోపించి యాతనితో గలవైరమువలన, పృధివీరాజు ప్రతిమ నొక దానిని జేయించి యాప్రతిమను ద్వారపాలకుని స్థలమునందుంచి, తనపగ సాధించెను. యజ్ఞము విధిప్రకారము జరిగినపిదప స్వయంవరోత్సవ మారంభమయ్యెను. అప్పు డనేక దేశాధీశు లొకచోట నానందముగా గూడినందున కనౌజపట్టణము మిగుల నందముగా గానిపించెను.

రాజాజ్ఞప్రకారము మంత్రులు మండపము నలంకరించి రాజుల నందఱిని వారి వారికి దగుస్థానముల గూర్చుండబెట్టిరి. అటుపిమ్మట సంయుక్తచేత బుష్పమాలను ధరియించి సఖీసహితమయి యామండపమునకు వచ్చెను. రాజకన్య సభకు రాగానే రాజపుత్రు లందఱి చూపులు నామెవైపునకే మరలెను. ప్రతి భూపతియు నామెతనను వరియింపవలెననికోరుచుండెను. సంయుక్త మిగుల గంభీరదృష్టితో రాజలోకమునంత నొక్కసారి కలయఁ జూచెను. తన కిష్టుఁ డగుపృధివీరా జచటికి రాలేదనియు ఆయనను బరిహసించుట కాయన ప్రతిమ నొకదానిని జేసి ద్వారమునం దుంచి రనియు నామె కంతకుఁ బూర్వమే తెలిసియుండెను. అందువలన నాబాల యొకగడియవఱకే యోచించి తుదకు దృఢనిశ్చయురాలయి తిన్నఁగా నడిచి ఢిల్లీశ్వరప్రతిమను సమీపించి యామూర్తికంఠమునందుఁ బుష్పహారమును వేసెను. దాని గనినతోడనే సభయం దంతట నొకటే కల్లోల మయ్యెను. జయచంద్రుఁ డిట్టియవమానమును సహింపఁజాలక కోపావేశ పరవశుడైఁ "దుష్టురాలగు దీనిని గారాగృహమునం దుంచుఁ"డని యాజ్ఞాపించెను. అంత రాజు లందఱు నిరాశను బొంది తమతమనగరములకుఁ జనిరి. ఇదియే యీదేశమున జరిగిన కడపటి స్వయంవరము.

ఈ సంగతి యంతయు విని పృథివీరాజు పరమానందభరితుఁ డయ్యెను. జయచంద్రుఁడు తనను బఱచిన యవమానమును సంయుక్త తనయందుఁ గనఁబఱచిన ప్రేమయు నేకీభవించి తన్నుఁ ద్వరపెట్టఁ బృథివీరాజు జయచంద్రునిపై యుద్ధయాత్ర వెడలెను. ఇట్లాయన శూరులగు యోధులతోఁ గనోజపట్టణము సమీపమున విడిసెను. అచట నున్న కాలమున నే యొకరాత్రి మిగుల రహస్యముగాఁ బృథివీరాజు సంయుక్తను గలిసి గాంధర్వవిధిచే నామెను వరియించెను.

వీరివివాహవార్త యొకరిద్దఱు దాసీలకుఁ దప్ప నితరుల కెంతమాత్రముఁ దెలియదు. పృథివీరాజు వచ్చి తనగ్రామముబైల విడియుట విని యాతనినిఁబట్టి తెండని జయచంద్రుఁడు మూడువేలసైన్యము నంపెను. కహరకంఠీరుఁ డనువాని ముందిడుకొని శత్రుసైన్యములు తమవైపునకు వచ్చుటఁ గని పృధివీరాజును వారితోఁబోరుటకు సిద్ధముగా నుండెను. తదనంతర మారెండుసైన్యంబు లొండొంటిం దాఁకి మిగుల ఘోరంబుఁగా బోర సాగెను. అందుఁ బృధివీరాజు సేనానియగు ఆతతాయికిని జయచంద్రుని సైన్యాధిపతియగు కహరకంఠీరునకును ద్వంద్వయుద్ధంబు ప్రాప్తించెను. ఆశూరు లిరువురును సింహనాదములు చేయుచు నొండురులతో నెక్కుడు పంతంబులు పలుకుచు నొకరినొకరు నొప్పించుచుండిరి. అంతఁ గొంతసేపటికి భటుల యొక్కయు, గుఱ్ఱములయొక్కయు, నేనుఁగులయొక్కయు, దేహములనిండ కారురక్తము ప్రవాహమయి పాఱఁదొడఁగెను. అట్టిసమయమున కహరకంఠీరుని రోషావేశ మధిక మయినందున నాతఁడు తనరధంబుడిగ్గి ఆతతాయిని తనఖడ్గమునకు బలియిచ్చి పృధివీరాజు కంఠముఁ తెగ నేయ నుంకించెను. కహరకంఠీరుని శౌర్యమున కోడి పృధివీరాజు బలంబులు చెదరి పాఱసాగెను. అట్టిసమయంబునం దాకస్మికముగా నొకశౌర్యనిధి యచటికివచ్చి పృధివీరాజు కంఠముపైఁ బడ నున్న ఖడ్గమును దునియలుచేసి యాతనిఁ గాపాడెను. ఈపరాక్రమవంతుఁ డెవఁడో యొక రాజపుత్రుఁడని చదువరులు భ్రమపడవలదు. అట్లు తన సాహసమువలనఁ బృధివీరాజును గాపాడినది యాతనిపత్నియు జయచంద్రునికూఁతురు నగు సంయుక్తయే. ఆమె తనభర్తను గలసి యాతనితో వెళ్ళవలయునని బహుప్రయాసముతోఁ గారాగృహమువెడలి యతియోగ్యమైన సమయమున నాస్థలము ప్రవేశించెను. తానెన్నఁడును సంగ్రామముఁ జూడనిదైనను ఆమె జంకక సమయసూచకత గలదియై తానును యుద్ధముచేసి తనభర్తప్రాణములఁ గాపాడెను.

సంయుక్తవచ్చినపిదప పృధివీరాజుబలములు మరల చేరుకొని జయచంద్రునిసేనల నోడించెను. తదనంతరము పృధివీరాజు భార్యాసహితుఁడయి ఢిల్లీనగరమున కరిగెను. ఈదంపతు లిరువురును గొంతకాలమువఱకు పరస్పరానురాగము కలవారయి ప్రజలను తమబిడ్డలవలెఁ బాలించుచుండిరి.

ఇచ్చట జయచంద్రుడు పృధివీరాజు తనసైన్యము నోడించి తనకూతుఁను గొనిపోవుటవలన సంతప్తహృదయుఁడయి పగ తీర్చుకొన సమయము వేచియుండెను. ఇట్లీ దేశపురాజులలో నన్యోన్య ద్వేషములుకలిగినసమయమున 'శాహబుద్దీన్ మహమ్మద్ గోరీ' యనుమహమ్మదీయుఁడు హిందూదేశముపై దండు వెడలెను. వాఁడిచ్చటికి వచ్చి దేశమంతను మిగుల నాశము చేయసాగెను. అనేక దేవాలయములఁ బడఁగొట్టియు జనులనన్యాయముగాఁ జంపియు స్త్రీలపాతివ్రత్యములఁ జెఱిచి వారిని తనదాసులను చేసికొనియు మహాక్రూరత్వమును జూపఁ దొడఁగెను. వానిపాదము సోఁకిన చోటెల్లను నాశ మొందుచుండెను. కాన నట్టివాని నోడించి పతివ్రతల పాతివ్రత్యమును, మఠమందిరములను గాపాడనెంచి పృధివీరాజు గోరీని శిక్షింపవెడలెను. అప్పుడు జయచంద్రుఁ డొకఁడు దక్క నితరరాజులంద ఱాతనికిఁ దోడుపడిరి. కోపమే ప్రధానముగాఁ గల జయచంద్రుఁడు దేశ క్షేమమును గోరి పృధివీరాజునకుఁ దోడుపడకున్నను దేశీయుల దురదృష్ట మింకను ముదరనందున నప్పటికిమాత్రము గోరీకి సాహాయుఁడు గాకుండెను.

పృధివీరాజు మహాశౌర్యముతోఁ దిలావడీయను ఎడారియందుఁ గోరీసైన్యముల పలుమాఱు నోడించెను. పృధివీరాజు పరాక్రమమున కోర్వఁజాలక తుదకుగోరీ బహుకష్టముతో పలాయితుఁ డయ్యెను. పృధివీరాజును విజయానందముతో నితర సామంతులతోఁ దననగరుఁ బ్రవేశించెను.

పృధివీరాజున కయినజయమువలన జయచంద్రున కధికవ్యసనము గలిగి యాతని మనం బెప్పుడును పృధివీరాజు చెఱుపునే కోరుచుండెను. అందువలన నాతఁ డెట్టి నీచోపాయమువలననయిననుఁ బృధివీరాజునకుఁ జెఱుపుజేయ నిశ్చయించెను. అందువలన నాతఁడు తనదూతనంపి పాఱిపోవుచున్న గోరీని మరల మనదేశమునకుఁ గొనివచ్చెను. ఇట్లురప్పించి యాకుత్సితుఁడు తానతనికిఁ దోడుపడుటయే గాక యితర రాజుల ననేకులను నీకుఁ దోడు తెత్తునని నమ్మికఁ దోఁపఁబలికి యాతనిని మరల పృధివీరాజుపైకి యుద్ధమునకుఁ బురికొల్పెను.

జయచంద్రుని సహాయమువడసి మిగుల ధైర్యముతో గోరీ మరల ఢిల్లీనగరముపై దండువెడలెను. జయచంద్రుఁడు తా నన్నప్రకార మితరరాజుల ననేకులను దనవెంటఁదీసికొని యాతురుష్కునికిఁ దోడుపడెను. ఇట్లుచేసి పృధివీరాజుల కిఁక జయము దొరకదని యాదీర్ఘక్రోధి సంతసించుచుండెను. దుర్జనులు తమకార్య మీడేరుటవలన, దేశమునకంతకును నష్టము కలుగునని తెలిసినను వెనుక దీయరుకదా? కాలిందీనదీతీరమునందు జయచంద్రుఁడు తనసేనలతో దిగి యొకదినము తనశిబిరంబులోఁ గూర్చుండి రాబోవుస్థితినిఁ దలఁచుకొని సంతోషించుచుండెను. ఇంతలో నొక సేవకుఁడు తమవైరి సైన్యములోనుండి యొకరాయబారి తమతో మాటలాడ వచ్చెననియుఁ దమ సెలవయినయెడల నాతని నిటకుఁ దోడ్కొని వత్తుననియుఁ జెప్పెను. అందు కాతఁ డాపరిచారకునితో నీ వావల నేయుండి యాతనిని నావద్దకిఁ బంపుమని చెప్పి తాను తనఖడ్గము చేతఁగొని కూర్చుండెను.

అంతఁ గొంతసేపఁటికి నొకతరుణుఁ డచటికివచ్చి జయచంద్రునిపాదముల కెరగెను. ఆవచ్చినయోధుఁడు పురుషుఁడు గాక మనకధానాయికయగు సంయుక్తయే. కాన జయచంద్రుఁడు తనకొమార్తెను గుర్తించి నీ వేమికోరెదవని యడిగినతోడనే యామె ఇట్లనెను. "నాయనా! నేను తమయనుజ్ఞను బొంది మనదేశమునకు శత్రువగుగోరీని జంపఁగోరివచ్చితిని. ఈసమయమునందుఁ బెద్దల యాశీర్వచనముపడసిచనిన తప్పక జయము కలుగును." జయచంద్రుఁడు కూఁతుమాటలు విని కొంతతడ వేమియుఁ దోఁచకుండి పిదప "నోసిస్వేచ్చాచారిణి! ముందుజరుగఁబోవు ప్రజాక్షేమమున కంతకును నీవేకదా మూలమయిన దానవు. పొమ్ము నీ విచటికి వచ్చి నాక్రోధమును హెచ్చించితివేగాని వేరులాభము లేదు" అని కోపముతో ననెను. అందు పై సంయుక్త మిగులవినయముతో "నో నాయనా ! మీరు జన్మభూమిపై ఇంచుక దృష్టిసారింపుఁడు. నిరాశ్రితురాండ్రగు ననేక స్త్రీలమానమును గాపాడుఁడు. మనమెంతో భక్తితోఁ గొలుచు విగ్రహముల నాశమునకుఁ దోడుపడకుఁడు. మన స్వాతంత్ర్యసుఖమును చెఱుపఁ బ్రయత్నించినయెడల పిదప విశేషదు:ఖము కలుగును." అని విన్నవించుకొనెను. ఇంతలో జయచంద్రుఁడు రోషారుణలోచనుఁడయి "నోరుమూసుకొని వెళ్ళు, నావద్ద నీవంటి దుష్టస్త్రీలు మాటలాడఁదగరు." అని ధిక్కరించెను. "అటులైన నాప్రార్థన యంతయు వృధవోయనా?" యని యాకాంతాలలామ రౌద్రరూపము వహించి తండ్రి వంక జూచి యిట్లనియె. "పూర్వులార్జించిన సత్కీర్తిని నాశముచేసి మీదుష్కీర్తిని శాశ్వతపఱుచుటకుఁ బూర్వమే నీకుమార్తెనయిన న న్నీ యపకీర్తి వినకుండ నేల చంపవైతివి? నీవు నాతండ్రివిగాన నేనింతగాఁ జెప్పవచ్చితిని కాని నీ యభిప్రాయ మెఱిఁగిన పిదప స్వదేశద్రోహికూతుఁ రనిపించుకొని బ్రతుకుట కంటెఁ జావు మేలని తోఁచుచున్నది."

ఆడుసింగమువలె నెదిరించి మాటాడుకూఁతున కేమియుఁ జెప్పఁ జాలక జయచంద్రుఁడు మెల్లఁగా నావలకరిగి యశ్వము నెక్కి యాతురక సైన్యములోని కేఁగెను. ఇచట సంయుక్త తండ్రి లోపలకువచ్చునని కొంతసే పెదురుచూచి యాతఁడు వచ్చుజాడగానక నిరాశతో మరలి తనపతిచెంత కేఁగెను. ఈతడవ తమవైపున నల్పసైన్యమును పగఱవైపున నమిత సైన్యమును గలదుగాన తన కపజయమే యగునని పృధివీరాజెఱిఁగి యా సంగతి సంయుక్తకుఁ దెలిపెను. ఆదంపతు లిరువురును ఇసుమంతయు ధైర్యము విడువక నొకరికొకరు తగునీతుల నుపదేశించుచు నుత్సాహయుతులై యుండిరి. వారిరువురి యాలోచనప్రకారము యుక్తమనితోఁచఁగా నామెఢిల్లీకి ప్రయాణమయ్యెను. గమనసమయమునం దామె భర్తకు నమస్కరించి "ప్రాణేశ్వరా! తమరుక్షత్రియులుగాన మీశస్త్రాస్త్రములను కాపాడుకొని యుద్ధమునకు సిద్ధమగుఁడు, క్షత్రియులు తమదేశముయొక్కయు వంశముయొక్కయు ప్రతిష్ఠలకొఱకు ప్రాణములని విడిచిన నది మృతియనంబడదు. మనుజుఁడు జన్మించినందుకు ఫలముగా సత్కృత్యములఁ జేసి సత్కీర్తినిబొంది యమరుఁడు కావలయును. తమకు జయము దొరకిన మరల మన మిరువురును సుఖమనుభవింతుము. లేనిపక్షమున నేనును తమతో స్వర్గసుఖ మనుభవించుటకు శీఘ్రముగ నేవత్తును." అని ధీరోక్తులు పలికెను. అందుకుఁ బృధివీరాజు తనభార్యను గౌఁగిలించుకొని "సతీమణీ! నాదేహములోఁ బ్రాణము లుండునంతవఱకు నేను శత్రునకు వెన్నియ్యనని దృఢముగానమ్ముము. నాసైనికులును కీర్తికాములేగాన వా రెప్పుడును పరాజయముఁ బొంది మరల తమముఖము లితరులకుఁ జూప నిశ్చయింపరని నేను నమ్మెద" నని చెప్పెను. ఆవాక్యములు విని సంయుక్త "స్వామీ ! ఢిల్లీలోని స్త్రీలు తమ్ముఁ దాము రక్షించుకొనుటకు నసమర్థురాండ్రుగాన నే నిపు డచటి కరిగి వారినందఱకును ధైర్యముచెప్పెదను. నేనిచటనే యుండిన నాకాంతలేమియుఁదోఁచక యుండెదరు. ఏది యెట్లయినను మిమ్మును గెలిచి యామ్లేచ్ఛుఁడు ఢిల్లీకిఁ వచ్చెనా వానికి రాజపూతస్త్రీ యొకతయయిన జీవముతో దొరక నేరదు." అని యామె ఢిల్లీకిఁ బోయెను. అచట నామె మిగుల నియమముతోఁ బరమేశ్వరుని తనభర్తకు విజయము నిమ్మని ప్రార్థన సేయుచుండెను. ఆమెయుపదేశము విని యానగరమునందలి యువతులందఱామెవలెనే ఢిల్లీశ్వరునకు విజయము కలుగవలయునని పరమేశ్వరు ననేకవిధముల వేడుకొనుచుండిరి.

తుద కొకదినమున నాసైన్యములు రెండును నొండొంటిఁ దాఁక నాయుభయ సైన్యములలోని వీరులును దమతమ సంగ్రామకౌశలములు మీర ఘోరంబుగాఁ బోరఁ దొడంగిరి. వా రట్లు పోరుటచే నాకాశమంతయు ధూళిగ్రమ్మి సూర్యుని మఱుఁగు పఱచెను. అంతఁ గొంతవడికి నాధూళి యడఁగి రక్త నదులుఁ బాఱఁజొచ్చెను. పీనుఁగులపెంట లనేకములు పడెను. ఇట్టి రణరంగమునందు పృధివీరాజునకు నపజయము కలిగెను. కాని యాతనిసైనికులలోఁ శత్రునకుశరణు చొచ్చినవాఁడేని యుద్ధభూమినుండి పాఱిపోయినవాఁ డేని కానరాకుండెను. పృధివీరాజుకుగూడ నాయుద్ధమునందే మడిసెనని కొందఱు చెప్పెదరు. గోరీవిజయుఁడయి పృధివీరాజును చెఱఁబట్టి గ్రుడ్లు తీసి వేసి యాతనిపాదములకు మిక్కిలి బరువు లయినలోహపుబేడీలనువేసి కారాగృహమునందుంచెననియు, నీసంగతి యంతయు విని పృధివీరాజుమంత్రియు, నతనిచరిత్ర లేఖకుఁడును, మహాకవియునగు చాందభట్టు గోరీయాస్థానమున కరిగికొన్నిదినము లచటనుండి యాతనికృపకుఁ బాత్రుఁడై పృధివీరాజును చూచుట కనుజ్ఞవడసెననియు, అట్లు సెలవంది కారాగృహమున కరిగిపృధివీరాజును పలుకరింపఁగా నాతఁడు కన్నులు లేకున్నను మాటను గుర్తించి యాభట్టును కౌగిలించుకొనెననియు, అచట వారిరువురు నొకయుక్తివలన నాతురష్కునిఁ జంప నిశ్చయించుకొని రనియు, అందుపై చాందుభట్టు గోరీయొద్దికివెళ్లి ప్రసంగరీత్యా పృధివీరాజుయొక్క బాణనైపుణ్యమును వర్ణించుచు నాతఁ డిపు డు కన్నులు లేకున్నను శబ్దముజాడపట్టి సూటిగా బాణమువేయునని చెప్పఁగా గోరీ యావిచిత్రమును గనుటకై యొకసభచేసి యాసభకు పృధివీరాజును బిలిపించియతనికి నతనివిల్లు బాణము లిచ్చి చమత్కారమే మయినఁ జూపుమని యాజ్ఞాపించెననియు, ఆమాటసూటినిబట్టి బృధివీరాజాతనిపై బాణమువేయ నాతఁడు (గోరి) మృతినొందెననియు, తదనంతరము చాందుభట్టు పృధివీరాజు లిరువురును దురకలచేఁ బడక యాసభయందే యొకరినొకరు పొడుచుకొని జీవములను విడిచిరనియు మఱికొందఱు చెప్పెదరు. పైనిజెప్పఁబడిన శరసంధానమహోత్సవ మంతయు మనదేశముననే జరిగినదని యొకరును, తురక దేశమున జరిగెనని యింకొకరును వక్కాణించెదరు. వీనిలో నేదినిజమో మనము చెప్పఁజాలము.

గోరీకి జయముకలిగి వాఁడు ఢిల్లీకి వచ్చుచున్నవాఁ డనిన వార్త వినఁగా పట్టణములోని స్త్రీలందఱితో సంయుక్త యగ్ని ప్రవేశము చేసెను. గోరీ ఢిల్లీకివచ్చి చూచు నప్పటికి గ్రామమంతట భస్మరాసులవిచ్ఛిన్నముగాఁ గానవచ్చుచుండెను.