అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/డాక్టరు ఆనందీబాయి జోశి

వికీసోర్స్ నుండి

డాక్టరు ఆనందీబాయి జోశి.

స్త్రీవిద్యా విజయ దుందుభి !!!

                 గీ. తనసిరే వేల్పు లుదధిరత్నములచేత
                     వెఱచిరే ఘోరకాకోల విషముచేత
                     విడిచిరే యత్న మమృతంబు వొడమ దనుక
                     నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు.

ఇయ్యుత్తమకాంత క్రీ. శ. 1865 వ సంవత్సరము మార్చినెల 31 వ తేదిని పూనాపట్టణమునందు జన్మించెను. ఈమె తండ్రిపేరు గణపతిరావ్ అమృతేశ్వరి జోశి. ఈయన పూర్వులార్జించిన యగ్రహారములోని ధనమువలనఁ జీవింపు చుండెను. వీరి నివాసస్థలము కళ్యాణపట్టణము. ఆయనభార్య పూనాకుఁ బుట్టినింటికి నీళ్ళాడఁబోయెను. కాన ఆనందీబాయి యచటనే జన్మించెను. మనదేశమునందలి యాచారమువలన నాఁడుబిడ్డ పుట్టుటవలనఁ దలిదండ్రులకేమి బంధువులకేమి మిగుల వ్యసనము కలుగును. అదేప్రకార మీమె జననీజనకులును విచారపడిరి! అప్పు డీబిడ్డవలనఁ దామును ప్రసిద్ధుల మగుదుమని వారికేమి తెలియును? దేశాచారప్రకారము పదునొకండు దినములు గడచినవెనుక పండ్రెండవదినము బారసాలచేసి పిల్లకు యమునయని నామకరణము చేసిరి. శిశువునకు మూడునెలలు వెళ్ళఁగానే, తల్లి కళ్యాణమునకు వెళ్లెను. య మున క్రమక్రమముగా బాలలీలను చేయుచుఁ దల్లిదండ్రుల నానందసాగరమున ముంచుచుండెను. ఈమె నాలు గైదుసంవత్సరముల వయసునందుననే మిగుల తెలివి గలదిగా నుండెను. అటుపిమ్మట నాచిన్నదియింటిలో నుండినఁ జెఱుపుపనులు చేయునని తల్లి సమీపమునం దున్న బాలికాపాఠశాల కామెను బంపఁ దొడఁగెను. కాని చిన్నతనమువలన నాచిన్నది విద్యాభ్యాసమునందుఁ జిత్తము లేనిదయి యుండెను. ఆమె తల్లి బిడ్డలను గొడ్డువలె బాదు మూర్ఖస్త్రీలలోనిది యగుట వలన నామె చిన్నతనమున తల్లి చనువులేక యెప్పుడును శిక్షకుఁ బాత్రురా లగుచుండెను. ఆమెతల్లి తల్లియు గణపతిరావుగారి యింటనే యుండెను. కాన యమున నెవ్వరేమనినను నాముసలమ్మవారితోఁ దగవు లాడుచుండెను. యమున చిన్న తనమునుండియు నేదో యొకపనిలేక కూర్చుండు స్వభావము గలదిగాక సదా యేదో యొకపనిని చేయుచునే యుండెను. యమున యేడుసంవత్సరములది కాఁగానే తల్లిదండ్రుల కామె వివాహమును గుఱించి చింత కలిగెను. వా రనేకస్థలముల వెదకి యనుకూలుఁ డగు నరుని చింతించునెడ నొకగృహస్థుఁడు ఠాణా యనుగ్రామమునుండి కళ్యాణమునకు వచ్చెను. ఆయనతో గణపతిరావు కొమార్తె వివాహ చర్చ తేఁగా నాయన "ఠాణాలోని పోస్టుమాస్టరుగారిభార్య నివర్తించెను; మీరా యనకడకు వెళ్లివిచారింపుఁ డ"ని చెప్పెను.

ఆయన చెప్పినవాఁడు గోపాలవినాయక జోశి సంగమ నేర్‌కర్‌గారు. ఈయన తనచిన్నతనములోఁ దనయక్కయుఁదానును జదువుకొను కాలములో స్త్రీలబుద్ధి పురుషులబుద్ధితో సమానముగా నుండునని తెలిసికొనెను. గోపాలరావుగారికిఁ జిన్న తనముననే ప్రధమవివాహమాయెను. ఆయన తనభార్యకు విశేషవిద్యఁ గఱపి స్త్రీవిద్యవలనిలాభములను ప్రపంచమున కగుపఱచవలెనని దృఢముగా నిశ్చయించుకొనినవాఁడు. అందు వలన నాతఁ డనేకప్రయత్నములచేఁ దనసతికి విద్యనేర్పఁ దొడఁగెను. కాని యాచిన్నది యత్త, యాఁడుబిడ్డల కోడంట్రికముచే నలుగుచుండినందున విశేషవిద్యాభ్యాసముచేయ లేకుండెను. ఇట్లుండగా నాచిన్నదానికిఁ బదుమూడవయేట నొక కొమారుఁడు కలిగి తల్లిని స్వర్గమునకంపెను. ఆచిన్నవానిపేరుకృష్ణా; ఆతఁడిప్పటివరకును సుఖముగానే యున్నాఁడు. ప్రథమభార్యచనిపోయిన పిదప గోపాలరావు నుదాసీనుడయి రెండవవివాహము జేసికొనను అని నిశ్చయించుకొనెను. ప్రధమపత్ని యున్న కాలములోనే యతనికి మొదటపూనాలోనే పోస్టాఫీసులో నొకచిన్న జీతము గలపని దొరకి పిదప స్వతంత్రముగా ఠాణాలోని పోస్టుమాస్టరు పని దొరకెను. ఆయన తనప్రధమపత్నికిఁ గలిగిన కోడంట్రికముంగని చిన్నతనముననే వివాహములుచేసి పిల్లల నతిక్రూరముగాఁ జూచెడియత్తలను మిగుల దూషింపు చుండెను. ఇవన్నియు విచారించి యాయన ద్వితీయ వివాహము చేసికొనుటకు నిష్టము లేనివాఁడయి యుండెను. కాని గణపతిరావు ఆయన వద్దికి వచ్చి తనకొమార్తెను చేసికొనవలసినదని యడుగఁగా నాతఁడు తానొకస్త్రీని పూర్ణవిద్యావతినిఁ జేసి ప్రపంచమునకు నుదాహరణము చూపఁ దలఁచినవాఁడగుటచే, 'నాభార్యకు నే నెట్టివిద్య గఱపినను మీ రడ్డుపడకుండెడియెడలనే వివాహమున కొప్పుకొనెద" ననెను. గణపతిరావుగా రందున కొడంబడఁగా గొన్ని దినములకు వివాహముజరిగెను. దేశాచారప్రకారము వివాహానంతరము యమునాబాయికి 'ఆనందీబాయి' యని యత్తవారు పేరుబెట్టిరి. పెండ్లియైనపిదప గణపతిరావుగారి యనుమతిప్రకారము, గోపాలరావు నిత్యము సాయంతనము కళ్యాణపట్టణమునకు వచ్చుచుండెను. ఆనందీబాయి కొంచెము చదువుకున్నదని తెలిసి గోపాలరావు మరాఠి పుస్తకములను కొన్ని తెచ్చి ముత్తవచేత నామెకిప్పించి చదువునట్టు చేయుచుండెను. రెండవ పెండ్లివాఁ డగుటచే పిల్లదానినిత్వరలో భర్తగారితో మాటలాడఁ బురికొల్పసాగిరి. కాని ఆనందీబాయి కాకాలము భర్తయనిన నొకవ్యాఘ్రమువలెఁ దోఁచుటచే నామెమిగుల భయపడుచుండెను. గోపాలరావామెనెంతమాత్రమును భయపెట్టక బుజ్జగించియే చదువు మొదలయినవి చెప్పుచుండెను.

గోపాలరావు ఆనందబాయికి విద్యనేర్పుట ఆయనమామగారి కెంతమాత్రమును సమాధానములేదు. ఆయనతానందు కొడం బడినవాఁ డగుటవలన నల్లునితో నేమియు ననజాలక యితరులచే స్త్రీవిద్యవలనం గలుగు నష్టములు చెప్పించి మాన్ప జూచెను, కాని గోపాలరావు వారికిఁ దగిన బ్రత్యుత్తరము చెప్పిపంపెను. మామగారియూరికి సమీపమునం దుండిన యెడల భార్యవిద్య సాగదని గోపాలరావు అల్లీబాగనుగ్రామమునకు మార్చుకొనెను. అచటికి ఆనందీబాయితోడ నామెముత్తవ పోయియుండెను. కాన పిల్ల కేవిధమయినభయము లేకయుండెను. అటుపిమ్మట గోపాలరా వామెకు విద్యవలని లాభముల నెఱిఁగింపఁగా నామెమిగుల శ్రద్ధతో ప్రతిదినముతప్పక పాఠములు చదువుచుండెను. ఆమె చుఱుకుఁదనమును జూచినకొలఁదిని గోపాలరావునకు మఱింత యుత్సాహము కలిగియాతఁ డామె తో ననేకసంగతులను ముచ్చటింపుచుండెను. అందువలననే ఆనందీబాయికి త్వరగా విద్యాసక్తిగలిగెను. పెండ్లియైనపిదప రెండుసంవత్సరములలో ఆనందీబాయికి మహారాష్ట్రభాష చక్కఁగాఁ జదువుటకును, వ్రాయుటకును వచ్చెను. అంతలో నామెకాభాషయందలి వ్యాకరణము, భూగోళము ప్రకృతిశాస్త్రము, గణితశాస్త్రము మొదలయినవి గోపాలరావుగారు చక్కఁగా నేర్పిరి. అల్లీ బాగునందుండుకాలమున ఆనందీబాయి ఋతుమతియైనందున భార్యా భర్తల నొకటి చేసిరి. వెంటనే ఆనందీబాయి గర్భవతియైనందున నామె కళ్యాణమునకుఁ బోయెను. అచట నామెకు కొమారుడు కలిగి పదియవదిన సంబుననే చనిపోయెను. కాన ఆనందీబాయికిఁ జిన్నతనముననె పుత్రదు:ఖము కలిగెను. అందువలనఁ గొన్ని దినములవఱకును ఆమె విద్యాభ్యాసమునకు భంగము గలిగెను. కాని యటుపిమ్మట మరల నామె చదువు చక్కఁగా సాగుచుండెను. కొన్నిదినములలో నామెకుఁ దన మనోగతము బాగుగావ్రాసి తెలుపునంతటి ప్రజ్ఞ గలిగెను. అల్లీబాగులోని లోకు లానందీబాయికి వచ్చిన విద్యనుగని యోర్వలేక గోపాలరావు ననేకకష్టముల పెట్టుచుండిరి ! కాన నచటనుండుట కిష్టములేక, కోలాపురమునందు స్త్రీవిద్య కనుకూలురగువా రున్నందున బహుప్రయత్నముతో గోపాలరావుగా రచటికి మార్చుకొనిరి. కోలాపురములో బాలికాపాఠశాల వీరింటికి దూరమగుటచే ఆనందీబాయిని నొక్క ర్తనంతదూరము కాలినడకతోఁ బంప వీలులేక యుండెను. పాఠశాలలో నుపాధ్యాయినిగా నుండిన మిస్ మాయసీ గారి యిల్లు వీరియింటికి సమీపమునందుండెను. ఆమె బహు మంచిదని విని గోపాలరావుగా రామెతోడ మాటాడ నరిగెను. ఆయన ప్రసంగవశమున "నాభార్యను మీబండిలోఁ గూర్చుండఁ బెట్టుకొని వెళ్లెదరా" యని యడుగఁగా నామె కొంత యోచించి మంచిదనియెను, అందుపై ఆనందీబాయి కొన్నిదినము లచటి పాఠశాల కరుగుచుండెను. కాని యటు పిమ్మట మాయసీ తనబండిలో స్థల మియ్యనందున నామె పాఠశాల కరుగుట మానుకొనవలసిన దాయెను.

కోలాపురమున నీదంపతులు పాద్రీల (క్రైస్తవధర్మగురువుల) యిండ్ల కరుగుచుండిరి. పాద్రీయాఁడువారు ఆనందీబాయికి నింగ్లీషు రెండు మూడుపుస్తకములవఱకును నేర్పిరి. ఆనందీబాయి యల్పవయస్కు రాలయినను వారు చేయుమతబోధనుగ్రహింపక కేవల నీతివాక్యములనే గ్రహింపుచుండెను. వీరి వలననే యీదంపతుల కమేరికాలోని సంగతులనేకములు తెలిసెను. కాన నమేరికాలోని కరిగి విద్యనభ్యసింపవలయునని ఆనందీబాయి కప్పటినుండి యిచ్చగలిగెను.

1879 వ సంవత్సరప్రారంభమున గోపాలరావుగారిని బొంబాయికి మార్చిరి. అచట నుండుకాలములో ఆనందీబాయి కొంతవఱ కింగ్లీషును సంస్కృతమును నేర్చుకొనెను. కాని యచటను లోకు లామె విద్యాభ్యాసమున కనేక విఘ్నములు తెచ్చుచుండిరి. ఇట్లుండఁగా 1880 వ సంవత్సరమునచటినుండి భూజయను గ్రామమునకు మార్చినందున నాదంపతు లచటి కరిగిరి. బొంబాయినుండి భూజకుఁ బోవునపుడు ఆనందీబాయి ముత్తవ యామెతోడ రానందున నింటిపని యంతయు నామెయే చేయవలసియుండెను. ఇంటిపనినంతను చేసి యానందీబాయి భర్తకడ నింగ్లీషు సహితము నేర్చుకొనెను. అచటనే యామె యింగ్లీషు మాటాడుట చక్కఁగా నేర్చుకొనెను.

గోపాలరావుగారికి భార్యను విశేష విద్యావతినిఁ జేయవలెనని యుండుట నొకవార్తాపత్రికలోనఁజదివి అమేరికాలోని న్యూయార్కుపట్టణవాసినియగు మిసెస్ బి. ఎఫ్. కార్పెంటర్ అను నామె ఆనందీబాయికి సహాయముచేయఁదలఁచి యామె కొకయుత్తరమువ్రాసెను. ఈమెయే ఆనందీబాయి కనేకవిధములసహాయముచేసి యామెను కూఁతురివలెఁ జూచుచుండెను. కాన ఆనందీబాయియు నీమెయందధికప్రేమ గలదియయి యీమెను పిన్ని యని పిలుచుచుండెను. ఈమెకు ఆనందీబాయి వ్రాసినయుత్తరములవలన మనదేశమునందలి స్త్రీలకుఁ గల పరతంత్రయు, దానిని వదలించుటకై ఆనందీబాయికిఁ గలయభిప్రాయమును దెలియుచున్నవి. స్త్రీలకు విశేష విద్యగఱపినం గాని స్వహితము తెలియదని యామెమతము. ఇదియంతయు నామె స్వానుభావము వలననే తెలిసికొనెను. ఇట్లుత్తరప్రత్యుత్తరములవలన నాయిరువురకును సఖ్య మధికమయ్యెను.

తదనంతరము గోపాలరావుగారిని కలకత్తాకు మార్చిరి. అచ్చటనుండు కాలములో పోస్టుఆఫీసులో 30 రూపాయలవేతనముగల యుద్యోగము ఆనందీబాయికొఱకు సిద్ధమయ్యెను. కాని యుద్యోగములోఁబ్రవేశించి స్వతంత్రతను పోఁగొట్టుకొనుట కిష్టములేక యామె దానిని స్వీకరించకుండెను. తదనంతర మామెకు నమేరికాలో వైద్యవిద్య నభ్యసించుకోరిక యధికమయ్యెను.

కలకత్తానుండి శ్రీరామపురమనుస్థలమునకు మార్చినందున నాదంపతు లచటికరిగిరి. అచటి కరిగినపిదపఁ గొన్నిదినములు సెలవుతీసికొని వారు సమీపమునందుఁగల జయపూర్, ఆగ్రా, గ్వాలియర్, లఖనొ, కాన్‌పూర్, డిల్లి, ప్రయాగ, కాశీ మొదలగు ప్రసిద్ధపట్టణములను జూడనరిగిరి. అందువలన ఆనందీబాయికిఁగొంతవరకు ప్రవాసస్థితి తెలిసెను. వారుమరలి శ్రీరామపురమునకు వచ్చినకొద్దిదినములలోనే రెండు సంవత్సరముల సెలవుతీసికొని అమేరికాదేశమున కరుగ నిశ్చయించిరి. కాని యింతలో నీకు సెలవియ్యఁజాలమని పైనుండి యుత్తరువు వచ్చెను. అందువలన ఆనందీబాయి నొకర్తనే యమేరికాకుఁ బంపఁదలఁచి గోపాలరావుగా రామెతో నొకదిన మిట్లు ప్రసంగించిరి : _

గోపాలరావు (చింతతో) నీఒంటిరిగానే అమేరికాకు వెళ్ళెదవా? నాకిప్పుడు సెలవుదొరకదు. నీకిచటనుండిన విద్యాభ్యాసము కానేరదు. కాన నొంటరిగానైన నరుగుట యావశ్యకము. మనమిరవురము కలసి వెళ్ళవలెననినచో నింకను రెండుసంవత్సరముల వ్యవధిపట్టును. ఇంతలో నీచదు వచటఁ జాలవఱకగును.

ఆనందీబాయి ఏమియు ననక భర్తవంకచూచి మీరేమనెదరని యడిగినటుల నగుపడెను, దానింగని గోపాలరావు, నేఁటివఱకును బ్రాహ్మణస్త్రీ పరదేశమున కరిగి విద్యనభ్యసించిన యుదాహరణ మెందునుగానరాదు. కాన నీవు వెళ్ళి విద్యనభ్యసించి యుదాహరణీయవగుము. స్త్రీలుసామర్థ్యహీన లన్న వాక్యమును నీవబద్ధము చేయుము. మననడవడిని విడువక అమేరికావారికి మన నడవడిని నేర్పుము, ప్రస్తుతము సంస్కరణము కావలయు ననువారు పెక్కెండ్రు పురుషులుకలరు, కాని వారిచేతఁ గొంచమైనను సంస్కరణమగుటలేదు. నీవు స్త్రీవైకొంచెము సంస్కరణము చేసి చూపినను మిగుల నుపయోగకరముగా నుండును.

అందు కానందీబాయి సమ్మతించి యంతదూరదేశ ప్రయాణమునకు సాహసించెను ! ఆమెతన కెట్టికష్టములువచ్చినను వెనుకఁదీయక స్వదేశసోదరీమణుల కొకయుదాహరణము చూపి వారికి మేలుచేయఁ దలఁచెను!!

ఇట్లు వారు కృతనిశ్చయులయి ఆనందీబాయి కొఱకమేరికాలో ననుకూలమగు బట్టలనుకుట్టించి, సిద్ధపఱుచుచుండిరి. ఆనందీబాయి పరదేశపువస్త్రములు ధరియింపనని నిశ్చయించుకొని మనదేశమునందలి ముతక బనాతుగుడ్డలతోనే దుస్తులను కుట్టించుకొనెను. ఇట్టిదిగదా స్వదేశాభిమానము ! ఈమె అమేరికా కరుగునని విని యనేకు లనేకాక్షేపణలు చేసిరి. కాన వారి కందఱకును సమాధానకరముగా ఆనందీబాయి యొకపాఠశాలా మందిరమున సభచేసి గంటసేపు హూణభాషయందు నస్ఖలితముగా నుపన్యసించెను. అందువలననే యామెకు నింగ్లీషునందుఁగల ప్రజ్ఞయు, నామెయొక్క యప్రతిమానక్తృత్వశక్తియు వెల్లడి యగుచున్నవి. ఆ యుప న్యాస మత్యంత శ్రవణీయము. కాన జనానాపత్రికోక్తముగా నిచ్చట నుదాహరించుచున్నాను.

"నాయమేరికాదేశ యాత్రనుగుఱించి వందలకొలది ప్రశ్నము నన్న నేకు లడుగుచున్నారు. కావున నే నిప్పుడు అవకాశముఁ గలుగఁజేసికొని వానిలోఁ గొన్నిటికిఁ బ్రత్యుత్తరములం జెప్పఁ దలంచితిని, అవి యెవ్వనఁగా : _

1. నే నమేరికాదేశ మేల వెళ్ళవలెను?

2. హిందూదేశమునందుఁ గృషిచేయుటకు నాకు సాధనములు లేవా?

3. నే నొంటరిగా నేల వెళ్ళవలెను?

4. నే నీదేశమునకు తిరిగివచ్చినప్పుడు జాతిలోనివారి నుండి నాకు బహిష్కారము గలుగదా?

5. ఏదేని యాపదసంభవించినయెడల నే నేమిచేయ వలెను?

6. స్త్రీలలో నెవరును జేయని పనిని నేనెందులకుఁ జేయవలెను? అనునవి.

1 మొదటిప్రశ్నకుత్తరము : _ నేనువైద్యము నేర్చుకొనఁ దలఁచి యమేరికాదేశమునకు వెళ్ల నిశ్చయించితిని. ఈహిందూదేశమునందు స్త్రీలకు జికిత్సఁ జేయఁదగిన సాధనకలాపము లేని కారణమువలనఁ గలిగెడి బాధలను ఇప్పుడిక్కడకు దయచేసిన నారీమణులు బాగుగాఁదెలిసికొని యున్నారు. ప్రకృతిశాస్త్రములను, స్త్రీవిద్యను వెలయింపఁ జేయ నీదేశమున వెలయుచున్న సమాజము లెవ్వియు మనదేశపు యువతుల నేరినిఁగాని నాగరికతచేఁ ప్రతిష్ఠ గాంచిన ఖండాంతర ముల కంపించి వైద్యశాస్త్ర ప్రవీణలను గావించి, వారిచే నిచ్చటం బ్రమదల కావైద్యశాస్త్రమును గఱపు కళాశాలలను స్థాపింపఁ దలంపమికి నేనత్యద్భుతము నొందుచున్నదానను. తనకుఁ గలలోపముల నెల్ల వెల్లడిసేయక తన్ని వారణార్థమై యర్థింపకయుపేక్షించు నిందాస్పదమైనదియు ఈహిందూదేశమునకంటె మఱియొక్కటి యేదియులేదు. ఈహిందూదేశమంతట స్త్రీవైద్యులులేని లోపము కష్టముగనున్నధి. యూరపుదేశపునారులును, హిందూసుందరులును, అవసరము తటస్థించినప్పుడు పరపురుషులకు తమ దేహస్థితిని వివరించి వారిచేఁ జికిత్సఁ జేయించుకొనుటకు సహజముగా నిష్టపడకయున్నారు.. యూరపు, అమేరికాదేశములనుండి యిక్కడకు కొందఱు స్త్రీవైద్యులు వచ్చుచున్నారు గాని, వారిభాషయు, నాచారమర్యాదలును మనవారికిఁ గ్రొత్తలగుటచే, వారుమన స్త్రీల కంతగా నుపయోగపడక యున్నారు. తమదేశమందును దమవారియెడలను నైసర్గిక మయినప్రేమ గల హిందూసుందరులు పరదేశ యువతులతోఁ గలిసి మెలఁగలేరు. కావున నా వలన నేసహాయ లాభమును బడయఁజాలక యున్నారు. ఈ హిందూదేశమున స్వదేశస్త్రీవైద్యుల యక్కఱ మిక్కిలిగా నున్నట్లు నాకుఁ దోఁచుచున్నది.

2. ఇఁక నీహిందూదేశమునం దందులకుఁ దగినసాధనములు లేవా యను రెండవ ప్రశ్నమున కుత్తరము : _ లేవని నిష్కర్షగా మనవి చేయుచున్నాను. అనఁగా సాధనములు బొత్తిగా లేవని నామతము కాదు. కాని యున్నసాధనములు సులభసాధ్యములు గావని నాయభిప్రాయము. చెన్నపురియం దు నొక సర్వకళాశాలయు నన్ని రాజధానులలోను మంత్రసాని తనము నేర్పు తరగతులును నుండుట సత్యమే. అయిన నందలి బోధకులు ప్రాచీనాచారప్రవిష్టు లగుటచేతను, కొంతవఱ కసహిష్ణు లగుటవలనను అచ్చట నొసఁగఁబడుచున్న విద్య యసంపూర్ణ మయినదిగాను లోపములతోఁ గూడినదిగాను నున్నది. ఇట్లనుట నే నాబోధకుల తప్పుల నెంచుటకుఁ గాదు సుఁడీ అది పురుషుల స్వభావమని మనవిచేసితిని. వీరికి మాఱుగా నాస్థానములను స్త్రీలలంకరించువఱ కిట్టి యిబ్బందులకు మన మోర్చుకొనవలసి యున్నది.

నేను క్రైస్తవురాలను గాను; బ్రాహ్మమతావలంబినిని గాను. కాఁబట్టి హిందూమతాభిమానము గలిగి తద్ధర్మముల ననుష్ఠింపుచు నీదేశమున నెందయినను పాఠశాలకుఁ బోయి విద్య గఱచుట నాఁబోటి బోఁటికి దుష్కరము. ఇంగ్లీషువారి యుడుపులఁ దొడిగికొని నడయాడుమతాంతరు లయినను ఇచటిప్రజలు నన్నుఁ జూచిన ట్టూరకయగఁదిగఁ జూడరు. నగరులలోను, వెలుపలను, నావంటి హిందూయువతులకుఁ గలుగుచున్న దురాక్షేపణలు, దుర్వదంతులు స్వదేశీయులైన క్రైస్తవస్త్రీలకు లేశమును గలుగుటలేదు. పొగబండిలోఁగాని, నీధుల వెంటగాని నేనొంటరిగాఁ బోవునపుడెల్లప్రజలు కొందఱు నన్నుఁ జేరి నామొగమువంక నట్టే చూచుచు కొంటెప్రశ్నలచే నన్నలయింపుచుందురు. ఈపొడిమాటలకంటె కొన్ని యుదాహరణములవలన నిజము మీమనసులకు నాటఁ జెప్పెదను చిత్తగింపుఁడు. కొన్ని సంవత్సరములక్రిందట, నేను బొంబాయినగరమున నుండఁగా పాఠశాలకుఁ బోవుచుంటిని. చేతపుస్తకములం బట్టుకొని నేను బడికిఁ బోవుచుండునపుడు కొందరు కిటికీలగుండ నన్ను చూచువారును మఱికొందఱుబండ్లెక్కిపోవుచు, నన్నుపరికించువారును, వీధులలో ద్రిమ్మరుచుండ నిఁక కొందఱు పెద్దపెట్టున నవ్వుచు "ఇదేమివింత ! కాళ్ళకు మేజోళ్లను బూట్సులను దొడగికొని పాఠశాల కేగునీగరిత యెవ్వతె ! ఇందుమూలమున కలి యప్పుడే ప్రజలమనసుల నావహించిన జాడలు పొడగట్టుచున్నవి గదా!" యనినాకు వినఁబడునట్టుగా కోలాహలముగాఁ బలుకువారుగనుండిరి.

ఓమానినీమణులారా? అట్టిప్రశ్నలను మి మ్మడిగినప్పుడు మీమన సెట్టిసంతాపమును బొందెడినో మీరేసులభముగా నూహించి తెలిసికొనఁ గలరు.

ఒకప్పుడు నేను కొంతకాలము పాఠశాలలో నుండవలసివచ్చి భోజనము నిమిత్తము దినమునకు రెండుసారులు బంధువులయింటికిఁ బోవలసివచ్చెను. నేనపుడట్లుపోవుచు వచ్చుచున్నప్పుడెల్ల వీధివెంట నేగువారు నాచుట్టును చేరికొందఱు ఎగతాళిచేయ నారంభించిరి. కొందఱు కడుపుబ్బనవ్వఁ జొచ్చిరి. తక్కినగృహస్థులుడాంబికముగా తమతమపంచలలో గూర్చుండి నన్నుఁ గని వికృతాలాపము లాడుచునాపైని రాళ్లు రువ్వుట కెంతయు లజ్జిం పరయిరి. ఇఁక నంగడివాండ్రు, బేరగాండ్రన్ననో నన్ను వెక్కిరింపుచు అసహ్యకర మయినసైఁగలం జేయసాగిరి. అట్టిసమయములో నాస్థితి యెట్లుండెనో యిల్లు చేరుకొనుటకు నామన సెట్లు త్వరపెట్టెనో దానినూహించి మీరే తెలిసికొనుఁడు.

బొంబాయి నగరవాస్తవ్యుల తీరిట్లుండఁగా, బంగాళీ వారిరీతి యిఁకఁజెప్పుటకే శక్యము గాకున్నది. ఇది యెల్ల కడుశోచనీయము. గాలిపట్టుల కెప్పుడయిన నేను వ్యాయామముకొఱకు పోయినప్పుడు ఇంగ్లీషువారయిన న న్నెప్పుడు కన్నెత్తి యంత నిబ్బరముగాఁ జూడరయిరి. కాని బంగాళావారు తమదంభము నంతను వెల్లడిచేసి హాస్యాస్పదముగావించు కొన నన్నుఁ గని "నీవెవతెవు? నీపేరేమి? నీస్థలమేది? నీవెందుల కేగెదవు?" అని యపరిచితు లడుగఁగూడని ప్రశ్నలనడిగి యాగడ మొనర్చిరి. శ్రీరామపురములో విద్యావంతులని యెన్నికగన్న కొందఱు స్వదేశక్రైస్తవులు నేను వివాహితనో, వితంతువు నోదుర్వర్తన గలదాననో, కులభ్రష్టనో యని శంకింపుచుండిరి. ప్రియులయిన యోసభాజనులారా! యిట్టి యవినయప్రచారములు స్వదేశక్రైస్తవులు చేయఁగూడునా? ఎంతమాత్రము చేయఁగూడదు. వీనిని మీకిట్లు విన్నవించుట మీరిట్టిలోపములను సవరణచేయఁ దివిరెదరనియు, మీలోని కష్టముల నెన్న డెఱుఁగని వారు వీనినెల్ల వినినపిమ్మట నమేరికాదేశమునకు నేను పోవయత్నించుట కేవలము వేడుకకయి గాదని యెంచెదరనియేకాని మరియొకతలంపునఁ గాదు!

3. నేనొంటరిగా నేల విదేశమునకుఁ బోవలెనను మూడవప్రశ్నకుత్తరమేమనఁగా : _ తొలుత నేను నాపెనిమిటియును గలిసి వెళ్ళుటకే యుద్దేశించితిమి. పిదపస్థితిగతులను బట్టి యాతలంపు మానుకొనవలసివచ్చెను. మాయొద్దధనమా చాలినంత లేదు. ఈహేతువొక్కటియేకాక యింతకంటెముఖ్యములయినవి యందఱి నొప్పింపదగినవి మఱికొన్నిగలవు. అవి యేమనఁగా నాభర్తగారికి వయోవృద్ధయగు జననియు, పసివాండ్రుగనున్న తోఁబుట్టువులును తమ్ములునుగలరు. వారందఱికి సంరక్షకుఁడు నాభర్తగారే యగుటచేతనాయననాతో గూడవచ్చిరేని, వారుదిక్కుమాలిన వారలయి వారి బ్రతుకు భగ్నమయి, వారుతీరనిదారిద్ర్యబాధలకు లోనగుదురు. నాయొక్కతకొఱకు పెక్కండ్రను మలమల మాడునట్లు చేయుట యెంత యమానుషకృత్యము ! కాఁబట్టి నేనొంటరిగా నేగ నిశ్చయించితిని.

4. నే నిండియాకు (హిందూదేశమునకు) మరలవచ్చినప్పుడు నాకు బహిష్కారము గలుగకయుండునా యనుదానికి సమాధానము : _ అట్టిభయమువలన నేనుచలించెదననితలంతురా? నేనందుకు నావంతయినను వెఱవను. ఇక్కడనేవిధముగా నుంటినొ యక్కడఁగూడ నాతీరుననేయుండనిశ్చయించుకొనియుండఁగా నాకు బహిష్కారమేల కలుగును. నాయాచారవ్యవహారములయందుఁ గాని, ఆహారవిహారములలోఁగాని, వేషభాషలయందు గాని మార్పుగావింప నే నెంతయుఁ దలంపలేదు. హిందూయువతిగ నేపోయి, మరల హిందూమానసతిగ నే వచ్చి యిక్కడ హిందూ సుందరులలోనే గలసియుండ నిశ్చయించితిని. ఇప్పుడును దానికంటె భిన్నము గానుండక నాపూర్వు లెట్లు సామాన్యముగా జీవించిరోనేనునట్లే యుండఁగలదానను. ఇప్పగిది నేను బ్రవర్తించునప్పుడు అస్మద్దేశీయులు నన్ను బహిష్కరింపఁ జూతురేని, అప్పు డేల, ఆపని యిప్పుడే చేయరాదా? అందుకువారికి సర్వస్వాతంత్ర్యము గలిగియే యున్నది. మామహారాష్ట్ర కుటుంబ మొక్కటియైనను లేని యీ బంగాళాదేశమందలి యీస్థలమున నే నిప్పుడు వాసము చేయుచుంటినిగదా! నే నియ్యెడ నాదేశాచారధర్మముల ననుష్ఠించి ప్రవర్తింపుచుంటినో లేదో యెవ్వ రెఱుఁగుదురు? కాఁబట్టి యెన్నఁడును సంభవింపఁగూడ నట్టియు, సంభవించినప్పుడు మానుషప్రయత్నములకు లోఁబడనట్టియు వానినిగుఱించి చింతింపక యుండుటయే యుత్తమము.

5. నాకేది యయిన నిక్కట్టు తటస్థించిన నే నేమిచేయుదు ననెడి ప్రశ్నకు సదుత్తర మేమన్న : _ కొందఱు మనుష్యులు ప్రపంచములోఁ గనఁబడుదానికంటె నతిభయంకరముగా గ్రంథములలోఁ గనఁబడు దురవస్థలను, దుర్దశలను నుదాహరణముగాఁ జూపి భయము నతిశయింపఁ జేయఁ బ్రయత్నింతురు ; కాని యా యాపద లెంత భయంకరములో యంత యరుదుగా సంభవించునట్టుగ విధింపఁబడి యున్నవి. పురుషులుగాని, స్త్రీలుగాని యెద్దియేని యొకకార్యముచేయఁ బూనినప్పుడు తొలుత మేలెంచెదరుగాని కీడెప్పుడు నెంచరు. ఒకానొకప్పుడు తప్పక కీడులు మూఁడి మగవారినిఁ గాని యాఁడువారినిఁగాని భూమిలోని కడఁగ ద్రొక్కినయెడ నింకప్పుడు వృధాచర్చలతోఁ బనియేమి ? అవి వచ్చినప్పు డనుభవించి తీరవలసినదే. కాని యాయాపదలు రాఁబోవు నప్పు డుండెడిబాధకంటె వాని ననుభవించునపు డుండెడిబాధ యల్పమనుట జగద్విదితమే. ఏవిధముననయినను ఈలోకమున శాశ్వ తమయినసుఖమును బడయఁగలమా యనుశంకను నివృత్తిచేసికొనుట కీప్రపంచము మన కవకాశ మెన్నఁడును గలుగఁజేయనేరదు. కాని పయికగుపడుచున్న సాధనముల యంతరములకుఁ దగిన సౌఖ్యమును మనుజు లెల్లప్పుడును బొందుచుండుట లేదనిమాత్రము మనము చెప్పవచ్చును. అసౌఖ్య మనునది కొందఱు చేరి తమలోతాము విభాగించుకొనఁ దగినపదార్థము గాదు. అది మనమనసునుబట్టి యుండును. దురవస్థలలో కెల్ల మరణమే గొప్పదని యెంచెద మంటిమా కొందఱు దానిరాక కేల సంతోషింపరు? మఱికొంద ఱేల దు:ఖింతురు? వేయేల? మృత్యువును, దుర్దశయును, మంచివారికిని, పున్యాత్ములకును, పాపాత్ములకును, భాగ్యవంతులకును, దరిద్రులకును, దేశద్రిమ్మరులకును, గృహస్థులకును సమానముగనే వచ్చుచుండును. ఆపత్ కాలమున నందఱు వివశులగుటయు, కక్ష్యావేశముచే నెవ్వరు ప్రతిభావంతులు గాకుండుటయును సుప్రసిద్ధమే. రానున్న విపత్తు నెంతటి మనుజుఁడైన నడ్డగింపలేఁడు. ఆపదలును, నెల్లప్పుడు మనల ననుసరించియే యున్నవి. కాఁబట్టి వానిరాకకు ప్రతిమనుష్యుఁడును నిరీక్షించియే యున్నాఁడు. ఏదియయిన నొక యుత్కృష్టమైన పనియొక్కఫలిత మనుకూలముగానుండెనా, దానిని పూనికతో నెరవేర్చినవారి పరిశ్రమమును ఘనముగా ప్రశంసింతుము. లేక యది ప్రతికూలముగా పరిసమాప్తి నొందెనా తత్కార్యవాహుల యనజ్ఞనను నిందింతుము. ఈతీరుననే యదృష్టము మాఱి, ఫలము విఫలమయినచో లోక మది యవివేక మని చాటుటకు సిద్ధమయి యుండును. ఇఁక కొందఱు కూపస్థమండూకములవలె నింటి నంటి పెట్టుకొనువారే సుఖభోగులందరు. కాని, వారికి సుఖభోగ మేలాగునఁ గలుగునో తెలియదు. అదికోరినప్పుడనుభవింపఁ దగినట్టు సిద్ధముగా నమర్పఁబడి యున్న పదార్థము కాదుగదా? కొందఱికి నూతనప్రియత్వ మెంత యధికముగా నుండు ననఁగా సౌఖ్యమయినను నెడతెగనిదిగానుండిన దానియందు రుచిలేదని వారప్పుడప్పుడు కష్టములను గోరుచుందురు. విదేశమున కేఁగుట చెడుపనిగాదు. కొన్నియంశములనుబట్టి యొక్కచో నివసించియున్న దానికంటె మేలయినపని యనిచెప్పవచ్చును. దేశాటనమున నాదేశముల యొక్కయు, ప్రజలయొక్కయు స్థితిగతులు బాగుగ మనసునఁబట్టగలవు. అట్టివానిఁ దెలిసికొనుటయందు విముఖులమయి యుండఁగూడదు. అవజ్ఞతను మనము బుద్ధి పూర్వకముగా నవలంబించుట యనునది గొప్పదోషములలో నొకటి. విదేశయాత్రలం గావించుటచే మనకు బుద్ధివికాసమును జ్ఞానాభివృద్ధియుఁ గలుగును. ఎల్లవారును యుక్తమయిన దానిని జేయవలసినదే. ప్రతిమనుష్యుఁడు తనసహజీవులకుఁ జేతనయినంత యుపకారమునకుఁ బ్రత్యుపకారము చేసిఋణవిముక్తతనుబొందవలసినది. పరసీమలో మనకుదిక్కెవ్వరని యడిగెదరా? ఏతద్విషయమయి గోల్డుస్మిత్తను ఇంగ్లీషుకవి చేసిన మహోపదేశము మనము గమనింతము. అది యెద్ది యనఁగా "అంధులబుద్ధి విశేషముననుసరింప నేర్చుకొనుము. ఏలయనఁగా వారెన్నఁడు తమచేతి యూతఁకోలతో భూమినిదడవి తెలిసికొనకుండనడుగు బెట్టరు." ఆతీరున నే నేను సర్వశక్తిసంపన్నుఁడయిన నాపరమపితను నాకూఁతకోలగాఁ జేసికొనియెదను. ఆయన యే నామార్గమును బరిశీలించి నన్ను ముందుకునడిపించుకొనిపోవును. దానికంటెను మహోత్తర మయినచేతియూత నాకన్య మేమియుఁ గనఁబడదు.

కొట్టకొనకు నాజాతివా రెవ్వరును జేయనిపని నేనేల చేయవలెను? అనుదానికి నే విన్న వించున దేమనఁగా మన మొక్క రొక్కరము సంఘమునకుఁ జెల్లింపవలసినఋణములు పెక్కులు గలవు. వీరీపనిచేసిన ఋణవిముక్తత కలుగునని వేర్వేరుగ వక్కాణించుట దుస్తరము. ఒక్కకార్యముచే నొక్కరి కెప్పుడు మేలు గలుగఁగలదో యందువలన నందఱికి మేలు కలుగుననియే యెంచవలసినది. సర్వత్రజనులందఱికి శ్రేయస్కర మని చెప్పఁదగినపనిని జేయుటకు మనలో నెల్లవారును ప్రయత్నపడవలసినది. మనుస్మృతియందు "చేయఁదగిన ధర్మమును జేయక యుపేక్షించువారు క్షమియింపబడఁగూడని మహాపాతకులు" అని చెప్పఁబడియున్నది. కావున నాతోడిస్త్రీ లెవ్వరును నిదివఱకు జేయనిపని నేనును జేయఁగూడ దనుట యాశ్చర్యజనకముగా నున్నది. మృతజీవులని ప్రసిద్ధిగాంచిన మనపూర్వుల కిట్టియూహ లెన్నఁడును బుట్టియుండలేదు. ఏదీ నాక్రైస్తవమిత్రులు నే నడుగబోవు నీక్రిందిప్రశ్నమున కేమియుత్తరము నిత్తురో చూచెదము. ఓ నెచ్చెలులారా! మీమతధర్మములను బట్టి యేసుక్రీస్తు మీయందఱికొఱకు తనప్రాణమును బలియొసంగక యుండిన మీకు పాపవిమోచనము గలుగునని తలంతురా? ఆయన యట్లు లోకోపకారమును జేయుచుండఁగా వారికిఁ గలిగిన ఘోరమయినదండనమున కేమయిన నామహాను భావుఁడు జంకెనా? లేదు. ఆయన జంకినట్టు మీరెప్పు డొప్పుకొనునట్టివారు కారని నిశ్చయముగా నేనుజెప్పఁగలను. మాపూర్వపురాజులలోనుగూడశిబి, మయూరధ్వజుఁడు మొదలగువారు పరోపకారార్థమయి ప్రాణత్యాగము చేయ వెఱవరయిరి. మనకు విఘ్నమే కలుగునో, యాపదలె సంభవించునొయని చేయవలసిన ధర్మమును జేయకపోవుట న్యాయము కాదు. మనము చేయవలసినంత ప్రయత్నము చేసి తీరవలయును. మనకటు పిమ్మట జయమయినను సరె, యపజయమయినను సరె. మనుజులను మూడుతరగతుల వారినిగా విభజించెను. అందు అధములుఁ విఘ్నములు గలుగు ననెడి భయమువలన నేపనినిగాని పూనుకొననివారు. మధ్యములు తామారంభించినపనికి నడుమ నంతరాయము సంభవించినతోడనే యాపనిని విసర్జించువారు. ఉత్తములు ప్రారంభించినదాని కెన్ని యడ్డములు వచ్చినను వాని నెల్లఁ బూనికతో నిదానించి విజయము గాంచువారు.

కష్టము లెంత యుత్కృష్టములుగా నుండునొ మనకు ధైర్యస్థైర్యము లంత యధికముగా నుండును. కాఁబట్టి మన మారంభించినదాని నెన్నఁడును మానఁజనదు. ఇఁక నావిన్నపము ముగిసింది. ఇంతసేపు ప్రసంగించుటవలన మిమ్ము విసికించితి నేమోయని భయపడుచున్నదానను. అందులకు నన్నుమీరు క్షమింతురు గావుత."

ఈ యుపన్యాస మిచ్చినపిదప ఆనందీబాయి యొక క్రైస్తవగురువుల కుటుంబముతో అమేరికా కరుగ నిశ్చయించెను. ఒకానొక హిందూబ్రాహ్మణస్త్రీ అమేరికా కరుగునని విని రావ్ సాహేబు దాండేకర్ అను నాతనికి మిగుల విచారము కలిగెను. అంత నాతఁ డనేకప్రయత్నములచే నామె యమేరికాప్రయాణ మాపవలెనని యత్నించిచూచెను. కాని యాతని ప్రయత్నములవలన నేమియు ఫలముకాన రాకుండెను. అంత నాపూర్వాచరపరాయణుఁడు ఆనందీబాయి యాప్తులకువ్రాసి వారిచే నమేరికాకుఁ బోవలదని యానందీబాయికి ననేకము లయినయుత్తరములను వ్రాయించెను.. కానివానివలనను ఆమె ప్రయాణమాగదయ్యెను. రేపు ప్రయాణమనఁగ ఆనందీబాయి యక్కవద్దినుండి తమ్మునికి ప్రాణాంతముగా నున్నదనియు నీవుతక్షణము బయలుదేరి రావలసినదనియు నుత్తరమువచ్చెను. దానింగనిఆనందీబాయి కొంచెమాలోచింపఁగా నాయుత్తరము నీప్రయాణము నాపుటకే వ్రాసిరనియు నీతమ్మునికి నిజముగ ప్రాణాంతముగనుండిన నీవుపోయి చూచునంతకునుండఁ డనియు ఇందువలన నీవు చేయఁబోవు మహాకార్యమును మానుట మంచిదికాదనియు నామెమనోదేవత యామెకుఁ జెప్పి యామె నిశ్చయముఁ దొలగకుండఁజేసెను. ఆహా! దృఢనిశ్చయమన నిట్టిదిగదా? చిన్న చిన్న సంకటములు ప్రాప్తించినను భయపడి మనవారలంగీకృతకార్యమును పరిత్యజింతురు. కాని యట్టివారు ఆనందీబాయి చరిత్రఁ జదివి దృఢనిశ్చయ మనుసద్గుణమును నేర్చుకొనియెదరుగాక.

అంత 1883 వ సంవత్సరము ఏప్రియల్ 7 వ తేదిని ఆనందీబాయి కలకత్తానగరమునుండి పాతాళలోకమున కరుఁగ బొగయోడ నెక్కెను. అప్పుడు ఆదంపతుల కిరువురకును గలిగిన వియోగదు:ఖ మిట్టిదనిచెప్ప నెవ్వరితరము ! అయిన నువారు తమసుఖములను విడిచి, స్వదేశహితమునకై కష్టముల ననుభవించిరి. వారి స్వదేశభక్తినెంతపొగడినను తీరదు. త్రోవలో సహవాసముగానుండిన క్రైస్తవస్త్రీలామెను తమమతమునకుఁ ద్రిప్పవలయునని విశేషముగా బోధించిరి. కాని దృఢనిశ్చయురాలయిన యాయబల వారికిఁ దగినయుత్తరముల నిచ్చి యామతమును ఖండించెను. అందువలన నాయువతు లామెను మిగులతిరస్కారముగాఁ జూచియు, ఆమెకు శరీరమస్వస్థముగానుండినను విచారింపక ఉపోషము చేసినను భోజనముచేయు మనక ఆమె తినదని యెఱిఁగియు మాంసాహారములు తినెదవాయనియామెను కేరడములాడియు విశేషబాధపెట్టిరి. ఆనందీబాయి వారింత చేసినను వారిపై కోపపడక స్వదేశవియోగము, స్వజన వియోగము వలనఁ గలిగిన దు:ఖమును తానే యాపుచు దొరకినచో ధాన్యాహారము చేసియు, దొరకనిచో నుపోషముండియుఁ గాలముగడుపుచు స్టీమరుపై వెళ్ళుచుండెను. ఆహా! ఇట్టిస్వదేశాభిమానమును, స్వధర్మాభిమానమును గలస్త్రీ సర్వజనవంద్యయనుటకు సందేహముగలదా? కొందఱు క్రైస్తవమతబోధకులు మొదట తాము మిగుల ప్రేమకలవారుగా నగుపడి, తమమతము నితరులకు బోధింతురు. వారు తమబోధవలనఁ దమమతము నవలంబింపరని వారికిఁ దెలియఁగా ననేకరీతుల వారి నవమానింతురు. ధర్మగురువు లగువారి కిది యెంతమాత్రమును తగినపని కాదు. తోడివారలు తన నట్లుచూచి సహాయ మేమియుఁ జేయకుండినను ఆనందీబాయి తనకుఁ బరమేశ్వరుఁడే సహాయుఁడని నమ్మియుండెను. పదినెనిమిది సంవత్సరముల వయసునందే యింతటిదృఢనిశ్చయమును, ధైర్యమును, ఈశ్వరునియందునమ్మికయుఁ గలిగి వర్తించుటమిగుల స్తుత్యముగదా!

ఇట్లు ధూమనౌకపైఁ బ్రయాణముచేయుచు ననేక ద్వీపములనుగడచి జూన్ 18 వ తేదిని ఆనందీబాయి అమేరికా చేరెను. అచటికి ఆనందీబాయి వచ్చుచున్న వార్తవిని యదివఱకే కార్పెంటరు దొరసాని యోడవద్దకివచ్చి ఆనందీబాయి నెదుర్కొనెను. అప్పు డాయిరువురికిని గలిగిన యానంద మింతంతయని చెప్పుటకు వీలులేదు. కార్పెంటరు దొరసాని ఆనందీబాయి సద్గుణములను నేటికిని మఱవలేదు. ఇట్టిస్త్రీలుబహుసంఖ్యలో నొకరుందురని యామె యనుచుండెను.

ఆనందీబాయి అమేరికాలోని న్యూజరసీపట్టణమున కేఁగ నచట కార్పెంటరు దొరసానిగారి కుటుంబీకులందఱును ఆమెను బహుమర్యాదచేసిరి. వీరింటనుండియే ఆనందీబాయి తనచదువున కనుకూలమగు తావువెతకుకొనెను. అచటనున్న నాలుగు నెలలు వృధపుచ్చక ఆనందీబాయి కుట్టుపని, అల్లికపని జలతారుపని నేర్చుకొనెను. తదనంతర మామె ఫిలడెల్పియా యనుమహాపట్టణమున వైద్యవిద్య నభ్యసించునటుల స్థిర మయ్యెను.

కొందఱు పురుషులుగాని, స్త్రీలుగాని తమదేశమును వదలి పరదేశమున కరిగినపిదపఁ దమదేశాచారముల విడిచి విదేశాచారములనే స్వీకరింతురు. కాని మాచరిత్రనాయిక యట్లుకాక పాతాళలోకమున కరిగియుఁ దనదేశాచారముల మఱవక యాదేశపువారికిని వానిని నేర్పెను. ఆమె తనస్నేహితు రాండ్రకును కార్పెంటరు నింటి వారికిని మహారాష్ట్ర స్త్రీలవలె జడలువేసి చీరెలు కట్టింపుచుండెను. తాను న్యూజరసీపట్టణమున కేఁగుటకు ముందు తనస్నేహితురాండ్ర కందఱకును మహారాష్ట్రపద్ధతి ననుసరించి విందుచేసెను. ఆదిన మామె తానే తమదేశపు పక్వాన్నములు వండి భోజనములకు కూర్చుండుటకు పీటలువేసి, తినుటకు విస్తరులును దొప్పలునుకుట్టి మహారాష్ట్ర దేశాచారప్రకారము సకలపదార్థములును వడ్డించి విందారగింపవచ్చిన యువతులకు మహారాష్ట్రస్త్రీవలెఁ జీరలు, గాజులు, కుంకుము మొదలయిన వలంకరించి చేతితో భోజనము చేయువిధ మంతయు వారికిఁ దెలిపి తానును వారితోఁ గూర్చుండి భోజనము చేసెను.

తదనంతరమునం దామెను దీసికొని కార్పెంటరు దొరసాని ఫిలడెల్పియా పట్టణమున కరిగి యచట నామె కనుకూల మగునటుల నిల్లు మొదలయినవి విచారించి, మరలి తనగ్రామమునకు వచ్చెను. ఆనందీబాయియు నచట విద్య నభ్యసింపుచు స్నేహితురాండ్రఁ గలసియుండెను. అచట నామె నాలుగుసంవత్సరములు విద్యాభ్యాసముచేసెను. ఆవ్యవధిలో నామె కనేక శారీరకమానసిక దు:ఖములు కలిగి యామెదేహమునానాటికి క్షీణింపసాగెను. ఆమె చదువుకొనుకాలములో హిందూదేశమునుండి యనేక స్త్రీవిద్యాశత్రువులు మిగుల హేయములగు జాబులను వ్రాసి యామెకు మిగులవిచారము కలుగఁజేసిరి. కొంద ఱామె పరదేశమున కరిగి స్వధర్మమును విడిచెనని యామెభర్తకుఁ జెప్పి యామెపై మనసు విఱుపఁజూచిరి. కాని వారిప్రయత్నము లెంతమాత్రమును కొనసాగినవికావు. ఇట్ల సత్కా ర్యములకు నెట్లయిన విఘ్నములు గావింపవలయునని తలఁపు గల ధర్మాచరణపరాయణులు మనదేశమునం దున్నందుకు నెంతయుఁ జింతిల్లవలసియున్నది. అమేరికాలోనుండఁగా ఆనందీబాయి యనేకోపన్యాసముల నిచ్చి యచ్చటి విద్వాంసులను మెప్పించెను.

భార్యవెళ్లిన రెండుసంవత్సరములకు గోపాలరావుగారు బయలుదేఱి కాలినడకతో నమేరికా కరిగెను. ఆయన తనభార్య నడవడిని గనుఁగొనదలఁచి యామెకుఁ దెలుపకయే యకస్మాత్తుగా నచటికిఁబోయెను. కాని యామె సత్ప్రవర్తనఁ గనిన పిదప గోపాలరావు తానామెనుగూర్చి శంకించినందుకు పశ్చాత్తాపపడెను. ఇట్లు గొప్పవిద్య నేర్చుకొని అమేరికాదేశమునకుఁ జని, మహాగౌరవమును గాంచియు విశుద్ధచరితగా నుండి యెల్లప్పుడును సంశయముతోనే యుండెడిపతిని మెప్పెంచిన యీపతివ్రతాశిరోమణి పాత్రస్మరణీయ యనుటకు సందేహము లేదు.

నాలుగుసంవత్సరములు చదివినపిదప ఆనందీబాయి వైద్యవిద్యయందు ప్రవీణురాలని మెప్పు పొందెను. తదనంతర మాదంపతులు అచటఁ జూడఁదగిన స్థలములనుజూచి కార్పెంటరు దొరసానివద్ద సెలవుపుచ్చుకొని స్వదేశమునకు వచ్చిరి. ఆనందీబాయి అమేరికాలో నుండినకాలముననే కోలాపురపు సర్కారువా రామెను తమస్త్రీవైద్యశాల కధికారినిగా నుండుమనియు, నెలకు మూడువందలరూపాయిలు వేతనమిత్తు మనియుఁ బిదప నైదువందలవఱకు వృద్ధిపొందింపఁ గలమనియు నామెకుఁ దెలిపిరి. కాన నామె యందునకు నొప్పుకొనెను. కాని. దేశముయొక్కయు, స్త్రీలయొక్కయు దురదృష్టమువలనఁ జదువుకొనుకాలముననే యామెకు క్షయరోగ మంకురించి క్రమముగా వృద్ధియగుచుండెను. రోగముతోడనే యామె మనదేశమునకు వచ్చెను. సముద్రప్రయాణమువలన నామె దేహము మఱింత యస్వస్థ మయ్యెను. బొంబాయియందును, పూనాయందును, ఆమెకు ఔషధోపచారము లనేకములుచేసి చూచిరి కాని ఫలము లేక పోయెను. తుదకు 1887 వ సంవత్సరము ఫిబ్రవరి 26 వ తేది రాత్రి పదిగంటలకుఁ దా జన్మించిన పూనాయందే యీయద్వితీయస్త్రీ పరలోకమున కేగెను. మరణకాలమున "నాచేత నయినంతవఱకు నేనుచేసితి"నని పలికి యామె ప్రాణముల విడిచెను.

చూచితిరా? యీధైర్యవతి సాహసము! ఇట్టిరత్నము లనేకములు మనదేశమునందుఁ గలవు. కాని యారత్నములను సానఁబెట్టి ప్రకాశింపఁజేయుటకు గోపాలరావు వంటివారు లేనందున నారత్నములును రాళ్ళవలె కానిపించుచున్నవి. ఆనందీబాయి సద్గుణములకును, సద్విద్యకును, గోపాలరావే మూలకారణుఁ డనుట కెంతమాత్రము సందేహములేదు. సాధారణముగా మొగపిల్లలును ఆఁడుపిల్లలును వారి చిన్న తనపు చేష్టల వలన మిగుల చెడ్డవారని యనిపించుకొందురు. పురుషులు విద్యనేర్చిన పిదప తమ యజ్ఞానమును కొంతవఱకు విడిచి మంచివా రగుదురు. స్త్రీలో, విద్య నేర్పువారు లేక యింటి యందుఁ దల్లి ముత్తవ మొదలగువారివలెనె జ్ఞానవంతులును సుగుణదుర్గుణములు కలవారును నగుదురు. ఆనందీబాయి చిన్న తనమునందు మిగుల చెడ్డదిగాఁ గానుపించు చుండెను గాని విద్యాభ్యాస మధికమయినకొలఁదిని ఆమెమనసు మాఱెను. ఆమె పరద్వీపమున కేగి యిట్టివిద్యను నేర్చివచ్చినను, గర్వ మామె నంటఁజాలకుండెను. ఆమె చరితము గని వినినవారలు స్త్రీవిద్యాద్వేషు లయినను తమయభిప్రాయమును మాని స్త్రీ విద్యాభిమాను లగుదురనుటకు సందేహము లేదు. ఈమె చరితము అమేరికాలోనివారును వ్రాసి మిగుల పూజ్యభావములతోఁ జదువుచున్నారు.

ఇట్లీయుత్తమసతి దేశదేశాంతరములయందుఁగీర్థిఁగాంచి విద్యచే స్త్రీలు బాగుపడుదురేగాని చెడిపోరనియు దుర్గుణములకు విద్యకు విరోధమేగాని విడలేని మైత్రిలేదనియు, స్వచరిత్రమువలన స్థాపించి, విద్యనేర్చిన స్త్రీలందఱు ధర్మము విడుతురనియు, పతిని మన్నింపరనియు స్వచ్ఛంద లగుదురనియుఁ గొందఱు చెప్పెడిమాటలు ద్వేషజన్యములయిన యసత్యవాక్యము లనియు, స్థిరపఱచినందునను ఆనందీబాయి చరిత్రమునకు నేను "స్త్రీవిద్యావిజయదుందుభి" యని పేరుపెట్టితిని.