అబద్ధాల వేట - నిజాల బాట/దివ్యశక్తులు వుంటే 5 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు!

వికీసోర్స్ నుండి
దివ్యశక్తులు వుంటే
5 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు!

దివ్యశక్తులు, ఇంద్రియాతీత (అతీంద్రియ) మహిమలు ప్రాచీనకాలం నుండి నేటి వరకూ చర్చనీయాంశమే. నమ్మకస్తులు, భక్తులు, ఆస్తికులు యీ శక్తుల్ని ఏదో మేరకు ఒప్పుకుంటారు. వారి బలహీనతను ఆధారంగా పురోహిత వర్గాలు, బాబాలు, మాతలు వివిధ ప్రక్రియలతో ఆకర్షించి ఆర్జిస్తున్నారు. ఇంచుమించు వ్యాపార సరళిలో నమ్మకాలను నడిపిస్తున్న మతాలు అన్ని రంగాలలో ప్రవేశించి ప్రభావితం చేస్తున్నాయి.

ప్రశ్నించేవారు, సందేహించేవారు, శాస్త్రీయ పద్ధతిలో సాగిపోయేవారు ఇంద్రియాతీత శక్తుల్ని, మూఢ నమ్మకాలను,అద్భుతాలను బట్టబయలు చేస్తున్నారు. అయినా కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఇటీవల సైన్స్‌ను, కంప్యూటర్లను, సాంకేతిక జ్ఞానాన్ని మూఢనమ్మకాల వ్యాప్తికి వాడడం విశేషంగా కనిపిస్తున్నది. అది మరీ జనాకర్షణకు దారితీస్తున్నది. జ్యోతిష్యం, హోమియో వైద్యం కంప్యూటరైజ్ చేసి దుర్వినియోగం చేయడం ఎక్కువైంది.

మహిమలు, దివ్యశక్తులు ప్రశ్నార్థకంగా చేసిన వ్యక్తులలో జేమ్స్ రాండిని ప్రముఖంగా పేర్కొనవచ్చు. ఆయన 25 ఏళ్ళ క్రితం 10 లక్షల డాలర్లు బ్యాంకులో పెట్టి ఇంద్రియాతీత శక్తుల్ని ప్రపంచంలో ఎవరు ఎక్కడ రుజువు చేసి అయినా, ఆ డబ్బు స్వీకరించమన్నాడు. ఇప్పటి వరకు ఆ పందాన్ని ఎవరూ గెలవలేరు. నిరంతరం జేమ్స్ రాండి ప్రపంచ పర్యటన చేసి, అద్భుతశక్తుల్ని, మహిమల్ని, భక్తి కూటముల రోగ చికిత్సను, హోమియో మోసాన్ని, జ్యోతిష్యాన్ని ఎండగడుతూనే వున్నాడు.

జేమ్స్ రాండి 10 పుస్తకాలు రాశాడు. అందులో సారాంశమంతా దివ్యశక్తులు, పేరా సైకాలజీ మహిమల గురించి గుట్టు రట్టు చేయడమే.

ఇటివల జేమ్స్ రాండి ఒక విజ్ఞాన సర్వస్వం వెలువరించాడు. అకారాది వరుసలో అన్నిచోట్ల ప్రచారంలో వున్న శక్తుల గురించి సంక్షిప్తంగా, హాస్యభరితంగా వెలువరించాడు. దీనికి ఆర్ధర్ సి. క్లార్క్ (శ్రీలంక శాస్త్రజ్ఞుడు) ముందు మాట రాశాడు.

టి.వి. ప్రసారాలలో జేమ్స్ రాండి శక్తుల-మహిమల బండారాలను బయటపెట్టాడు. చైనా నుండి ఆస్ట్రేలియా వరకూ పర్యటించి ఉపన్యాసాలిచ్చాడు. ఫిలిప్పిన్స్‌లో విపరీత మోసాలకు గురైన సైకిక్ సర్జరీ నిశితంగా పరిశీలించాడు. హోమియో దగాలను ఫ్రాన్స్, కెనడా, ఇజ్రాయల్, ఇంగ్లండు, అమెరికాలలో ఛాలెంజ్ చేసి, అసలు విషయాలు చెప్పాడు. అమెరికాలో భక్తి కూటాల దొంగ బాబాలను నిలబెట్టి వారి మోసాలను చెప్పడంతో కొందరు రంగ నిష్క్రమణ చేశారు. మరికొందరు దివాలా తీశారు. యూరిగెల్లర్ తనను దివ్యశక్తుల మాంత్రికుడుగా ప్రచారం చేసుకుని డబ్బు ఆర్జించగా జేమ్స్ రాండి అతడ్ని డీకొన్నాడు. చెంచాలు చూపుతో వంచడం,ఇంకా అనేక శక్తుల వెనుక ఎలా దగా చేస్తున్నాడో చెప్పాడు. చివరకు కోర్టు తగాదాలలో యూరిగెల్లర్ ఓడిపోయి అమెరికా నుండి పారిపోయి ఇంగ్లండ్ లో స్థిరపడ్డాడు. క్రైస్తవ మత ప్రచారకులు ఎప్పటికప్పుడు జేమ్స్ రాండి దెబ్బలకు హతమౌతూనే వున్నారు.

జేమ్స్ రాండి రాసిన Faith Healers పుస్తకానికి శాస్త్రజ్ఞుడు కార్ల్ శాగన్ పీఠిక రాశాడు.

మెకార్ధర్ అవార్డు అందుకున్న జేమ్స్ రాండి కెనడా వాసి అయినా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పాడు. అవివాహితుడు. ఆయన పరిశోధనలు ఇప్పుడు కంప్యూటర్ ద్వారా website లో చూడవచ్చు.

ప్రపంచ ప్రళయం వస్తుందని పవిత్ర గ్రంథాలలో అన్ని మతాలు పేర్కొని జనాన్ని ఎప్పటికప్పుడు హడలుగొడుతూనే వున్నాయి. అలాంటి వాటిలో ప్రముఖమైన 49 ప్రళయ జోస్యాల్ని జేమ్స్ రాండి ప్రచురించాడు. అన్ని తేదీలతో సహా వున్నాయి. ఎప్పటికప్పుడు మతాలు కొత్త తేదీలు యిస్తూ జనాన్ని భయం గుప్పిట్లో, తమ సేవలో అట్టిపెడుతున్నాయి. 2000 సంవత్సరం కూడా అంతానికి తేదీగా నిర్ణయించి, ఏమీ జరగకపోయేసరికి, కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.

ఆసక్తికరమైన ఎన్‌సైక్లోపేడియాలో జేమ్స్ రాండి చూపిన వివరాలు, ఒక్కొక్క అంశంపై యిచ్చిన సరళమైన, చతురోక్తులతో కూడిన వివరణ గమనార్హం.

(An Encyclopedia of claims,frauds and hoaxes of the occult and super-natural,by James Randi, St. Martins press,175 Fifth avenue, New York 10010 USA,284 పేజీలు Arthur C.Clarke పీఠిక)

ఇందులో హోమియో గురించి జేమ్స్ రాండి ఏమన్నాడో చూడండి. హానిమన్ రోగాలన్నీ మూడంశాలనుండే వస్తాయన్నాడు. సిఫిలస్, దురద పేర్కొనదగినవి. ఏ లక్షణాలున్న రోగం అదే లక్షణాలతో నయమౌతుంది. హోమియోలో వాడే ఔషధంలో మందు వుండదు. ప్రకంపనాలతో శక్తి పెరిగి, మందులో దాగివుంటుంది. వాస్తవానికి కేవలం నీరు మాత్రమే వుంటుంది. నీటిని అయస్కాంతీకరణ చేయవచ్చునని ప్రస్తుతం కొందరు రాగతీగెల్ని వాడుతున్నారు. మూలకారణాల జోలికి పోక, రోగలక్షణాలనే హోమియో పట్టించుకోడానికి వారికి మూలం తెలియకపోవడమే.

హోమియో ఒక రకంగా మాజిక్ అంశంగా మారింది. అందుకే యీ పుస్తకంలో దానిని చేర్చినట్లు జేమ్స్ రాండి పేర్కొన్నాడు.

ఎన్ సైక్లోపేడియాలో అబారిస్ (పైథాగొరస్‌కు గురువు)తో ఆరంభించి జోంబి (Zombie) తో ముగించాడు. ప్రతి మాటను సంక్షిప్తంగా అర్థమయ్యేట్లు చెప్పడం జేమ్స్ రాండి కళ. మహర్షి మహేష్ యోగి గురించి యిందులో క్లుప్తంగా చెప్పినా, అతడి మోసాలను మరో గ్రంథంలో చాలా వివరంగా బట్టబయలు చేశాడు.

(Flim-Flamలో The Giggling Guru:A matter of Levity చూడండి. Prometheus Books,700 East Amherst street Buffalo, Ny 14215 USA PP 342 దీనికి ఐజక్ అసిమోవ్ పీఠిక రాశాడు).

భారతదేశంలో మహిమల గుట్టును శాస్త్రీయంగా వెల్లడిస్తున్న, బి. ప్రేమానంద్ గురించి యీ పుస్తకంలో వుండడం విశేషం. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రేమానంద్ తమిళనాడులోని పోడునూరు, కోయంబత్తూరు నుండి ఇండియన్ స్కెప్టిక్ అనే ఇంగ్లీషు మాసపత్రిక నడుపుతున్నారు.

జ్యోతిష్యం భవిష్యత్తును చెబుతున్నా, కంబోడియా జ్యోతిష్యం రానున్న ఉపద్రవం అరికడతానని కూడా అంటుందని రాశాడు.

భారతీయులకు సంబంధించి జిడ్డు కృష్ణమూర్తి దివ్యజ్ఞాన సమాజ పరిస్థితి ఉదహరించాడు.

కుండలినియోగం, చక్రం, ఫకీర్, గురువు, హరేకృష్ణ, కర్మ, కమండలాలు, మంత్రం, ఓం, సాయిబాబా, సిద్ధి, తంత్ర, యోగం, ప్రస్తావనలు వున్నాయి.

భారతీయులకు తెలియని విదేశీ విషయాలు చాలా వున్నాయి. కొన్ని మాత్రం మనదేశంలో వున్నట్లే ఇతర దేశాలలో మార్పులు చేర్పులతో వున్నాయి. అందుకు ఉదాహరణగా దానంతట అదే, చేయి రాస్తూ పోతుందనడం, హస్త సాముద్రికం (కొందరు అరికాలిలో గీతలు కూడా ప్రభావితం చేస్తాయని నమ్ముతారు). జ్యోతిష్యం, నిప్పులపై నడక, గాలిలో తేలడం, దూరశ్రవణ,దూరదృష్టి, ముఖ కవళకల్ని బట్టి వ్యక్తి ఎలాంటివాడో చెప్పగలగడం, దృష్టిదోషం, చేతబడి, దివ్యశక్తితో, నీళ్ళు ఆయిల్ ఎక్కడపడేది చెప్పడం వున్నాయి.

ప్రపంచం అంతం

జేమ్స్ రాండి పేర్కొన్న 49 ప్రపంచ అంతం జోస్యాలు చాలా ఆసక్తికరమైనవి. బైబిల్ ఉదాహరణలు, క్రైస్తవ జ్యోతిష్యుల అంచనాలు యిచ్చి అవి ఎలా వెర్రివాళ్ళను చేసాయో చూపాడు.

క్రీ.శ. 992 లో మొదలుపెట్టి 1999 జూలై వరకూ చెప్పిన ప్రళయ జోస్యాలు రాండి పేర్కొని, విఫలం అయిన తరువాత కూడా జ్యోతిష్యులు తలెత్తుక తిరుగుతున్నారన్నాడు. జోస్యాలు చెప్పిన వారిలో బిషప్పులు కూడా వున్నారు.

(శ్రీశ్రీ మాటలు గుర్తు తెచ్చుకోండి - హిప్పొపొటమస్ ఒక బిషప్పును గనియిట్లనియె స్వామీ తమరు చెప్పిందే చెప్పిందే మరల మరల చెప్పుటెందులకని) 16వ శతాబ్దంలో ఫ్రెంచి వ్యక్తి నోస్ట్రాడాముస్ (1503-1566) శతాబ్దాలు అనే గ్రంథం (Centuries) రాశాడు. ఇది 10 భాగాలు. ఇందులో అన్ని భవిష్యత్తువాణి అన్నాడు. ఇప్పటికి వాటిని నమ్మేవారున్నారు. అతడు ఒకటవ ఎలిజబెత్ రాణి గురించి చెప్పింది ఒక్కటీ నిజం కాలేదు. అతడు 10వ భాగంలో చెప్పిన ప్రకారం 1999 జూలైలో ప్రపంచం అంతం కావాలి. జేమ్స్ రాండి దీనిపై వ్యాఖ్యానిస్తూ అంతా అబద్ధాలమయంగా వున్నా ఆ 10 భాగాల రచనల్ని భక్తులు విపరీతార్థాలతో జనాన్ని భయపెడుతున్నారన్నాడు.

తోకచుక్కల విషయం శాస్త్రీయంగా బొత్తిగా తెలియక దాని చుట్టూ అనేక ప్రళయ కథలు అల్లారన్నాడు.

సంఖ్యాశాస్త్రంలో, నేడు కంప్యూటర్లు వాడి తప్పుడు భాష్యాలు చెప్పడాన్ని చూపాడు. అలాగే పిరమిడ్లను అడ్డం పెట్టుకొని కొందరు కథలు అల్లడాన్ని చూపాడు రాండి.

అద్యంతాలు ఆసక్తికరంగా రాసిన యీ ఎన్‌సైక్లోపీడియా లైబ్రరీలలో వుండాలి. పిల్లలు చదవాలి. తల్లిదండ్రులు చదివి పిల్లల భయాలను పోగొట్టాలి. అసిమోన్ చెప్పినట్లు పిల్లలందరూ సందేహవాదులే. వారు ప్రతిదీ ప్రశ్నిస్తారు. కాని ఆ ప్రశ్నా స్వభావాన్ని తల్లిదండ్రులు మతాలు చంపేస్తున్నాయి.

5 కోట్లు గెలవండి

జేమ్స్ రాండి 70వ పడిలో మూఢ నమ్మకాలపై నిరంతర పోరాటం సాగిస్తూ, బ్యాంకులో 10 లక్షల డాలర్లు పెట్టాడు.

ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా సరే సైకిక్, అతీంద్రియ (ఇంద్రియాతీత) శక్తులున్నాయని రుజువుపరచి, ఆ డబ్బు స్వీకరించవచ్చు.

జేమ్స్ రాండి అడ్రసు: 201 East, Davie Boulevard(S.E. 12th St), Fort Lauderdale, Florida 33316-1815

ఈ నిర్ణయంలో జడ్జిగా జేమ్స్ రాండి వుండడు.

ముందుగానే చెక్కును నిష్పక్షపాతి వద్ద అట్టిపెడతాడు.

ఏ శక్తి వున్నదీ ముందుగా తెలియపరచాలి.

నిర్ణయించిన తేదీ, స్థలం ప్రకారం, పేర్కొన్న శక్తి ప్రదర్శన జరగాలి. ప్రదర్శన అంతా ఫోటో తీయడం, రికార్డు చేయడం జరుగుతుంది. శక్తి ప్రదర్శన వేరే దేశాలలో జరగవలసివస్తే, జేమ్స్ రాండి ఒక నిష్పాక్షిక ప్రతినిధిని పేర్కొంటాడు. వారి ఎదుట ప్రదర్శన జరపాలి. ఇందులో దారిఖర్చుల చెల్లింపు వుండదు. ప్రదర్శన వలన జరిగే నష్టాలకు రాండి బాధ్యుడు కాదు కనుక నష్టపరిహార చెల్లింపు వుండదు.

జేమ్స్ రాండి తన తదనంతరం ఛాలెంజ్ ధనాన్ని అతీంద్రియ శక్తుల శాస్త్రీయ పరిశోధనా సంస్థకు యివాలని రాశారు. ఇది అమెరికాలోని నయగారా వద్ద బఫెలో నగర శివార్లలో వుంది.

(Committee for the Scientific Investigation of Claims of the paranormal)

ప్రదర్శనలో పేర్కొన్న ప్రకారం అతీంద్రియ శక్తి చూపలేకపోతే, తనకు అలాంటి శక్తి లేదని ప్రదర్శకుడు స్పష్టంగా ప్రకటించాలి.

web address:

http://www.randi.org

Phone:954-467-1112

Fax:954 467 1660

ప్రార్థనలతో రోగాలు మటుమాయం

భక్తికూటాలు ఏర్పరచి, భజనలతో,ప్రార్థనలతో, బోధనలతో రోగాలు నయం చేస్తామని, వికలాంగులను బాగుచేస్తామని ప్రపంచ వ్యాప్తంగా మోసాలు చేస్తున్నారు. దీనిని చాలెంజ్ చేసి అదంతా బూటకమని జేమ్స్ రాండి రుజువు చేశాడు. అయినా వెర్రి భక్తితో జనం కొత్త బాబాల చుట్టూ ఆశగా డబ్బు వదిలించుకుంటూనే వున్నారు.

తన అనుభవాలను జేమ్స్ రాండి ఒక పుస్తకంలో రాశాడు. అది బాగా ప్రచారంలోకి వచ్చిన గ్రంథం.

The Faith Healers (Prometheus Books, 3/4 pages, 700 East Amherst Street, Buffalo New York 14215 USA)

అమెరికాలో క్రైస్తవ ప్రచారకులు చేసిన విపరీత మోసాలు బయట పెట్టిన పుస్తకం యిది. అమెరికా అధ్యక్షపదవిని ఆశించిన క్రైస్తవ ప్రచారకుడు పాట్ రాబర్డ్‌సన్ మొదలు, ఎ.ఎ.ఎలెన్, ఓరల్ రాబర్డ్స్, డబ్ల్యు.వి. గ్రాంట్ ప్రభృతులను ఎండగట్టిన గ్రంథం యిది. టెలివిజన్ ప్రచారంలో భక్తి పేరిట చాలా డబ్బు వసూలు చేసిన సంఘటనలున్నాయి. రష్యాలో కమ్యూనిజం అరికట్టమని దేవుడు ఆదేశించాడు. గనుక అర్జెంటుగా డబ్బివ్వమని టెలివిజన్ ద్వారా విజ్ఞప్తి చేసి, కాజేసిన వారి సంగతి బయటపెట్టాడు.

కుంటి, గుడ్డి వాళ్లను స్వస్థత కూటాలలో బాగుచేస్తున్నట్లు చేసిన మోసాలను వెల్లిడించాడు. కొందరు దివాలా తీసి పారిపోయారు. కొత్త బాబాలు తలెత్తుతున్నారు. నిరంతరం జేమ్స్ రాండి పోరాటం సాగిస్తూనే వున్నాడు. మనం తీసుకెళ్ళిన కుంటి,గుడ్డి, మూగవాళ్ళను అక్కడ నయంచేయరు. వారు ముందే ఏర్పాటుచేసి, నటించేవారిని తెచ్చి నయమయినట్లు చూపి, డబ్బు కాజేస్తుంటారు.

జేమ్స్ రాండి తన Flim-Flam అనే గ్రంథంలో మరికొన్ని రంగాలలో మోసాలను బయటపెట్టి వివరాలందించాడు. ఆకాశం నుండి ఎగిరే పళ్ళాలలో వచ్చి కొందరు రోగాలను నయం చేస్తున్నారనే వదంతి ఎలా పనిచేస్తుందో చూపాడు. గాలిలో తేలిపోడానికి యోగవిద్య పనిచేస్తుందనే మహేష్ యోగి మోసాలను బయటపెట్టాడు. ప్రత్యామ్నాయ ఔషధాల పేరిట చికిత్సలు చేసి మోసాలు కప్పిపుచ్చుకుంటున్నవారి గుట్టి రట్టు చేశాడు. దయ్యాలు, భూతాలు, పిశాచాలు, దేవతల పేరిట అద్భుతాల వ్యాపార రహస్యం వెల్లడించాడు. జ్యోతిష్యాన్ని ఎండగట్టాడు. హోమియోను ఉతికేశాడు.

జేమ్స్ రాండి స్వయంగా మెజీషియన్. ప్రదర్శనలు యిస్తాడు. అయితే ఇతరులకూ యితనికీ తేడా వుంది. ప్రదర్శనలు కేవలం డబ్బుకోసం. ప్రేక్షకులకు వినోదం అందించడం. కాని మాజిక్ పేరిట మోసాలు చేయడాన్ని రాండి సహించడు.

సైంటిస్టులు అతి సులభంగా మాజిక్ వలలో పడతారని రాండి రాశాడు. సైన్స్ సూత్రాలను అతిక్రమించినట్లు మాజిక్ లో కనిపించే వాటిని సైంటిస్టులు గుడ్డిగా నమ్ముతారని అదేవారి లోపం అనీ అన్నాడు. అందుకే కొందరు సైంటిస్టులు బాబాల భక్తులై పోయి, మూఢ నమ్మకాల వ్యాప్తికి తోడ్పడుతున్నారన్నాడు.

మాజిక్ తెలిస్తే మోసాలను గ్రహించడం తేలిక. మూఢంగా నమ్మకం వుండదు. చదువుకున్న వారు సైతం మాజిక్ మోసాలు తెలియక బాబాల వలలో తేలికగా పడుతున్నారనాడు.

మాజిక్ ఎలా చేస్తారు, అందులో రహస్యం ఏమిటి, ప్రపంచంలో మాజిక్ ఎలా వ్యాప్తిలో వున్నదీ జేమ్స్ రాండి వివిధ రచనలలో విపులీకరించాడు. Conjuring అనే రచన ముఖ్యంగా చదవదగింది. కొందరు మెజీషియన్లు తమ విద్యని స్టేజికి పరిమితం చేయక, బాబాలుగా మారడంపట్ల రాండి ఆగ్రహించాడు. యూరిగెల్లర్ మోసాలను అలాగే బయటపెట్టాడు.

పేరా సైకాలజీ ఒక అంటివ్యాధిలా అమెరికా, యూరోప్‌లో, ఇతర చోట్ల వ్యాపించింది. కొందరు డిగ్రీలు కూడా పుచ్చుకుంటున్నారు. జె.బి.రైన్ మొదలు నేటివరకు పేరాసైకాలజి పేరిట జరుగుతున్న మోసాలని జేమ్స్ రాండి ఎదుర్కొన్నాడు.

- మిసిమి మాసపత్రిక, మే-2000