గబ్బిలం వ్యాఖ్యానం - కఠెవరపు వెంకట్రామయ్య

వికీసోర్స్ నుండి

జాషువా ఆత్మకథాత్మక కావ్యం: గబ్బిలం (ఒకటి)[మార్చు]

- డా. కఠెవరపు వెంకట్రామయ్య

"తనకీ, ప్రపంచానికీ, సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్, బహిర్ యుద్ధారావమే కవిత్వం" - చలం (శ్రీశ్రీ - మహాప్రస్థానం - యోగ్యతా పత్రం లో)


వినుకొండ పొలిమేరలను దాటి, వినువీధి అంచులను తాకటానికి ఉద్యమించిన విశ్వనరుడుగా, వీను మిగిలిన కవివరుడుగా తెలుగు సాహితీ ప్రపంచంలో పేరు ప్రతిష్టలను పొందిన కవి గుర్రం జాషువా (1895-1971). సామాజిక చైతన్యంతో విశ్వజనీనతను జోడించి, కారుణ్యం, మానవీయ విలువలను, ఆవేదనను ఆవిష్కరించిన జాషువా పద్యకృతి 'గబ్బిలం.


జీవిత కృతి - 'గబ్బిలం'

కవి శక్రేశుడు గండపెండెరములన్ గాంగేయ తీర్థంబులన్
వివిధోపాయన సత్కృతుల్ గొనిన గాంధీ శాంతి సిద్ధాంత మా
ర్థవ మార్గటుడు గబ్బిలంబులకు దౌత్యంబుల్ ప్రబోధించు మా
నవతా స్రష్టన్ నవ్యభావ చతురుండన్ జాషువాభిఖ్యుడన్ 

జాషువా తన గురించి చెప్పుకున్న పద్యమిది. కవులు, రచయితలు తాము ఎన్ని రచనలు చేసినా, వాటిలో తమకు నచ్చిందీ, ప్రజలు మెచ్చిందీ, ఆ కవికి లేక రచయితకు కీర్తి ప్రతిష్టలు గడించి పెట్టిందీ అయిన రచనలు సాధారణంగా ఒకటో, రెండో ఉంటాయి. అలాంటి రచనల్నే 'జీవిత కృతులు' (Life Works) అని అంటాం. ఆ కవి భావనా సర్వస్వం, కవితా శిల్ప సౌందర్యం సమస్తం, గుత్తకు కొన్న కావ్యం అదే అయి ఉంటుంది. జాషువా ఇంచుమించు ముప్ఫై పై చిలుకు గ్రంథాలు రచించాడు. సర్వ పండితామోదముగా రచియించితిని (వి) ముప్పది కావ్యములు (నా కథ-158). అయినా ఆయన ఆమరణాంతం చెప్పుకున్న కావ్యం "గబ్బిలమే". ప్రజలు మెచ్చి ప్రశంసించిందీ "గబ్బిలాన్నే". అందువల్లే, 'గబ్బిలం' జాషువా జీవిత కృతి. అంతేకాదు, ఆయన రచనలల్లోనే అది 'శిరశ్శేఖర కృతి' (Monumental work) కూడా! జాషువా మిగిలన రచనలన్నీ ఒక ఎత్తు, 'గబ్బిలం' ఒక్కటీ ఒక ఎత్తు. జాషువా జీవిత ప్రస్థానానికీ, సామాజిక దర్శనానికీ నిదర్శనంగా నిలిచేది ఈ 'గబ్బిలం' కావ్యం.


గబ్బిలం: ఖండకావ్యం

గురజాడ తో 'కావ్య ఖండిక' ల రచన (1910) ఆరంభమైనా, ఖండకావ్య ప్రక్రియ మాత్రం రాయప్రోలు సుబ్బారావు చేతిలోనే మొలకెత్తింది. అది జాషువా చేతిలో పుష్పించి ఫలించింది. ఖండకావ్య రచనలో అఖండ ప్రతిభా సంపన్నుడు జాషువా! ఆయన ఖండకావ్యాలు అటు రాసి లోను, ఇటు వాసి లోను మిన్న అయినవే. ఫిరదౌసి, గబ్బిలం, కాందిశీకుడు, ముంతాజమహలు, నేతాజీ, ముసాఫరులు మొదలైన ఖండకావ్య రచనలతో పాఠకలోక ప్రాచుర్యాన్ని చూరగొన్న కవి జాషువా. వీటిల్లో "గబ్బిలం" రెండు భాగాలున్న ఖండకావ్యం. మొదటి భాగంలో సుమారు 117 పద్యాలు, రెండవ భాగంలో 142 - మొత్తం 259 పద్యాలున్న గబ్బిలాన్ని లఘుప్రబంధం అనవచ్చు. మొదటి భాగం 1941 లోను, రెండవ భాగం 1946 లోను రచించబడ్డాయి.


"గబ్బిలం"- స్వీయచరిత్ర నివేదనాత్మకం

"Best poetry is always autobiographical"(ఉత్తమ కవిత ఎప్పుడూ స్వీయ చరిత్ర నివేదనాత్మకమే) అని అంటాడొక అంగ్ల విమర్శకుడు. దానికి అక్షర సాక్ష్యం గబ్బిలం.

కుల మత విద్వేషంబుల్
తలసూపని తావులే కళారాజ్యంబుల్
కళ లాయుష్మంతములై 
యలరారెడు నెలవు స్వర్గమగు చెలికాడా!

నా కథ 1-127)

కళాకారులందరిదీ ఒకే జాతి, ఒకే మతం, ఒకే కులం. ఆ విశాల దృక్పథం లోపిస్తే కళలు బతకవు. ఒక వేళ బతికినా బట్టకట్టవు. జాషువా చిన్నతనం నుంచి అటు వ్యక్తిగా, ఇటు కళావేత్తగా కుల వివక్షతకు నలిగిపోయాడు. 'నా కథ'లోని 'వ్యధా ఘట్టములు' ఆ గుండెకోతకు, ఆ ఆవేదనకు అక్షర రూపాలు. "లోకం నా వంక కోరగా, వారగా చూచింది, అనాదరించింది, అసత్కరించింది, సత్కరించింది, దూరపర్చించి, చేరదీసింది" (నా కథ - ఒక మాట). జాషువా జీవిత ప్రస్థానాన్ని ఈ మాటలు తెలియచేస్తాయి. అయన కవితా సృష్టికి ఇదే ప్రత్యక్ష నేపథ్యం.

ఒక రోజు బాల జాషువా వినుకొండ వీధిలో వెళుతుండగా, అగ్రవర్ణానికి చెందిన మరో బాలుడూ ఆ వీధినే పోతూ "నన్ను తాకకు, దూరంగా పో!" అని ఈసడించుకున్నాడట. ఆ అవమానాన్ని భరించలేక తన ఆవేదనను తల్లిముందు తోడుకున్నాడు. తల్లి బాలుని కన్నీరు తుడిచింది. తన కళ్ళలో నీళ్ళుబుకుతున్నా తమాయించుకుంది. ఆ పిల్లవాడే మరికొంచెం ఎదిగి కవిత లల్లటం మొదలు పెట్టాడు. బాలకవిగా తాను 'వ్రాసిన వ్రాతలు గని సెహబాసను వాడొకడు లేక వ్యధ'కు గురి కావలసి వచ్చింది. దానికి తోడు, 'వాదన చేసి కాదనెడి పాటి సమర్థత' లేని చిన్ననాడు తన ఊళ్ళోని వైష్ణవ పూజారి 'ఇతర జాతులు కైతలల్ల రాద'ని 'పురాణ యుగధర్మ సూత్రాల'ను వల్లించి, జాషువా లేత మనసును గాయపరిచాడు. దీనిని మించి, జాషువా హృదయాన్ని కలచివేసిన సంఘటన మరొకటి ఆయన కవితా వ్యాసంగ ప్రారంభదినాలలోనే జరిగింది. తన ఆశుకవితా నైపుణ్యంతో కొప్పరపు సుబ్బారావు వినుకొండలో జరిగిన ఒక సభలో ప్రజలను ఉర్రూత లూగించాడు. జాషువా ఆయన్ని అభినందిస్తూ పద్యాలు అప్పటికప్పుడు ఏవో గిలికాడు. వాటిని ఆయనకు అందజేయటానికి భయపడుతూ, సభాస్థలి దగ్గర తారట్లాడే జాషువాని ఆయన భ్రాహ్మణమిత్రుడొకడు వేదిక దగ్గరకు తీసుకువెళ్ళాడు. సుబ్బారావు పద్యాలు తీసుకొని చదివి, సహృదయంతో బాలకవిని అభినందించాడు. సభలో 'గుసగుసలు' బయలుదేరాయి. 'అభాగ్యుడీ నిమ్నజుడు సభలోని కెట్టు జొరబడెన'ని పదిమందీ ఉద్దతులై, లేచిపోయారు.


అలనాడు భారత కాలంలో అస్త్రవిద్యా ప్రదర్శన లో కర్ణుడికి జరిగిన అవమానమే తిరిగి ఆనాడు కీ జరిగింది. ఆ రోజంతా ఇల్లుదాటి బైటికి రాకుండా, భోజనం చేయకుండా, తనలో తానే ఏడ్చు కుంటూ దుఃఖంలో తలమున్కలై పొద్దుపుచ్చాడట. ఇలాంటి సన్నివేశాల నెన్నింటినో ఆయన కవిగా నిలదొక్కుకునే రోజులలో ఎదుర్కొన్నాడు. "కుల భేదానికి నువ్ మెదలెడు దేశమిద్ది నిను మెచ్చదు, మెచ్చిన మెచ్చకున్న శారద నిను మెచ్చె మానకుము ప్రాప్త కవిత్వ పరిశ్రమంబులున్" (నా కథ)- అని జాషువా భుజం తట్టి కందుకూరి వీరేశలింగం అన్న మాటలు జాషువాకు అదర్శాలయ్యాయి.

చక్కని కవితకు కులమే
యెక్కువ తక్కువలు నిర్ణయించినచో నిం
కెక్కడి ధర్మము తల్లీ? 
దిక్కుం జరవేదికా ప్రతిష్టిత గాత్రీ

(ఖం.కా.భాగం-2, సందే)

అలాగే 1933-34 సం. ల ప్రాంతంలో ఒకనాడు జాషువా వెంకటగిరి రాజైన యాచేంద్రభూపతిని సందర్శించటానికి రైల్లో వెళ్తున్నాడు. రైల్లో పరిచయమైన వ్యక్తి జాషువా కవి అని తెలుసుకొని అయన కవితలు విని ఎంతో సంతోషించాడు, జాషువాను ఎంతగానో అభినందించాడు. ఇంతలో ప్రసంగం కులంమీదకు మళ్లింది. జాషువాని ఆయన 'మీదే కుల'మని ప్రశ్నించాడు. జాషువా చెప్పాడు; అంతే అప్పటి వరకు జాషువాని పొడిగిన వ్యక్తే చివాలున లేచి వెళ్లిపోయాడు. గుండెను పిండే ఈ సంఘటననే జాషువా రాజుకు ఇలా చెప్పుకొని వాపోయాడు.


నా కవితావధూటి వదనంబు నెగాదిగ జూచి రూప రే
ఖా కమనీయ వైఖరులు గాంచి 'భళిభళి'! యన్నవాడె మీ
దే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో
బాకున గ్రుమ్మినట్లగును పార్థివచంద్ర! వచింప సిగ్గగున్ 

(ఖం.కా.భాగం-2)


ఇలాంటి సన్నివేశాలకు జాషువా జీవితంలో కొదవలేదు. అంతేకాదు, అన్నింటి కంటే విచిత్రమైంది - అటు క్రైస్తవ సోదరులచేత వెలివేయబడ్డాడు. ఇటు సవర్ణ హిందువుల చేత ఈసడింపబడ్డాడు. ఇంటి నుండి తరిమివేయబడ్డాడు. ఇదంతా కేవలం 'కులం కుట్రే'! కవిగా ఆయన లబ్దప్రతిష్టుడైన తర్వాత కూడా సభల్లో, సన్మానాల్లో ఈయన గురించి ప్రసంగించే వక్తలు 'పంచమ జాతిలో పుట్టి ఇంత గొప్పకవిగా రాణించినవాడు' అని అంటుంటే జాషువా గుండెలు అవిసిపోయేవి. 'నన్ను జాషువాగా ఎందుకు గుర్తించరు?' అని ఆయన అంటుండేవాడట. ఇలా ఆయన జీవితంలో కుల ప్రాతిపదిక మీద ఎన్ని దూషణాల్ని, తిరస్కారాల్ని ఎదుర్కొన్నా, వాటిని లెక్కచేయలేదు! ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నాడు.

గవ్వకు సాటిరాని పలుగాకుల మూక లసూయ చేత న
న్నెవ్వెధి దూఱినన్ ననువరించిన శారద లేచిపోవునే
యవ్వసుధా స్థలిం బొడమరే రసలుబ్ధులు ఘంట మూనెదన్
రవ్వలు రాల్చెదన్ గరగరల్ సవరించెద నాంధ్ర వాణికిన్ 

(నా కథ)


ఇలాంటి విశ్వాసంతో, మొక్కవోని ధైర్యంతో జాషువా తనను ఈసడించిన సమాజానికి ఎదురొడ్డి కవితలు రచించాడు. "విశ్వమానవ సౌభాతృత్వం, నిర్మత, నిర్జాతి సంఘం నా ఆదర్శం. ఒక జాతికి మతానికి చెందిన కవిత్వాలు మంచివి కావు. అవి కవిత్వాలు కావు, అలాటివి వీలునామా కవిత్వాలంటాను. నా భావం సామాన్యులకు అందివ్వడానికి ప్రయత్నించాను. గహన సంచారంలేని కవిత్వం నా లక్ష్యం" అని జాషువా డు. ఈ ఆదర్శంతోనే ఆయన తన కావ్యాలన్నీ రాశాడు. ముఖ్యంగా 'గబ్బిలం' కావ్యం. అవి ఆయన నిరాశ్రయుడిగా గుంటూరులో కాలం గడుపుతున్న రోజులు. ఒక పాడుబడిన ఇల్లు దొరికింది, అదీ స్మశానానికి పక్కనే. గబ్బిలాలకు ఆటపట్టయింది ఆ ఇల్లు. రాత్రిళ్ళు చిన్న ఆముదపు దీపం. ఆ అంధకారంలో ఆయనకి గబ్బిలాలే నేస్తాలు.

ముక్కు మొగమున్న చీకటి ముద్దవోలె
విహరణము సేయసాగె గబ్బిలమొకండు
దాని పక్షాని లంబున వాని చిన్ని
యాముదపు దేపమల్లన నారిపోయె

ఓ వైపు ఆత్మవ్యధ, మరోవైపు కటిక చీకటి. ఇంకో ప్రక్క గబ్బిలాల సంచారం. ఆ విపత్కర పరిస్థితిలో, ఆ ఆవేదనలో రూపుదిద్దుకొన్న ఆలోచనాధార ఫలితమే 'గబ్బిలం' కావ్యం. జాషువా జీవితానుభవ దృశ్యాలే 'గబ్బిలం' రచనకు ప్రత్యక్ష హేతువులు. అందువల్లే 'గబ్బిలం' లోని ప్రతి పద్యంలోనూ ఆత్మీయతా స్పర్శ తొణికిసలాడుతుంటుంది. జాషువా తన వైయక్తిక బాధను, తన జాతి జనుల సమిష్టి బాధనుప్రత్యేకించి పలికినా, అది సాధారణీకరణాన్ని పొందింది. సర్వపాఠక సమాదరణాన్ని ప్రోది చేసుకుంది. తనకీ సమాజానికీ సామరస్యం కుదరలేదు. అంతర్బాహ్య సంఘర్షణల నుంచి కావ్యం ఆవిర్భవించింది. 'కవిత్వానికి బాధ పర్యాయ పద'మంటారు. ఆ బాధ నుంచి విముక్తి చెందటానికే జాషువా గబ్బిలాన్ని కూర్చాడు.

'గబ్బిలం' కావ్యం పై రేడియో ప్రసంగం ఇక్కడ వినవచ్చు

జాషువా ఆత్మకథాత్మక కావ్యం: గబ్బిలం (రెండు)[మార్చు]

- డా. కఠెవరపు వెంకట్రామయ్య

కాలం కంటే రెండడుగులు ముందే!

ఆంధ్ర సాహిత్య వికాసాన్ని ఒకసారి పునఃపరిశీలిస్తే - ఆడది లేకపోతే కృతికి అందం లేదనే భావంతో ధనతృష్ణ వెంటాడగా బృహన్నల వర్గం సంతోషం కోసం ప్రబంధ కవులు అనుత్తమ ప్రణయబంధుర కావ్యాలు రచించటం కన్పిస్తుంది. కవిత చచ్చుదైనా కథ ప్రసిద్ధమైనదైతే కవికి కొంతకీర్తి గలుగవచ్చు. అలాంటి కవిత్వం నెలలు తక్కువైనా బలమైన తిండితో బ్రతికే పాపలాంటిది. "ప్రభువుల పెండ్లి పేరంటాలకు కొంతకాలం ఖర్చయింది. ఆ తరువాత రాణివాసాల్లోని విరహ వేదనల్ని రచ్చకీడ్చింది. అనంతరం అంగాంగ వర్ణనలతో యువతకు ఉచ్చులు వేసింది. 'పాడిన రామకథే మరలపాడి' ఆర్తులను అనాదరిస్తూ-భువన హితాన్ని కోరవలసిన కళాశక్తి స్వార్థ జడదిన ఊరవేయబడింది" అంటాడు జాషువా. ఇదీ మన సంచిత ధన సంపద. ఇక ఆధునిక యుగం.

జాషువా భావకవితా యుగంలో కలం బట్టిన కవి. "దిగిరాను దిగిరాను దివినుండి భువికి" "నా ఇచ్చయేగాక నాకేటి వెరపు" అని కంత నగరాల (ivory towers) లో విహరిస్తూ ఊహాప్రేయసి మీద గేయాలల్లూతూ, ఆ విరహంలో తలమున్కలై "మనసారగా ఏడ్వనీరు నన్ను" అంటూ భావుకవులంతా ఎవరికి వారు యధాశక్తి రోదిస్తున్న కాలమది. అయితే జాషువా భువిని వీడలేదు, దివిలో కాపురం పెట్టనూ లేదు.

పూదోటల మద భంభర 
నాదముల విలాసవతుల నడబెడగుల నా
హ్లాదించు కవులకీ నిరు
పేదల ఆక్రందనములు వీనుల బడునా! 

(ముసాఫరులు)


అని సమకాలీన భావ కవులను నిరసించాడు. అందుకే భావ కవుల కంటే అభ్యుదయ కవులే ఈయనకు ప్రీతి పాత్రులయ్యారు. వర్గ సంఘర్షణ, ఆర్థిక వ్యత్యాసాల నిర్మూలనం, దోపిడీ వర్గాలపై తిరుగుబాటు, సమ సమాజ నిర్మాణం, సమర విముఖత, శాంతిప్రియత వంటి అభ్యుదయ కవితా లక్షణాలు జాషువా కవితల్లో చోటుచేసుకున్నాయి.

మా కవు లాలపింతురు సమంచిత నవ్యయుగో చితంబులై 
యాకటి చిచ్చు లార్చు హృదయ ప్రీతి దారి దయాకధాంశముల్ 

(కాందిశీకుడు)


ఈ అభ్యుదయ దృక్పథమే జాషువాచేత "గబ్బిలం" వ్రాయించింది. దళిత వేదనకు అక్షరాకృతి నిప్పించింది! అసలు "గబ్బిలం" ఇతివృత్తమే అభ్యుదయాంశతో ముడిపడినటువంటిది. భరతమాతకు కడగొట్టు బిడ్డడైన ఒక అరుంధతీ సుతుడు-సమాజంలో పాతుకుపోయిన అంటరాని తనాన్ని, వర్ణ వ్యవస్థలోని క్రూరత్వాన్ని-తన సందేశంగా శివునికి గబ్బిలం ద్వారా విన్నవించుకోవటం ఈ కావ్యేతివృత్తం. రెండు భాగాలుగా సాగిన ఈ కావ్యం తొలి భాగంలో అరుంధతీ సుతుడు తన దైన్యాన్ని విన్నవించుకుంటాడు. సామాజికంగా అనుభవిస్తున్న నిరసనను వ్యక్తం చేస్తాడు. ఆపై గబ్బిలానికి మార్గనిర్దేశం చేస్తాడు. గబ్బిలం విశ్వానాథుని దగ్గరకు పయనమై వెళుతుంది. ఇది ప్రథమ భాగం.


తర్వాత కొన్నాళ్ళకు గబ్బిలం మరలా కనిపిస్తుంది. వెళ్లిన పని "పండే"నని చెప్తుంది. మరలా పంచముడు తన గోడు వినిపించుకొంటాడు. భారత జాతి అనైక్యత, కుల, మతభేదాలు, స్వీయకులంలోని వైరుధ్యాలు, మూఢాచారాలు, దేశాభిమానం రెండవ భాగంలోని అంశాలు. వస్తుభావాల విషయంలో సమకాలీన కవుల కంటే ఒకడుగు ముందుకువేసి, దళిత కవిత్వానికి తెలుగులో బీజం వేశాడు. ఈనాటి 'దళిత కవితావాదకవు'లనేకుల కంటే జాషువా నిర్భయంగా, బలంగా, సూటిగా కవితను చెప్పాడు. కాబట్టే తెలుగు దళిత కవిత్వానికి "ఆది కవి" జాషువా. ఆయన "గబ్బిలం" దళిత కవితకు మేనిఫెస్టో.


'గబ్బిలం' కావ్యం పై రేడియో ప్రసంగం ఇక్కడ వినవచ్చు

జాషువా ఆత్మకథాత్మక కావ్యం: గబ్బిలం (మూడు)[మార్చు]

- డా. కఠెవరపు వెంకట్రామయ్య

గబ్బిలం - ప్రతీక కావ్యం

'గబ్బిలం ' ప్రతీక కావ్యం (Symbolic poem). "కాళిదాసుని మేఘసందేశము మనస్సులో నుంచుకొని నేనీ కావ్యమును రచించితిని. గ్రంథ నామము గబ్బిలము. శ్రోతలకిది కటువుగా దోపవచ్చును. కాని యందలి కథా నాయకుడు ప్రణయ సందేశము నంపును. ఇత డంపునది తుక తుక నుడుకు నశ్రు సందేశము. అతని శిక్షా కాలపరిమితి యొక సంవత్సరము. ఇతని శిక్ష ఆజన్మాంతము, తర తరములు. దీని కవధి లేదు. అతడు మన్మథాగ్ని తప్తుడు, ఇతడు క్షుధాగ్ని పీడితుడు. ఇరువురిలో నితడు దయనీయుడు".


"గబ్బిలం" పీఠిక(విజ్ఞప్తి) లో జాషువా వ్రాసిన మాటలివి. కవి మాటల్ని బట్టి, ఇతివృత్త నిర్వహణాన్ని బట్టి ఇది కాళిదాసు మేఘసందేశానికి అనుసరణ కావ్యమని స్పష్టమవుతుంది. అంటే సందేశ కావ్యం అన్నమాట. అక్కడ మేఘడు సందేశహరుడు. ఇక్కడ గబ్బిలం సందేశ హరిణి. ఇది సందేశ కావ్యమే అయినా, దీనిలో ప్రతీకవాద కవితా తత్త్వఛాయలు పుష్కలంగా ఉన్నాయి. 'గబ్బిలం' అరుంధతీ సుతునికి ప్రతీక. "పామునకు పాలు, చీమకు పంచదార" పోసి పోషించే హైందవ సమాజంలో గబ్బిలం మాత్రం ఒక "అపశకున పక్షి"గా పరిగణింపబడుతోంది. "మృగ పక్షిత్వ విచిత్ర ధర్మముక మూర్తిని దాల్చియున్నట్టి నీ మోముంజూడదు లోకము" అని జాషువానే "ప్రాత పట్టింపు"లను ప్రస్తావించాడు. గబ్బిలాన్ని "వెలివేయబడిన" ప్రాణిగ ఇతర జాతులు కూడా గుర్తిస్తున్నాయి.ఈ లోక రీతిని పాటించే గబ్బిలాన్ని అరుంధతీ సుతుడికి ప్రతీకగా గ్రహించాడు జాషువా. అది వెలుగు చూడలేదు, పంచముల జీవితాల్లో వెలుగు లేదు. వారి చీకటి బతుకుల కది ఒక సంకేతం. వారి దైన్యానికీ, దయనీయతకూ గబ్బిలం తిరుగులేని ప్రతీక. సామాజిక దురన్యాయానికి బలై, సవర్ణ హిందువుల చేత వెలివేయబడిన పంచముని ఆక్రందన గబ్బిలం కావ్యానికి ఆయువు పట్టు.


తిరిపపు దమ్మిడీ తనివి దీపముగా వెలిగించి, దీపమే
యెరుగని నా కుటీరమున నృత్యమొనర్చు మహాపిశాచి, చిం
పిరితల చిక్కులమ్మ, తరి బీయతు జేసెడి నన్ను, భూమికిన్
బరువుగ గబ్బిలాయిగ! తృణంబుగ! జుల్కనగ! హుళక్కిగా


సమకాలీన సామాజిక దర్పణం

ఒక కవి కవితాస్థాయిని చైతన్యాన్ని అతడు ఎంచుకొన్న వస్తువు, భావజాలం, అభివ్యక్తి !ఒక బలమైన సామాజిక భూమిక లేకపోతే, ఎంత గొప్ప కవిత్వం వ్రాసినా అది నేల విడిచిన సామే అవుతుంది.

రచయిత మౌలికంగా సంఘజీవి. కాబట్టి అతని ఆలోచన ఎంత స్వతంత్రించినా, అది సాంఘికమైనదే అవుతుంది. సమాజంలోని ఏ చలనానికైనా అప్రమత్తుడైన ఏ రచయిత (conscious writer) అయినా స్పందిస్తాడని చెప్పడం పరిపాటి. అలా నూటికి నూరుపాళ్ళు స్పందించి, కవిత లల్లినవాడు జాషువా! ఆయన గబ్బిలం సమాజంలో పుట్టింది! సమాజాన్ని ఎత్తి చూపింది. సామాజిక అసమానతలను చీల్చి చెండాడింది. మానవతకు అర్థం చాటి చెప్పింది.

జాషువా పుట్టే నాటికి(1895) భారతదేశం బానిసత్వంలో మగ్గుతోంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదం బలం పుంజుకొంటోంది. ఆనాడు దేశం పరాయి పరిపాలనలో మగ్గడం అలా ఉండగా, సమాజం భయంకరమైన రుగ్మతులతో లుక లుక లాడిపోతూ వుంది.

స్వపరిపాల మన్న శబ్దంబు దేశంబు
వీనుల విందుగా వినకముందు
ఘన దురాచార సాగర మగ్నమై ప్రజా
బాహుళ్య మొడ్డున పడకముందు
కొలత గింజల శాసనంబులకు విరచి
కొట్లలో పంట తలదాచుకొనకముందు
ప్రభవ మందితి

అని జాషువా స్వీయచరిత్ర: నా కథ లో చెప్పుకున్నాడు. బాల్యం నుంచే బ్రిటిష్శ్ పెత్తందారీ తనాన్ని నిరసించాడు.

సహింపదయ్యె శైశవమందె నా చిన్ని
చిత్తంబు తెలవారి పెత్తనంబు

అన్నాడు. తండ్రి బాప్టిజాన్ని (Baptism) పొంది తెల్లవారి దగ్గర పనిచేయటాన్ని జీర్ణించుకోలేకపోయాడు.

తానము నంది క్రైస్తవ మతంబున జేరి కులంబు గోత్రమున్
మానిన వెర్రిగొల్లడ వమాయక మూర్తివి॥॥।

జాషువాలోని ఈ దేశాభిమానం "గబ్బిలం" ద్వితీయ భాగంలో ప్రస్ఫుటమౌతుంది. ఈ భాగ రచనాకాలం నాటికి - "గాంధీ ఉద్యమం చేత సీమగడ్డకు కన్నులు చెమ్మగిల్లాయి, ముతక వస్త్రానికి మర్యాద పొటమరించింది. వడకు నూలు పగ్గాలు పేనించి వేటగాడు ఉచ్చులె వేశాడు. స్వరాజ్యమనే సింహరాజు అందులో చిక్కుకుంటాడో లేక తప్పించుకుంటాడో" అని సాలోచనగా అంటాడు. దీన్లో కూడా తన వ్యధని పలుకుతాడు.

జాతీయోద్యమ యుద్ధరంగ మహితోత్సాహ ప్రతిధ్వానముల్
కూలీల్ బెట్టుచు నాల్గు జాతులకు గగ్గుర్పాటు గల్పించెడిన్
స్వాతంత్ర్యంబను స్వర్గసౌఖ్యమున మా భాగంబు మాకిత్తురో
ఖాతాలేదని త్రోసిపుచ్చెదరో! వక్కాణింపవే చెల్లెలా!

మెత్తని అధిక్షేపంతో హృదయానికి హత్తుకొనేటాట్లు చెప్పటం జాషువా కలం సొత్తు. ఆయన అచ్చమైన గాంధేయవాది. కాబట్టే -

నిమ్నజాతుల కన్నీటి నీరదములు
పిడుగులై దేశమును కాల్చివేయు ననుచు
రాట్నమును దుడ్డుకర్ర కరానబూని
దెసల దోచె గుజరాతు ముసలి సెట్టి

అంటాడు. ఇలా దేశస్థితిని తెలియజేస్తూనే ప్రసక్తానుప్రసక్తంగా సామాజిక పరిస్థితిని వివరించాడు.

ఇక "గబ్బిలం" కావ్యానికి ప్రాణవాయువు సమకాలీన సాంఘిక దుస్థితి. అనాది కాలం నుంచి, మనిషికీ మనిషికీ మధ్య అడ్డుగోడలు పెట్టి, మానవతను మటుమాయం చేసిన వర్ణవ్యవస్థ "వేయి పడగ"లై విజృంభిస్తున్న కాలం అది. కులం, సంపద- వ్యక్తి సాంఘిక ప్రతిపత్తి కి కొలబద్దలై మన్నుతున్న రోజులవి. "భారత వీరుడు" ఆ రెంటిని హరించి పంచముని పిప్పిచేస్తున్న దుర్భరస్థితి అది. ఎవరైతే తనను నిరాదరణకు గురిచేస్తున్నారో వారి "పాదము కందకుండ" చెప్పులు కుట్టి జీవనము సాగిస్తున్నాడు అరుంధతీ సుతుడు. అటువంటి వాని సేవకు భారతావని 'అప్పు పడ్డది'

వాడు చెమటోడ్చి ప్రపంచమునకు
భోజనము పెట్టు, వానికి భుక్తిలేదు

ఇదీ వాని స్థితి. అస్పృశ్యులు పండించే ధాన్యాన్ని ఆలయాలలో దేవునికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కానీ ఆ ధాన్యం పండించే వారికి మాత్రం ఆలయ ప్రవేశం లేదు. వ్యక్తి స్వేచ్చనూ, మానవతా విలువల్ని నాశనం చేస్తున్న, మనిషికీ మనిషికీ అగాధాన్ని సృష్టిస్తున్న వర్ణవ్యవస్థ మీద ధ్వజమెత్తి సమతా సిద్ధాంతాన్ని ప్రబోధించాడు జాషువా.

'గబ్బిలం' కావ్యం పై రేడియో ప్రసంగం ఇక్కడ వినవచ్చు

-

జాషువా ఆత్మకథాత్మక కావ్యం: గబ్బిలం (నాలుగు)[మార్చు]

- డా. కఠెవరపు వెంకట్రామయ్య

ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు
నలువురు కుమారులనుట విన్నాముగాని
పసరము కన్న హీను డభాగ్యుడైన
యైదవ కులస్థు డెవరమ్మా! సవిత్రి 

అసలే చాతుర్వర్ణ వ్యవస్థ. అందులో మరలా అయిదవ కులమని ఇంకో కుల మేమిటి? దీన్ని ఎవరు సృష్టించారు?.. సమాధానం లేనివి కావు ఈ ప్రశ్నలు. మన దేశంలోనే కాదు. ఇతర దేశాల్లో కూడా వర్ణ వైషమ్యాలు లేకపోలేదు. అయితే హైందవ సమాజంలో ఈ కులాల వ్యవస్థ "నిచ్చెన మెట్లు పద్ధతి" (Graded System)లో ఉండి - ఒక కులం అగ్రవర్ణం, మరో వర్ణం అథమ వర్ణం అని వరుసగా నిర్ణయించి ఆ చట్రంలో తరతరాలుగా మార్మికంగా, నిరాటంకంగా దోపిడీ సాగిస్తున్న వాళ్ళని నిలదీస్తాడు జాషువా.

ఆ అభాగ్యుని రక్తంబు నాహరించి
యినుపగజ్జెల తల్లి జీవనము సేయు!
గసరి బుసకొట్టు నాతని గాలిసోక
నాల్గు పడగల హైందవ నాగరాజు

పాములకు గాలి ఆహారం అనేది జనశ్రుతి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములనే నాలుగు వర్ణాలను పడగలుగా కల్గిన హైందవ నాగరాజు, తాను వాయుభక్షకుడే అయినా - పంచముని గాలి సోకితే చాలట! కసరి బుసకొడతాడట. రేయింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసికొని, తమ అభ్యున్నతికి ఏ పంచముడైతే శ్రమిస్తున్నాడో, అతన్ని దరిచేరనీయకపోవటం, అస్పృశ్యత సాకుతో దూరం చేయటం జాషువా హృదయాన్ని కలచివేశాయి. గుండె కుతకుతలాడింది. ఆ అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావానే 'గబ్బిలం' కావ్యం.

కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి
స్వార్థలోలురు నా భుక్తిననుభవింత్రు
కర్మమన నేమొ, దానికీ కక్షయేమొ
ఈశ్వరుని చేత ఋజువు చేయింపవమ్మ!

అని గబ్బిలాన్ని కోరుతాడు! హేతువాది, వాస్తవికతావాది అయిన జాషువా ప్రశ్న ఇది. ఔషధంలేని అస్పృశ్యతా జాడ్యానికి వ్యతిరేకంగా జాషువా సంధించి విడిచిన నిశిత బాణం ఇది. ఆయన ఆర్థిక చైతన్యానికీ, తాత్త్విక చైతన్యానికీ నిదర్శనాలు ఈ పంక్తులు. "సహజమైన ప్రకృతి సౌఖ్యంబు నొక వ్యక్తి దొంగిలించి మనుట దొసగు నాకు" అని దోపిడీ తత్వాన్ని సామాజిక అక్రమంగా గుర్తించిన జాషువా పతితులు, భ్రష్టులు, బాధాసర్ప దష్టులు అయిన పీడిత పంచమ జాతి పక్షపాతి.

ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుః
ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెదుకు విదల్పదీ భరత మేదిని ముప్పది మూడుకోట్లదే
వత లెగబడ్డ దేశమున భాగ్యవిహీతుల క్షుత్తులారునే

"వాని నుద్ధరించు భగవంతుడే లేడు మనుజుడెట్లు గనికరించు" అన్న అభిప్రాయాన్ని వ్యాఖ్యానిస్తున్నాయి పై పంక్తులు. గబ్బిలానికి మార్గనిర్దేశం చేసేటప్పుడు కూడా నీ ప్రయాణంలో సుడిగాడ్పులెదురైతే "నిలువవచ్చున్ ధర్మసత్రాలలో పిడుగులు వడ్డ" అని చెబుతూ, ఎలాంటి ప్రాణాపాయ సమయంలోనైనా "ప్రవేశ యోగ్యతలు పాపిన్నాకు లేవచ్చటన్" అని "పురుగుంబుట్ర"కంటే హీనమైన పంచముని దుస్థితిని వ్యక్తీకరిస్తాడు. ఈ దేశంలో పశుపక్ష్యాదులకున్న గౌరమన్నా పంచములకు లేదనటం జగమెరిగిన సత్యం.

వాని తలమీద బులిమిన పంకిలమును
గడిగి కరుణింప లేదయ్యె గగనగంగ

గంగ కల్మషహారిణి అంటారు. ఆ విషయంలో ఇక ఆకాశగంగ విషయం చెప్పనక్కరలేదు. మరి అలాంటి ఆకాశగంగ కూడా ఆ పంచముడి నెత్తిమీద హైందవ సమాజం పులిమిన బురదను కడిగి దయచూపలేదట. ఎంత అమానుషం! ఎంత క్రూరం!

ఈ వర్ణ వ్యవస్థలోని అక్రమాన్ని మరింత వ్యంగ్యంగా గబ్బిలంతో చెప్పే మాటల్లో చెబుతాడు.

ఆలయంబున నీవు వ్రేలాడు వేళ
శివుని చెవి నీకు గొంతచేరువుగ నుండు
మౌని ఖగరాజ్ఞి! పూజారిలేని వేళ
విన్నవింపుము నాదు జీవిత చరిత్ర!

దేవుడు కరుణించినా పూజారి వరమియ్యడనేది పాత బడ్ద సామెత. "అమ్మా! గబ్బిలమా! శివుడికి పంచముల ఆక్రందనలు విన్నవించే సమయంలో పూజారి గనక విన్నాడంటే నీకు ప్రాయశ్చిత్తం తప్పదు. అంతెందుకు, పూజారికి ఆ పరమ శివుడు కూడా భయపడతాడు. నీవు విన్నవించే విషయం పూజారికి తెలిసిందని ఆ దేవదేవుడికి తెలిస్తే 'అతడు కూడా' నీమీద కోపగిస్తాడమ్మా! కాబట్టి పూజారి విషయం జాగ్రత్తగా చూసుకో" అని హెచ్చరిస్తాడు. ఇలా ప్రతి పద్యంలో జాషువా పాఠకుల కళ్ళముందు ప్రత్యక్షమవుతాడు. సామాజిక రంగంలోనే కాదు కళారంగంలో కూడా "పుట్టరాని చోట పుట్టిన" కారణంగా తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపుతాడు జాషువా.


ఎంత కోయిల పాట వ్యధ యయ్యెనో కదా!
చిక్కు చీకటి వనసీమలందు,
      ఎన్ని వెన్నెలవాగు లింకి పోయెనో కదా!
      కటిక కొండల మీద మిటకరించి,
ఎన్ని కస్తూరి జింక లీడేరెనో కదా!
మురికి తిన్నెల మీద పరిమళించి,
      ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనో కదా!
      పండిన వెదురు జొంపములలోన,
ఎంత గంధవహన మెంత తంగెటి జున్ను
ఎంత రత్నకాంతి ఎంత శాంతి
ప్రకృతి గర్భమందు! భగ్నమైపోయెనో
పుట్టరాని చోట పుట్టుకతన


కవికోకిల బిరుదాంకితుడు జాషువా. ఆయన కవితా మాధుర్యాన్ని ఆస్వాదించిన వారే కోకిల 'పంచమ స్వరం'లో కూస్తుందని శ్లేషల్ని ఆశ్లేషించి, భాషా ప్రౌఢిమ ప్రదర్శించి, తమ అక్కసు చాటుకోలేదా? అయినా సాహితీ ప్రియుల హృదయ ఫలకాల మీద తన ముద్రను భద్రపరుచుకొన్నాడనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అయినా సృజనాత్మకత (creativity)కి కూడా కులమతాల మలాములంటించిన 'భారతీయత'కు మంగళహారతులు పట్టవలసిందే మరి!

'గబ్బిలం' కావ్యం పై రేడియో ప్రసంగం ఇక్కడ వినవచ్చు

జాషువా ఆత్మకథాత్మక కావ్యం: గబ్బిలం (ఐదు)[మార్చు]

- డా. కఠెవరపు వెంకట్రామయ్య

అయితే ఇక్కడ చెప్పుకోవలసిన మరో విశేష లక్షణం జాషువాలో ఉంది. హైందవ సమాజంలోని దారుణమైన అస్పృశ్యతా సమస్యను చిత్రించిన జాషువా కవే పంచముల్లోని అంతర్భేదాల్ని ఎండగడతాడు.

కలదమ్మా వ్రణమంటరానితన మాకర్ణింపు మీ ఇండియా
పొలమందుంగల మాలమాదిగలకున్ భూతేశుడే కాదు కృ
ష్ణులు, కృష్ణున్ని రసించు దైవములు క్రీస్తుల్, మస్తుగా బుట్టినన్
కలుపన్నేరరు రెండు జాతులను వక్కాణింప సిగ్గయ్యెడిన్

అని వ్యధ చెందుతాడు. అగ్ర వర్ణాల దౌష్ట్యాన్ని ఎంత నిర్భయంగా ఖండించాడో, అంతిమ వర్ణాల అజ్ఞానాన్ని అంత నిష్పాక్షికంగా నిరసించాడు జాషువా. ఒకవైపు సవర్ణ హిందువుల దౌష్ట్యం పాము పడగలై బుసలు కొడుతుంటే, మాలలమనీ, మాదిగలమనీ 'ఐకమత్యాన్ని' మరచి కుమ్ములాటలో మునిగితేలే వారిని కలపటం ఎవరికీ సాధ్యం కాదని హెచ్చరిస్తాడు. అది నిజమే! కవి రాసిన అర్థశతాబ్దం తర్వాత కూడా ఆ స్థితిలో అడుగు ముందుకు వేయలేకపోవటానికి ఆత్మ విమర్శనం అవసరం కదా? కవి 'క్రాంతదర్శి' అనటానికి వేరే నిదర్శనం కావాలా?


మత వైషమ్య నిరసనం, అస్పృశ్యతా నిరసనం, అంధ విశ్వాస నిరసనం, దారిద్ర్య నిరసనం అనే నాలుగు స్తంభాల పైన జాషువా కవితా సౌధం నిలబడింది। ఆంతర్యాన్ని పరిశీలించటం, అసమానతను ప్రశ్నించడం, అన్యాయాన్ని ప్రతిఘటించడం - అయన కవిత్వానికి ఆయువు పట్టులు.

ముసుగులో గుద్దులాటలు పొసగవింక 
హక్కు కలదయ్య ప్రశ్న సేయంగ నిన్ను!

అని సూటిగా భగవంతుణ్ణైనా ప్రశ్నిస్తాడు. ఈ చైతన్యంతో జాతి, మత, కుల శృంఖలాల్ని చేదించుకున్న జాషువా తాను "విశ్వనరుణ్ణి" అని ఉద్ఘాటిస్తాడు.

కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చి
పంజరాన గట్టువడను నేను
నిఖిలలోకమెట్లు నిర్ణయించిన
నాకు తరుగులేదు విశ్వనరుడనేను

(ఖం.కా.భాగ।5.నేను)


కరుణ వీరరస కావ్యం:

అభ్యదయ కవిత్వంలో కరుణ వీరరసాలు సమ్యక్సమ్మేళనం చెంది కన్పిస్తాయి. భూత, వర్తమాన కాలాల్లోని సామాజిక అసమానతల్ని, దోపిడీని గుర్తించి, నిరూపించి, ఇప్పుడైనా వాస్తవాన్ని గ్రహించి, భవిష్యత్తులో ప్రగతి పథం వైపు - ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి సాగిపొమ్మని చెబుతుంది, అభ్యదయ కవిత. స్థితి నిరూపణలో కరుణం, మార్గనిర్దేశంలో వీరం - ఈ రకం కవితల్లో ధ్వనిస్తాయి. జాషువా తన కవితల్లో కరుణ రసం లోంచి వీరరసాన్ని పొంగించాడు.

కరుణరస మొండె కఠిన రాక్షసముల్
హృదయములను గలచి ముదము గూర్చు
వేడి కంటె నీటి విలువ సహజమైన
చలువ లీను అశ్రువులకు లేదు

(ముసాఫర్లు)


జాషువా అక్షరాల్లో చిందే కన్నీళ్ళు అగ్నికణాలు. నిమ్నజాతుల కన్నీటి నీరదాలు పిడుగులై దేశాన్ని కాల్చివేస్తాయని నొక్కి వక్కాణించే విస్ఫులింగాలు. "తల వాక్రుచ్చగరాని నెత్తుటి సిరా"తో రాసిన గబ్బిలం 'ఇద్ద కరుణా పరిణద్దరస ప్రబంఢము"గా 'బాష్ఫ కణాభిరామము' గా రూపెత్తింది.

జనులం చీలిచి పిప్పిజేసెడు దురాచారంబులన్ గాల మ
ట్టని విద్యాబలమేల? విద్యయన మౌఢ్యవ్యాఘ్రి కింపైనచో
జనమా? మోసపు వ్రాతకోతలకు రక్షాబంధమా? ఎందుకీ
మనుజత్వంబు నొసంగలేని చదువుల్ మైరేయపుం మైకముల్

ఈ విధమైన భావచాలనం జాషువా కవిలోని ప్రతిఘటనాత్మక వైఖరిని పట్టి ఇవ్వటం లేదూ? 'ఉరము నిక్క గల్కి యుద్రేకమొదవించు నవ్యకవి'లాగా జాషువా విప్లవాన్ని ప్రకటించలేదు. సంయమనాన్ని ప్రకటించాడు.

ధర్మ సంస్థాపనార్థంబు ధరణిమీద
నవతరించెదననె నభవుని తండ్రి
మునువు జన్మించి నెత్తికెత్తినది లేదు
నేడు జన్మింపకున్న మునిగినది లేదు

అని కరాఖండిగ చెబుతాడు. శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు యుగ యుగంలోనూ సంభవిస్తానన్న ఆ శ్రీమహావిష్ణువు తొమ్మిది అవతారాల్లో ఎంతమంది రాక్షసుల్ని సంహరించాడో కానీ, ఆ రాక్షసుల్ని మించిన అభినవ రాక్షసులు కులమతాలనే ఆయుధాలతో జనుల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. మరి వాళ్లని అంతం చేయటానికి ఆ శ్రీమహావిష్ణువు ఎప్పుడు పుడతాడో? అసలు పుడతాడా? పుట్టి ఒరగబెట్టింది ఇంతకు ముందులేదు. ఇక మీదట ఒరుగుతుందన్న నమ్మకం లేదు. అవకాశవాదులు తమ స్వార్థం కోసం కల్పించుకొన్నవే ఈ పురాణాలు, ఈ కథలు అని జాషువా తీర్పు.

'గబ్బిలం' కావ్యం పై రేడియో ప్రసంగం ఇక్కడ వినవచ్చు

జాషువా ఆత్మకథాత్మక కావ్యం: గబ్బిలం (ఆరు)[మార్చు]

- డా. కఠెవరపు వెంకట్రామయ్య

వైరుధ్యంలో వైశిష్ట్యం:

అభ్యుదయ కవితా తత్వాన్ని జీర్ణించుకొన్న జాషువా సమకాలీన అభ్యుదయ కవుల్లా గేయ చందస్సునూ, వచన కవితా రీతినీ చేపట్టలేదు. శిష్ట వ్యావహారికాన్ని స్వీకరించనూ లేదు. సరళ గ్రాంధికాన్ని, ప్రాచీన పద్య చందస్సునూ సమాశ్రయించాడు. అయినా కండగల పద్యరచన జాషువాది. సమకాలీన పద్యకవుల్లో జాషువా పద్యం పొందినంత విస్తృత ప్రచారం మరేకవి పద్యం పొందలేదనటం అతిశయోక్తి కాదు! సహజోక్తే! పద్య శిల్పం జాషువాదే. అభ్యుదయ కవుల్లో శ్రీశ్రీ గేయానికి ఎంత ప్రచారం, ప్రాశస్త్యం తెచ్చాడో, జాషువా పద్యానికి అంతటి జవజీవాల్ని తెచ్చిపెట్టాడు.


కవిత్వానికి రూపం(form) కంటే వస్తువే ముఖ్యమని నిరూపించిన కవి జాషువా. వస్తువు(content) మారినపుడు రూపం కూడా మారటం సర్వసాధారణమైన సాహిత్య సూత్రం. అయినా ఆ సార్వత్రిక సూత్రాన్ని అధిగమించి కాలం పరీక్షలలో నిలిచి గెలుపొందింది జాషువా పద్యం. పద్యం తెలుగువాడి సొంత సొత్తు. దాన్ని పసిగట్టి ప్రజల గుండెల్ని దోచుకున్నాడు. కాలానికి ఎదురొడ్డి నిలిచాడు. తన కవితను బ్రతికించుకున్నాడు. ఆయన పద్యంలోనే వ్రాశాడనీ, గ్రాంధిక భాష వాడాడనీ ఈ సహృదయ పాఠకుడు ఆయనకు దూరం కాలేదనటం వాస్తవం. చెప్పే విషయం చేవగలదై, చెప్పే విధానం జీవద్వంతమైతే పాఠకుడు ఎందుకు ఆదరించడు? అవి రెండూ చేతగాని కవుల కావ్యాలు పేజీల లెక్కన కాదు, కేజీల లెక్కన మిగులుతాయి.


జాషువా - భవిష్యత్సమాజ దర్శనం:

"జీవితం నాకు ఎన్నో పాఠాలను నేర్పింది. నా గురువులు ఇద్దరు - పేదరికం, కులమత భేదం. ఒకటి నాకు సహనాన్ని నేర్పితే, రెండవది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే గాని బానిసగా మాత్రం మార్చలేదు. దారిద్ర్యాన్ని, కులభేదాన్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలిచాను. వాటిపై కత్తి కట్టాను. అయితే కత్తి నా కవిత. నా కవితకు సంఘం పై ద్వేషం లేదు. దాని విధానం పైనే నా ద్వేషం" (మా నాన్న।పు।10) - అన్నాడు జాషువా. అంటరానితనంలోని అవమానాన్ని, దారిద్ర్యంలోని బాధను తాను స్వయంగా అనుభవించాడు. తన తోటి సోదరులు, బంధువులు జీర్ణ కుటీరాలలో ఉంటూ రోజుకూలిపై అర్థాకలితో మాడుతూ బ్రతక లేక బ్రతికే వారి బాధలను, జీవిత గాధలను ప్రత్యక్షంగా చూశాడు. దానికి రూపకల్పనే 'గబ్బిలం'.


తెలివికి కలిమిలేములతో నిమిత్తం లేదనీ, ప్రతిభను కులమతాల తక్కెడలో తూచరాదనీ విశ్వసించి, కులమతాల కతీతమైన మానవత తొణికిసలాడే మరో ప్రపంచం కోసం అర్రులు చాచిన జాషువా, 'గబ్బిలం' కావ్యంలో తాను ఎలాంటి సమాజాన్ని కోరుకుంటున్నాడో సూచించాడు. ప్రజలను బాధపెట్టే బహుదేవతలు లేని చోటు, నవనీత సమానమైన కవుల కమ్మని వాక్కు భయము లేకుండా వెల్లివిరిసే నేల ప్రభుత్వ పరంగా - పాలకవర్గాలు - సృజనాత్మక రచనల మీద 'ఆంక్షలు-నిషేధాలు' విధించని చోటు - ఎంతముందు చూపు జాషువాది? సంతానానికి భేదభావాలు నేర్పని తల్లిదండ్రులున్న స్థలం, తోడునీడలేని దుర్బలుల కాచే ప్రదేశం - ఇలాంటి దేశాన్ని, సమాజాన్ని కోరుకున్నాడు జాషువా.


భోగులాహరించు భుక్తి కన్నుల జూచి
పరమ పేదలు దుఃఖపడనిచోటు,
సాంఘికాచార పంచాస్య గర్జనమున
బెదరక జ్ఞానంబు పెరుగుచోటు,
      జాతి వైషమ్య రాక్షస పదాహతి చేసి
             కందక కళలు పెంపొందుచోటు,
      పరిపాలక క్రూరతర కరాసికి లొంగి
             పోక స్వేచ్ఛాలక్ష్మి పొదలు చోటు,
అనద బిడ్డలు జూడ నెయ్యింపు సుతుల 
ముద్దులాడని గుణనిధుల్ బుట్టుచోటు
చెప్పగదమ్మ చూచివచ్చితివె నీవు
నిశ్చయింబుగ వాసముండెదను నేను 


జాషువా ఆశించిన 'కొత్తలోక'మిది. ఇటువంటి భావాలతో 'గబ్బిలం' నిజమైన సామాజిక వాస్తవికతావాద (social realistic) కావ్యం. కర్మ సిద్ధాంతం నుంచి కవిత్వం దాకా, వినుకొండ నుంచి వెండికొండ దాకా, నన్నయ నుండి వేమన దాకా ఇలా ఆయన హృదయాన్ని స్పృశించి, స్పందింపజేసిన ప్రతి అంశాన్ని రసవత్తరంగా మలచిన సామాజిక సందేశాన్ని అందించిన కవి జాషువా. సమాజ సముద్ర మధనం చేసి జాషువా సాధించిన అమృత కలశం 'గబ్బిలం'. దళిత వేదనకు అక్షర రూపం 'గబ్బిలం'.


కోటానుకోట్ల నరులొక
మేటి జగన్మాతృసుతులు మిత్రులని మదిం
చాటింపు మీ సువార్తన్
జాటింపుము జీవితంబు సార్థక్యమగున్ 

(ముసాఫరులు)



సమాప్తం